Anurag Thakur Gives Strong Counter To Pakistan Cricket Board: వచ్చే ఏడాది ఆసియా కప్ వన్డే టోర్నీని పాకిస్తాన్లో నిర్వహిస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ పాల్గొనదని జై షా చేసిన వ్యాఖ్యలు క్రీడా రంగంలో అగ్గి రాజేస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ బోర్డు తీవ్రంగా స్పందిస్తూ.. ఆసియా కప్ కోసం పాకిస్తాన్లో భారత్ అడుగుపెట్టకపోతే, ఇండియాలో జరిగే 2023 వన్డే వరల్డ్కప్ను తాము కూడా బాయ్కాట్ చేస్తామని బెదిరింపులకు దిగింది. కమ్రాన్ అక్మల్, యూనిస్ ఖాన్ లాంటి పాక్ మాజీ ఆటగాళ్లైతే మరింత రెచ్చిపోయారు. భారత్తో ఇకపై పాక్ ఆడదని అన్నారు. కమ్రాన్ అయితే.. అక్టోబర్ 23న జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచే పాక్ ఆడదని తెగేసి చెప్పాడు.
ఈ కామెంట్లకు గాను తాజాగా భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గట్టి కౌంటర్లు ఇచ్చారు. భారత్ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్లో పాల్గొనమని తాము ఎవ్వరినీ బ్రతిమిలాడే ప్రసక్తే లేదని.. పాక్ని ఉద్దేశిస్తూ ఘాటుగా బదులిచ్చారు. వచ్చే వారిని భారత్ స్వాగతిస్తుందని.. రావడం, రాకపోవడం ఆయా జట్ల ఇష్టమని చెప్పారు. అసలు ఈ విషయంపై స్పందించాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పారు. భారత్ ఓ క్రీడా శక్తి అని, ప్రపంచ క్రికెట్ చరిత్రలో బీసీసీఐకి అత్యున్నత హోదా ఉందని పేర్కొన్నారు. ఇంతకుముందు ఎన్నోసార్లు భారత్ ఎన్నో ప్రపంచకప్లను సమర్ధవంతంగా నిర్వహించిందని గుర్తు చేశారు. పాక్ బెదిరింపులకు భారత్ తలొగ్గదని, ఒక్కసారి ఫిక్స్ అయితే మా మాటే మేమే వినము అన్నట్టుగా పాక్కి మొట్టికాయలు వేశారు.