పూరి జగన్నాథ్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సాయిరాం శంకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 143, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో హిట్లు అందుకున్న ఆయన తరువాతి కాలంలో పెద్దగా హిట్ అందుకోలేకపోయారు. చాలా గ్యాప్ ఇచ్చిన ఆయన ఈ ఏడాది ఒక పథకం ప్రకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మలయాళంలో పలు ఆసక్తికరమైన సినిమాలు చేసిన వినోద్ విజయన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇంటర్వెల్లో విలన్ ఎవరో కనిపెడితే పదివేలు ఇస్తామని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
ఒక పథకం ప్రకారం కథ :
ఈ కథ మొత్తం 2014 విశాఖపట్నంలో జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధార్థ నీలకంఠ (సాయిరాం శంకర్) భార్య సీత (ఆషిమా నర్వాల్) షాపింగ్ కి వెళ్ళగా అక్కడ మిస్ అవుతుంది. ఆమె ఏమైందో తెలియక ఇబ్బంది పడుతున్న సిద్ధార్థ డ్రగ్స్ కు బానిస అవుతాడు. అయితే సిద్ధార్థతో కలిసి డ్రగ్స్ తీసుకునే దివ్య(భాను శ్రీ) అనూహ్యంగా దారుణమైన స్థితిలో హత్యకు గురవుతుంది. ఈ కేసు విచారణలో ఏసిపి రఘురాం(సముద్రఖని) సిద్ధార్థ ఈ మర్డర్ చేశాడని భావించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే డ్రగ్స్ కేసు కారణంగా సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో ప్రాసిక్యూటర్ గా రావాలని ప్రయత్నించే చినబాబు (కళాభవన్ మణి) కూడా సిద్ధార్థని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. అయితే తాను స్వతహాగా లాయర్ కావడంతో తాను హత్య చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు సిద్ధార్థ్. తర్వాత ఇదే క్రమంలో అనేక హత్యలు జరుగుతున్నాయని తెలుసుకుని అసలు ఈ హత్యలకు కారణం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఏసీపీ కవిత(శృతి సోది) కూడా సహకరిస్తుంది. అసలు వరుస హత్యలు చేసేది ఎవరు? ఆ హత్యలకు సిద్ధార్థకి ఏమైనా సంబంధం ఉందా? సిద్ధార్థ్ ను మాత్రమే ఇరికించాలని ఎందుకు ఏసీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా మరి కొంత మంది ప్రయత్నించారు లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని ముందు నుంచే చెబుతూ వచ్చారు మేకర్స్ దానికి తోడు విలన్ ఎవరో కనిపెడితే పట్టుకుంటే పదివేలు అనే అనౌన్స్మెంట్ చేయడంతో ఒక్కసారిగా సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది ఈ నేపథ్యంలో సినిమా ఓపెనింగ్ నుంచే సినిమా మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఫస్ట్ హాఫ్ లో ఏది గతమో ఏది ప్రస్తుతము అర్థం కాకుండా ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజన్ కి గురవుతారు. అయితే సిద్ధార్థ ఒక మర్డర్ కేసులో చిక్కుకున్న తర్వాత సినిమా మీద ప్రేక్షకులలో కొంత క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ హీరో మీద అనుమానాలు పెంచేలా ఉండగా తర్వాత సెకండ్ హాఫ్ పూర్తిగా గ్రిప్పింగ్ గా తీసుకువెళ్లడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు అంచనా వేసే విధంగానే ఉన్న దానిని కనెక్ట్ చేసిన తీరు మాత్రం ఆకట్టుకునేలా ఉంది. కావాలని అనుమానాలు కలిగించినా సరే అసలు విలన్ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఈ సినిమా ఇప్పటిది కాదు సుమారు పదేళ్ల క్రితం సినిమా. కాబట్టి విజువల్స్ కానీ కొన్ని లాజిక్ లెస్ సీన్స్ కానీ ఉన్నాయి కానీ సస్పెన్స్ విషయంలో మాత్రం దర్శకుడు కి మంచి మార్కులు పడతాయి. క్లైమాక్స్ కూడా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ థ్రిల్లర్ ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. నిజానికి దర్శకుడు మలయాళ దర్శకుడు కావడంతో మలయాళ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అనడంలో సందేహం లేదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే లాయర్ పాత్రలో సాయి రాం శంకర్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డ్రగ్స్ అడిక్ట్ గా లాయర్ గా భిన్న పార్ష్యాలు ఉన్న పాత్రలో నటించాడు. హీరోయిన్ ఆషిమా నర్వాల్ కనిపించింది కొంత సేపైనా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక మిగతా పాత్రలలో నటించిన సముద్రఖని, శృతి సోది, సుధాకర్ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. యాక్షన్ పార్ట్ కాస్త ఇంట్రెస్టింగ్ డిజైన్ చేసుకున్నారు. ముఖ్యంగా డాగ్ ఫైట్ భయం కలిగించేలా ఉంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కత్తెరకు పని చెబితే అవుట్ ఫుట్ ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది.
ఫైనల్ గా ఈ ఒక పథకం ప్రకారం థ్రిల్లర్ లవర్స్ కు ట్రీట్