‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’గా పేరు తెచ్చుకున్న శ్రీవిష్ణు, ఈసారి ‘కింగ్ ఆఫ్ కంటెంట్’ అంటూ ‘మృత్యుంజయ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి ఆయన నటించిన ‘విష్ణు విన్యాసం’, ఈ ‘మృత్యుంజయ్’ సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో వారం గ్యాప్తో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశారు. సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని, గుణ్ణం గంగరాజు కుమారుడు సందీప్ గుణ్ణం నిర్మించారు. ఈ సినిమాకి ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ సపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లింది. అయితే సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
మృత్యుంజయ్ కథ:
మృత్యుంజయ్ (శ్రీవిష్ణు) హైదరాబాద్లో ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఎవరైనా చనిపోతే రకరకాల వేషాలు వేసుకుని వెళ్లి, ఆ ఇళ్లలోని వాళ్ళని ఒప్పించి తమ పేపర్కు ‘శ్రద్ధాంజలి’ యాడ్ ఇప్పించడమే అతని ఉద్యోగం. ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్ అవ్వాలని భావిస్తూ ఉండే అతనికి, అనుకోకుండా ఒక చిన్న పాప కారణంగా ఒక కేసు మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ పాప తండ్రిది సహజ మరణం కాదని, ప్లాన్ చేసిన మర్డర్ అని అతను భావిస్తూ ఉంటాడు.
ఈ క్రమంలోనే ఏసీపీ సీత (రెబా మౌనిక జాన్) దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తాడు. ఆమె ముందుగా ఇతన్ని నమ్మదు, కానీ తర్వాత ఇతని మీద జరిగిన హత్యా ప్రయత్నంతో ఆమె కూడా నమ్మడం మొదలు పెడుతుంది. అయితే జై భావించినట్లుగా నిజంగానే అది మర్డరా? లేక ప్రమాదమా? చివరికి జై దాన్ని ఏమని ప్రూవ్ చేశాడు? దాని కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఒకప్పుడు వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీవిష్ణు, ఇప్పుడు పూర్తిగా వినోదాత్మకమైన సినిమాల మీదే ఫోకస్ చేశాడు. అయితే వాటికి భిన్నంగా ఈ సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమా ఒక రకంగా థ్రిల్లర్. మొదటి నుంచి చివరి వరకు థ్రిల్ పంచేలా దర్శకుడు సినిమా కథ రాసుకున్నాడు. అయితే అది పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ కాలేదు.
వాస్తవానికి ఒకేలా ఆలోచించే హీరో, విలన్ కథలు తెలుగులో చాలా వచ్చాయి. వాటికి ఏమాత్రం భిన్నంగా లేనట్టుగా ఈ సినిమా కూడా అనిపించింది. పెద్దగా లాజిక్స్ జోలికి వెళ్ళకుండానే సినిమా కథ మొత్తం నడిపించే ప్రయత్నం చేశారు. ఒక పేపర్లో యాడ్స్ తెచ్చుకునే హీరో తనలాగే ఆలోచించే విలన్ను గుర్తించడం, అతన్ని పోలీసులకు పట్టించాలనే ప్రయత్నం చేయడం చాలా రొటీన్ అనిపిస్తుంది. అయితే సినిమా మాత్రం ఒక విషయంలో సక్సెస్ అయింది; అదేమిటంటే చివరి వరకు ప్రేక్షకుల ఊహకు అందకుండా నడిపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కానీ ఆ ప్రయత్నంలో ఏమాత్రం లాజిక్స్ని పట్టించుకోలేదు.
ఒక రకంగా ఇది మైండ్ గేమ్తో రాసుకున్న కథ. సుకుమార్ శిష్యుడు కావడంతో దాదాపుగా అలాంటి స్క్రీన్ ప్లేతోనే సినిమా నడిపించే ప్రయత్నం చేశాడు. ఒక చిన్నారి తండ్రి చనిపోవడం, ఆ చిన్నారిలో తనను తాను చూసుకున్న హీరో, ఆమెకు ఆమె తండ్రి ఎలా చనిపోయాడు అనేది చెప్పడం కోసం ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం సిద్ధమవడం ఆసక్తి రేకెత్తిస్తుంది. స్వతహాగా క్రైమ్ రిపోర్టర్గా ఎదగాలనుకునే అతను ఆ పాప కోసం ‘షాడో క్రైమ్ రిపోర్టర్’ అవతారం ఎత్తి ఒక కేసును డీల్ చేసే విధానం ఆకట్టుకుంది.
సాధారణంగా ఇలాంటి సినిమాలలో విలన్ను చాలా భయంకరంగా చూపిస్తూనే అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలాంటి వాటి జోలికి వెళ్లకుండా కేవలం హీరో వర్సెస్ విలన్ ‘టామ్ అండ్ జెర్రీ’ దాగుడుమూతలు మాత్రమే డిజైన్ చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ థ్రిల్లర్ కొంతవరకు థ్రిల్ పంచినా, పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. దర్శకుడు రాసుకున్న కథ పేపర్ మీద బాగున్నట్టే అనిపించింది కానీ, ఎగ్జిక్యూషన్ విషయంలోనే తడబడ్డారు. సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కానీ కథనంలో స్థిరంగా నిమగ్నమయ్యేంత పట్టు సాధించడంలో తడబడ్డారు.
నటీనటులు & సాంకేతిక వర్గం:
నటీనటుల విషయానికి వస్తే, ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ తరహా పాత్రలకు పరిమితమైన శ్రీవిష్ణు ఈ సినిమాలో ఒక కేసును సాల్వ్ చేసే వ్యక్తిగా తనదైన శైలిలో నటించారు. ఒకపక్క రకరకాల గెటప్స్లో కనిపించే వ్యక్తిగా తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ రెబా మౌనిక జాన్ పోలీస్ పాత్రలో అంతగా సెట్ కాలేదు. విలన్ కూడా ఎందుకో పూర్తిస్థాయిలో ఆ పాత్రకు నప్పిన ఫీలింగ్ కలగలేదు, నటన వరకు ఓకే. సుదర్శన్, రచ్చ రవి వంటి నటులు ఉన్నా, దర్శకుడు వారి నుంచి నటనను మాత్రమే రాబట్టారు, కామెడీ జోలికి వెళ్లలేదు. ఇక చిన్నారి ఊహ సహా మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, కొన్ని చోట్ల నేపథ్య సంగీతం బాగానే ఉంది కానీ కొన్నిచోట్ల మాత్రం బాగా లౌడ్ అనిపించింది. పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు. అయితే కెమెరా వర్క్ మాత్రం బాగుంది, సినిమాని ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. సినిమా నిడివి కూడా కొంతవరకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి, కానీ ఫస్టాఫ్ ఎందుకో లాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.
ఫైనల్ గా: పూర్తిస్థాయిలో థ్రిల్ పంచలేకపోయిన థ్రిల్లర్ మృత్యుంజయ్ .