ఐపీఎల్ 2026లో భాగంగా మరికొన్ని గంటల్లో గువాహటి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆడిన అన్ని మ్యాచ్లలో గెలిచిన బెంగళూరు, రాజస్థాన్ టీమ్స్ తలపడుతుండడంతో.. ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గువాహటిలో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. గత మ్యాచ్లో బుమ్రా-వైభవ్ పోరు మాదిరే.. ఈరోజు భువీ-వైభవ్ పోరుపైనే అందరి కళ్లూ ఉన్నాయడంలో సందేహం లేదు.
ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ ఈ మ్యాచ్కు అందుబాటులో లేడు. అతని గైర్హాజరీ జట్టుకు కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఆర్సీబీ బౌలింగ్ విభాగం మాత్రం బలంగానే ఉంది. భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ వంటి టాప్ బౌలర్లతో ఆర్సీబీ బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్లను కట్టడి చేస్తే రాజస్థాన్ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. ఇక ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మలతో బెంగళూరు బ్యాటింగ్ కూడా బాగుంది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతౌల్యంతో ఉంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్, జైస్వాల్ ఈ మ్యాచ్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఆర్సీబీ బౌలర్లైన భువనేశ్వర్, డఫీలను ఎలా ఎదుర్కొంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మయెర్లతో బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా, నాండ్రీ బర్గర్, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ ఉన్నారు. మరో హైలైట్ పోరాటం సందీప్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య ఉండనుంది. కోహ్లీ వంటి స్టార్ బ్యాటర్ను సందీప్ ఎలా అడ్డుకుంటాడన్నది మ్యాచ్ ఫలితంపై కీలకంగా మారవచ్చు.