ఈసారి ఐపీఎల్ లో అనూహ్య ఫలితాలు కనిపిస్తున్నాయి. సీజన్లోకి ప్రవేశించిన జట్లు విలక్షణ ఫలితాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఏ సీజన్లో కూడా ఒక జట్టు తొలి 9 మ్యాచ్లలో 8 విజయాలు సాధించిన చరిత్ర లేదు. కానీ ఈసారి గుజరాత్ టైటాన్స్ తన సత్తా చాటింది. మరోసారి సమష్టి ప్రదర్శనతో చక్కటి ఆటతీరు కనబర్చిన గుజరాత్ వరుసగా ఐదో విజయాన్ని అందుకుని వాహ్ వా అనిపించింది. తొలి మూడు మ్యాచ్లు గెలిచాక సన్రైజర్స్ చేతిలో ఓడిన టీమ్ ఆ తర్వాత మళ్లీ ఓటమి అనేది లేకుండా ముందుకు సాగుతోంది. తాజాగా 8వ సారి గెలుపును తమ ఖాతాలో వేసుకొని ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ను ఇంచుమించుగా కన్ఫర్మ్ చేసుకుంది.
శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో టైటాన్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వరుస వైఫల్యాలకు ఫుల్స్టాప్ పెడుతూ కోహ్లి (53 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, రజత్ పటిదార్ (32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా ఆకట్టుకోవడం విశేషంగా చెబుతున్నారు. మ్యాక్స్వెల్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడు ప్రదర్శించాడు.
తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటా న్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ తెవా టియా (25 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు), డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది.
* గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్ లు ఆడి 8 మ్యాచ్లలో గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోయి 16 పాయింట్లతో అగ్రస్థానంలో వుంది.
* రాయల్ ఛాలెంజర్స్ జట్టు 9 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్ లలో ఓడిపోయి 12 పాయింట్లు సాధించి 2వ స్థానంలో వుంది
* లక్నో సూపర్ జెయింట్స్ 9 మ్యాచ్ లు ఆడగా 6 మ్యాచ్ లు గెలిచి 3 మ్యాచ్ లలో ఓడిపోయి 12 పాయింట్లతో మూడవస్థానంలో వుంది.
* సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 9 మ్యాచ్ లు ఆడగా 6 మ్యాచ్ లు గెలిచి 3 మ్యాచ్ లలో ఓడిపోయి 12 సాయింట్లతో నాల్గవ స్థానంలో వుంది.