Vaibhav Sooryavanshi Debut: ఆడించమని వైభవ్‌ సూర్యవంశీకి చెప్పండి!

  • ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లలో వైభవ్‌కు చోటు
  • వైభవ్ అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
  • వైభవ్‌తో సరైన కమ్యూనికేషన్ అవసరం అంటున్న పార్థివ్
Vaibhav Sooryavanshi India Debut

Vaibhav Sooryavanshi India Debut

Parthiv Patel about Vaibhav Sooryavanshi Debut: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 15 ఏళ్ల ఈ బ్యాటర్‌కు ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లకు భారత జట్టులో చోటు దక్కినప్పటికీ.. ఇప్పటివరకు తుది జట్టులో అవకాశం మాత్రం రాలేదు. ఈ అంశంపై మాజీ క్రికెటర్లు, అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ ఈ విషయంపై స్పందించాడు. అరంగేట్రంపై వైభవ్‌తో టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టంగా మాట్లాడాలని సూచించాడు. నిన్ను ఇప్పుడే ఆడించమని అతడికి చెప్పడం టీమ్ మేనేజ్‌మెంట్ బాధ్యత అని పేర్కొన్నాడు.

స్టార్ స్పోర్ట్స్‌లో పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ సిరీస్‌లో ఏదో ఒక దశలో వైభవ్‌కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే అంతకంటే ముఖ్యమైనది అతడితో సరైన కమ్యూనికేషన్ ఉండటమేనని పేర్కొన్నాడు. ‘కోచింగ్ స్టాఫ్‌లో ఉన్నప్పుడు యువ ఆటగాళ్లకు సరైన సంకేతాలు ఇవ్వడం చాలా ముఖ్యం. వైభవ్‌ను ఆడించకూడదని నిర్ణయించినా.. ఆ విషయాన్ని అతడికి నేరుగా చెప్పాలి. అతడు కేవలం 15 ఏళ్ల బాలుడు. అతడితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొంత ఓపికగా ఉండాలని అర్థమయ్యేలా చెప్పాలి’ అని పార్థివ్ పటేల్ సూచించాడు.

ప్రస్తుతం భారత టీ20 జట్టులో ఓపెనర్‌గా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు బలమైన పోటీ ఇస్తున్నారని పార్థివ్ గుర్తు చేశాడు. టీ20 ప్రపంచకప్ 2026లో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించారని, అందువల్ల ప్రస్తుతం వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కడం అంత సులభం కాదని పేర్కొన్నాడు. ‘సంజు ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇషాన్ ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాటర్, అభిషేక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వైభవ్‌కు వెంటనే అవకాశం దక్కకపోవచ్చు. కానీ ఆ విషయాన్ని అతడికి స్పష్టంగా తెలియజేయడం టీమ్ మేనేజ్‌మెంట్ బాధ్యత’ అని పార్థివ్ చెప్పుకొచ్చాడు.

ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ అనూహ్యంగా 0-2తో ఓటమిపాలైంది. ఆ సిరీస్‌లోనూ వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండా ముగిసింది. అందులోనూ బుడ్డోడికి అవకాశం దక్కలేదు. దీంతో రెండో టీ20లోనైనా ఈ యువ సంచలనానికి అరంగేట్రం అవకాశం దక్కుతుందా? అనే ఉత్కంఠ అభిమానుల్లో కొనసాగుతోంది. చూడాలి మరి టీమ్ మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో.