ఈ ఏడాది ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ రేస్ నుండి మొదట తప్పుకున్న జట్టుగా నిలిచింది సన్రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2021 లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్లలో హైదరాబాద్.. కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఏకంగా 11 మ్యాచుల్లో ఓడి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ సన్రైజర్స్ జట్టుకే కాదు, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు కలిసిరాలేదు. దాంతో కెప్టెన్గా అతడిని తప్పించి.. కేన్ విలియమ్సన్ను నియమించారు. హైదరాబాద్ జట్టుకు తొలి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్ పట్ల మేనేజ్మెంట్ కఠినంగా వ్యవహరించింది. ముందుగా కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా.. ప్లేయింగ్ ఎలెవన్లో కూడా చోటివ్వలేదు. ఇక తాజాగా వార్నర్ తో ఫ్రాంఛైజీ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో ఫ్యాన్స్కు కోపం తెప్పించింది. ఐపీఎల్ 2021 లీగ్ దశ ముగిసిన తర్వాత అభిమానుల కోసం వీడ్కోలు వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో వార్నర్ కనిపించలేదు. దాంతో ఓ అభిమాని వార్నర్ను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసి.. వీడ్కోలు వీడియోలో ఎందుకు లేరంటూ ప్రశ్నించాడు. అందుకు ఎస్ఆర్హెచ్ మాజీ కెప్టెన్ స్పందిస్తూ.. వీడియోలో మాట్లాడమని తనను ఎవరూ అడగలేదని పేర్కొన్నాడు. దాంతో జట్టు మేనేజ్మెంట్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.