ఐపీఎల్ 2022 తొలి క్వాలిఫయర్ క్రికెట్ అభిమానులకు మంచి మజా అందించింది. ఆడేది తొలి ఐపీఎల్ సీజన్ అయినా ఏ మాత్రం బెరుకు లేకుండా ఆడిన గుజరాత్ టైటాన్స్ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్ ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది. 189 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్ సాహా డకౌట్ కాగా శుభ్మన్ గిల్(35), మాథ్యూ వేడ్(35) రాణించారు.
IPL Qualifier 1: జాస్ బట్లర్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ స్కోరు
అయితే మూడు వికెట్లు పడిపోవడంతో రాజస్థాన్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే హార్డిక్ పాండ్యా(40 నాటౌట్), మిల్లర్(68 నాటౌట్) ఎడాపెడా బౌండరీలతో లక్ష్యానికి చేరువగా వెళ్లారు. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా రాజస్థాన్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ బౌలింగ్ చేశాడు. అయితే అతడు వేసిన తొలి మూడు బంతులను డేవిడ్ మిల్లర్ స్టాండ్స్లోకి పంపించడంతో గుజరాత్ ఘనవిజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, మెకాయ్ చెరో వికెట్ తీశారు. బట్లర్ ఇన్నింగ్స్ వృథా అయ్యింది. లీగ్ దశలో ఎక్కువ విజయాలతో మొదటగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన గుజరాత్ ఫైనల్లోకి కూడా మొదటగానే చేరింది. అయితే ఈ మ్యాచ్లో ఓడిపోయిన రాజస్థాన్కు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో రాజస్థాన్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో తలపడనుంది.