ICC May Shift 2029 Champions Trophy and 2031 World Cup from India: క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భవిష్యత్ టోర్నీల నిర్వహణపై కీలక ఆలోచనలు చేస్తోందని సమాచారం. ముఖ్యంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2029, వన్డే ప్రపంచ కప్ 2031 ఆతిథ్య హక్కులను భారత్కు ఇవ్వకుండా.. వేరే దేశానికి మార్చే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాకు ఐసీసీ టోర్నీలు తరలి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలే ఐసీసీ నిర్ణయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడం వల్ల ఐసీసీ మెగా టోర్నీల నిర్వహణలో లాజిస్టిక్, భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ టోర్నీలను ఆస్ట్రేలియాకు తరలించే అంశాన్ని ఐసీసీ అంతర్గతంగా చర్చిస్తున్నట్లు బ్రిటన్కు చెందిన ప్రముఖ పత్రిక పేర్కొంది.
ఆస్ట్రేలియాకు ఐసీసీ టోర్నీలు నిర్వహించిన అనుభవం ఉండటంతో పాటు మౌలిక వసతులు, స్టేడియాలు, భద్రతా ఏర్పాట్లు ఉండటం కూడా కీలక కారణాలుగా చెప్పబడుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయినప్పటికీ ఈ వార్త క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే.. భారత్కు భారీ షాక్ అనే చెప్పాలి. ఆదాయంతో పాటు పేరు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అయితే భవిష్యత్లో పరిస్థితులు మారితే ఐసీసీ తుది నిర్ణయం మారే అవకాశమూ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.