Shreyas Iyer Says Hard to Stop Punjab Kings Now: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో ఓటమనేదే లేదు. నాలుగు విజయాలు అందుకోగా.. ఓ మ్యాచ్ రద్దయింది. గురువారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచిన పీబీకేఎస్.. మరో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ముంబైపై ఘన విజయం అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ జట్టు ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో జట్టు ఆడుతున్న తీరు అద్భుతంగా ఉందని, ఇదే మోమెంటమ్ కొనసాగించాలని చూస్తున్నామని తెలిపాడు. ఇటీవలి మ్యాచ్లలో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చి తమకు మద్దతు ఇస్తున్నారని, రోజురోజుకు తమకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోందని, ఇక తమను ఆపడం కష్టమే అని శ్రేయస్ నవ్వుతూ చెప్పాడు.
‘మేము టోర్నీలో ముందుకు వెళ్లే విషయంలో చాలా నమ్మకంగా, ఆశావహంగా ఉన్నాం. ఇప్పటివరకు మేము ఆడుతున్న విధానం అద్భుతంగా ఉంది. ప్రతి మ్యాచ్ మాకు చాలా కీలకం. జట్టుగా, యూనిట్గా మేము కలిసి కట్టుగా రాణిస్తున్నాం. ఈరోజు పూర్తి స్థాయి విజయం సాధించడం ఆనందంగా ఉంది. యువ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ గత సీజన్తో పోలిస్తే చాలా మెచ్యూరిటీ చూపిస్తున్నాడు. అప్పట్లో పవర్ప్లేలో దూకుడుగా ఆడేవాడు. ఇప్పుడు మ్యాచ్ను ఫినిష్ చేసే స్థాయికి ఎదిగాడు. యువ ఆటగాళ్లు బాధ్యత తీసుకుని మ్యాచ్ గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. ప్రభ్సిమ్రన్ గొప్ప టాలెంట్ ఆటగాడు’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు.
Also Read: Arshdeep Singh History: ఐపీఎల్లో అర్ష్దీప్ సింగ్ ‘సెంచరీ’.. ఏకైక బౌలర్గా అరుదైన రికార్డు!
‘ముంబై ఇండియన్స్ ఎక్కువగా రన్స్ చేయకపోవడానికి నా క్యాచ్ (నవ్వుతూ) కీలకం అనిపించింది. నిజంగా చెప్పాలంటే మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లాగే పవర్ప్లే తర్వాత బౌండరీలను నియంత్రించడంపై దృష్టి పెట్టాం. ముందే ఆలోచించకుండా ప్రస్తుతానికి అనుగుణంగా ఆడటమే మా ప్లాన్. మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే అనే విషయంపై ప్రత్యేకంగా ఆలోచించలేదు. ఇప్పటివరకు టాస్ గెలుస్తూ వస్తున్నాను. అయినప్పటికీ మాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ప్రతి ఆటగాడు తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు.
‘ప్రతి మ్యాచ్తో మేము మెరుగుపడుతున్నాం. ప్రత్యర్థిపై కాకుండా ఆటపై దృష్టి పెట్టాలి. ఇదే మా విజయాలకు అసలు రహస్యం. ఇదే విధానం కొనసాగితే మాకు విజయాలు వస్తూనే ఉంటాయి’ అని శ్రేయాస్ ధీమా వ్యక్తం చేశాడు. అభిమానుల మద్దతుపై కూడా అయ్యర్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘ఇటీవలి మ్యాచ్లలో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చి మాకు మద్దతు ఇస్తున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. వారి ప్రేమ, మద్దతు మాకు మరింత ఉత్సాహం ఇస్తోంది. ఇదే ఊపు కొనసాగిస్తాం. టోర్నీలో ముందుకు దూసుకెళతాం’ అని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. పంజాబ్ ఈ సీజన్లో సమిష్టిగా రాణిస్తూ టైటిల్ రేసులో బలంగా నిలుస్తోంది.