హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన చేసిన దాదాపు అన్ని తమిళ సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి, స్ట్రైట్ సినిమా లాగానే రిలీజ్ చేస్తుంటారు. తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన చిత్రం “రెట్రో”. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేశారు. సుమారు 10 కోట్ల రూపాయలతో హక్కులు కొనుగోలు చేసి, ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పరిచిన ఈ చిత్రం ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
రెట్రో కథ:
పారి అలియాస్ పారివేల్ కన్నన్ (సూర్య)ను ఇష్టం లేకపోయినా, తిలక్ (జోజు జార్జ్) తన భార్య బలవంతం మేరకు దత్తత తీసుకుని పెంచుకుంటాడు. స్వతహాగా రౌడీ అయిన తిలక్ మొదట పారిని తన కుమారుడిగా అంగీకరించడు. కానీ, ఒకసారి తన మీద హత్యాయత్నం జరిగినప్పుడు పారి అతన్ని కాపాడడంతో, అప్పటి నుంచి తన కొడుకుగా భావించి చేరదీస్తాడు. అయితే, తండ్రి కోసం పారి కూడా రౌడీలా మారి, తండ్రికి కావలసిన పనులన్నీ చేస్తుంటాడు. చిన్నప్పుడే తనకు పరిచయమైన రుక్మిణి (పూజా హెగ్డే)తో పారి ప్రేమలో పడతాడు. పెద్దలందరినీ ఒప్పించి ఆమెను వివాహం చేసుకున్న తర్వాత, రౌడీ జీవితాన్ని వదిలేసి దూరంగా వెళ్లి బతకాలనుకుంటాడు. కానీ, అంతకుముందే తన తండ్రి ద్వారా చేసిన ఒక డీల్ కారణంగా, పెళ్లిలోనే తన తండ్రి చేయి నరకాల్సి వస్తుంది. దీంతో రుక్మిణి పారిని వదిలేసి దూరంగా వెళ్లిపోతుంది. తండ్రి చేయి నరికినందుకు పారికి భారీ జైలు శిక్ష పడుతుంది. ఆ తర్వాత పారి రుక్మిణిని కలిశాడా? చేయి నరికిన తర్వాత తండ్రి మీద ఎలాంటి పగ తీర్చుకున్నాడు? అసలు పారి కన్న తల్లిదండ్రులు ఎవరు? అలాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్పై చూడాల్సిందే.
విశ్లేషణ:
కార్తీక్ సుబ్బరాజ్ తమిళ దర్శకులలో మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు. అయితే, ఈ మధ్య కాలంలో అతని నుంచి వస్తున్న సినిమాలు నిరాశపరుస్తున్నాయి. ఈ క్రమంలో సూర్య హీరోగా “రెట్రో” అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమా కథ మొదలైనప్పటి నుంచి ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పడుతుంది. అయితే, సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ ఆసక్తి క్రమంగా సడలిపోతుంది. ఇంటర్వెల్ సమయానికి, “ఎందుకు ఇంత సాగదీస్తున్నారు?” అనే అనుమానం కలుగుతుంది. నిజానికి, ఇది కొత్త కథ అసలే కాదు. ఎప్పటి నుంచో తెలుగు, తమిళ భాషల్లో చూస్తున్న కథలను అనుసరిస్తూ ఈ సినిమా కథ రాసుకున్నారు. తల్లిదండ్రుల నుంచి వేరై, విలన్ గ్యాంగ్కు దొరికిన కుర్రాడు ఆ గ్యాంగ్తోనే పెరిగి, వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతాడు. ఒక సమయంలో అతను చేసేది మంచిది కాదని తెలుసుకుని వారికి ఎదురు తిరుగుతాడు. ఇలాంటి కథాంశంతో మనం ఎన్నో సినిమాలు చూశాం. ఈ సినిమా కూడా దాదాపు అలాగే సాగుతుంది. సెకండ్ హాఫ్లోకి వెళ్లిన తర్వాత, హీరో కుటుంబ నేపథ్యం, అతను ఎవరి కుమారుడు, ఎందుకు తిరిగి చివరికి తన తల్లిదండ్రుల దగ్గరకు చేరాడు లాంటి విషయాలను ఆసక్తికరంగా రాసుకున్నాడు దర్శకుడు. అయితే, ఇవన్నీ ప్రేక్షకులు ఊహించగలిగేలా సాధారణంగా ఉండటం గమనార్హం. సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగానే రాసుకున్నారు. ఆది చూసి, “ఇదేదో గట్టిగా కొట్టేట్టు ఉంది” అని అనుకునేలోపే, సెకండ్ హాఫ్ మొదలై, అదేమీ లేదని తేల్చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో తీసుకున్న పాయింట్ బాగుంది అనుకునేలోపే, ఎన్నో లేయర్స్ కథను కన్ఫ్యూజ్ చేసి, ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులకు బోర్ కొట్టేలా చేస్తుంది.
ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికొస్తే, సూర్య చాలా కాలం తర్వాత తనలోని నటుడిని బయటపెట్టే పాత్రను ఎంచుకున్నాడు. కొన్ని సీన్స్లో కళ్లతోనే భావాలు పలికించాల్సిన పరిస్థితుల్లో సూర్య తనలోని పర్ఫార్మర్ను బయటకు తీసుకొచ్చాడు. ఒకరకంగా పారి అనే పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. పూజా హెగ్డేకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర దొరికింది. అంగాంగ ప్రదర్శన జోలికి వెళ్లకుండా, నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక జోజు జార్జ్, విధు వినోద్, మలయాళ నటుడు జయరాం వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. క్రూరమైన రాజుగా నాజర్ మెప్పించాడు. ఇక ఈ సినిమాకు సాంకేతిక నిపుణుల విషయానికొస్తే, సంతోష్ నారాయణన్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదరగొట్టాడు. అయితే, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడో విన్న ఫీలింగ్ కలిగితే, అది మన తప్పు కాదు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ ఒక ప్లస్ పాయింట్. తెలుగు డబ్బింగ్ బాగుంది, అయితే తెరపై చూపించే పేర్ల స్పెల్లింగ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. కార్తీక్ సుబ్బరాజ్ రాసుకున్న కథ బాగుంది, కానీ దాన్ని అందంగా తెరపైకి తీసుకొచ్చే కథనం విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి.
ఫైనల్గా: ఈ “రెట్రో” ఓన్లీ ఫర్ సూర్య ఫాన్స్. కామన్ ఆడియన్స్కు కండీషన్స్ అప్లై.