భారత క్రికెట్లో స్పీడ్ కంటే.. స్వింగ్, లైన్ అండ్ లెంగ్త్తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. టీమిండియాలో స్వింగ్ బౌలర్లు ఎందరో ఉన్నా.. భువీకి ఉన్న క్రేజ్ వేరే. ఎంఎస్ ధోనీ కెప్టెన్గా ఉన్న సమయంలో వన్డేల్లో భువీతో వరుసగా 8 ఓవర్లు వేయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టీ20ల్లో కూడా అద్భుత బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. తన స్వింగ్ బౌలింగ్తో కెరీర్లో ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. అయితే భువనేశ్వర్ వెలుగులోకి రావడానికి మాత్రం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అని చాలా మందికి తెలియదు.
భువనేశ్వర్ కుమార్ కెరీర్లో 2009 రంజీ ట్రోఫీ ఫైనల్ అత్యంత ప్రత్యేకం. ఫైనల్లో సచిన్ టెండూల్కర్ను భువీ డకౌట్ చేశాడు. సచిన్కు డొమెస్టిక్ క్రికెట్లో ఏకైక డక్ కావడం విశేషం. సచిన్ను డొమెస్టిక్ క్రికెట్లో డకౌట్ ఔట్ చేసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఆ బంతే భువీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆపై దేశవాళీ క్రికెట్లో రాణించి.. టీమిండియాలోకి వచ్చాడు. 2012లో భారత్ తరఫున మొదటి మ్యాచ్ ఆడాడు. భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో డెబ్యూ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్లో భువనేశ్వర్ కుమార్ ఎన్నో ప్రత్యేకమైన రికార్డులు నెలకొల్పాడు. వన్డే క్రికెట్లో తొలి బంతికే వికెట్ తీసిన తొలి భారత పేసర్గా నిలిచాడు. తన స్వింగ్ బౌలింగ్తో ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్లను ఇబ్బందులకు గురిచేశాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున భువీ ప్రదర్శన అద్భుతం అనే చెప్పాలి. 2016లో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. పర్పుల్ క్యాప్ను అందుకున్నాడు. 2017లో కూడా వరుసగా రెండోసారి పర్పుల్ క్యాప్ గెలిచి తన నిలకడను చాటాడు.
భువనేశ్వర్ కెరీర్లో మరో విశేషం ఏమిటంటే.. ఐపీఎల్ చరిత్రలో 200కి పైగా వికెట్లు తీసిన ఏకైక పేసర్గా నిలవడం. 140 కిమీ వేగంతో బంతులు వేయకపోయినా.. కేవలం స్వింగ్, లైన్ అండ్ లెంగ్త్, ఖచ్చితత్వంతో బంతులు వేసి సక్సెస్ అయ్యాడు. ఇంజరీలు అతని కెరీర్ను పలుమార్లు అడ్డుకున్నప్పటికీ.. ప్రతిసారి మరింత బలంగా తిరిగి చ్ఛాడు. సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూలలో ఎక్కువగా భువీ కనిపించకపోయినా.. తన ఆటతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ 2026లో బెంగళూరు తరఫున ఆడుతూ దుమ్మురేపుతున్నాడు.