ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా టైటిల్స్ అందుకున్న జట్టు ముంబై ఇండియన్స్. అయితే ఈ జట్టు ఇంత విజయవంతం కావడానికి ముఖ్య కారణం కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ ఐపీఎల్ ప్రారంభమైన మొదట్లో రోహిత్ 2008 నుండి 2010 వరకు గిల్క్రిస్ట్ కెప్టెన్సీ లోని డెక్కన్ ఛార్జర్స్ జట్టులో ఆడాడు. అప్పుడు 2009 లో ఈ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఇక అప్పుడు ఈ జట్టులో సభ్యుడు అయిన ప్రజ్ఞాన్ ఓజా తాజాగా రోహిత్ కెప్టెన్సీ పై కీలక వ్యాఖ్యలు చేసాడు.
రోహిత్ శర్మలో కెప్టెన్సీ సామర్థ్యాన్ని గ్రహించిన మొదటి వ్యక్తి ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్క్రిస్ట్ అని ఓజా తెలిపాడు. అందుకే రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్ కు వైస్ కెప్టెన్ గా ఉండాలని ఆడమ్ గిల్క్రిస్ట్ కోరుకున్నాడు అని ఓజా వెల్లడించాడు. రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ప్రారంభించిన రెండేళ్లలోనే వేరే ఆటగాళ్లను చక్కగా అంచనా వేసేవాడు. అలాగే గేమ్ ప్లాన్ లో అతను చేసే మార్పులతో అప్పుడు మేనేజ్మెంట్ అతనిలో కెప్టెన్ ను చూడటం ప్రారంభించింది” అని ఓజా అన్నారు.