RCB Highest Successful Chases: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రాయ్పూర్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్లో 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. ఈ విజయం ఆర్సీబీకి ప్రత్యేకంగా నిలిచింది. ఆర్సీబీ చరిత్రలో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్లలో ఇది ఆరో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆర్సీబీ అత్యధిక విజయవంతమైన ఛేజ్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్పై 228 పరుగులుగా ఉంది.
కోల్కతాపై బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 19.1 ఓవర్లలోనే ఛేదించింది. కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో నాటౌట్గా నిలిచి మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశాడు. కింగ్ ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. కోహ్లీ ఈ ఇన్నింగ్స్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడంతో పాటు.. ఐపీఎల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుల రికార్డును కూడా సమం చేశాడు. ఛేజింగ్ మాస్టర్ కోహ్లీ రన్స్ కొడితే.. అర్సిబీ తప్పకుండా గెలుస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.
ఐపీఎల్ చరిత్రలో లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒత్తిడి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం, భారీ లక్ష్యాలను సులభంగా ఛేజ్ చేయించడం, చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చడం కోహ్లీకి అలవాటే. ముఖ్యంగా ఆర్సీబీ భారీ లక్ష్యాలను ఛేదించిన మ్యాచుల్లో కోహ్లీ కీలక పాత్ర పోషించిన గణాంకాలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ల జాబితాను పరిశీలిస్తే.. దాదాపు ప్రతి మ్యాచ్లో విరాట్ కోహ్లీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్య ఛేదనలో కింగ్ పరుగులు చేస్తే ఆర్సీబీ విజయం దాదాపు ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో బలపడుతోంది. ఇటీవల రాయ్పూర్లో కోల్కతా నైట్ రైడర్స్పై 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన మ్యాచ్ దీనికి తాజా ఉదాహరణగా నిలిచింది. ఆ మ్యాచ్లో కోహ్లీ అజేయ సెంచరీతో చెలరేగి ఆర్సీబీకి అద్భుత విజయాన్ని అందించాడు.
