T20 World Cup : టీ20 వరల్డ్ కప్లో భారత్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. సంజు శాంసన్ తన కెరీర్లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్తో భారత్ను గెలుపు తీరాలకు చేర్చాడు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. సూర్య (18) త్వరగానే అవుట్ అయినప్పటికీ, శాంసన్ ఏమాత్రం తడబడకుండా విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ ఛేజింగ్లో ఒక భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరుగా శాంసన్ రికార్డు సృష్టించాడు.
శాంసన్కు తోడుగా యువ ఆటగాడు తిలక్ వర్మ (15 బంతుల్లో 27 పరుగులు 4 ఫోర్లు, 1 సిక్సర్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (17) కీలక సమయంలో అవుట్ అవ్వగా, శివం దూబే (8*) వరుసగా రెండు ఫోర్లు బాది ఒత్తిడిని తగ్గించాడు. చివరి ఓవర్లో 7 పరుగులు అవసరమైన దశలో రొమారియో షెపర్డ్ బౌలింగ్లో శాంసన్ ఒక సిక్సర్, ఒక ఫోర్ బాది 199 పరుగులతో విజయకేతనం ఎగురవేశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండీస్ బ్యాటర్లు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నప్పటికీ, భారత బ్యాటింగ్ పటిమ ముందు ఆ స్కోరు సరిపోలేదు. విండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్, జేసన్ హోల్డర్ తలో రెండు వికెట్లు తీశారు. అయితే ఆఖరి ఓవర్లలో ఓవర్ రేట్ పెనాల్టీ కారణంగా విండీస్ అదనపు ఫీల్డర్ను సర్కిల్లో ఉంచాల్సి రావడం భారత్కు కలిసొచ్చింది. ఈ విజయంతో వెస్టిండీస్ వరల్డ్ కప్ ప్రయాణం ముగియగా, భారత్ సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అత ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంసన్ మ్యాచ్ హీరోగా నిలిచాడు. గెలుపు అనంతరం శాంసన్ మోకాళ్లపై కూర్చుని తన హెల్మెట్ తీసి ప్రార్థన చేసుకున్న దృశ్యం అభిమానులను ఆకట్టుకుంది.
