ఆత్మకూరు అసెంబ్లీకి ఈ నెల 23న ఉపఎన్నిక జరగనుంది. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జరిగిన రెండు ఉపఎన్నికల్లోనూ విజయం సాధించింది. ఇప్పుడు ఆత్మకూరు వంతు వచ్చింది. ఇక్కడ గత రెండు ఎన్నికల్లో మేకపాటి గౌతంరెడ్డి వరసగా గెలిచారు. కాకపోతే 2014లో 31 వేల ఓట్ల మెజారిటీ వస్తే.. 2019లో 22 వేల ఓట్లకే అది పరిమితమైంది. గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఈ ఉపఎన్నికలో ఆయన సోదరుడు విక్రంరెడ్డే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ బై ఎలక్షన్లో బీజేపీ మినహా మిగతా పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. ఇది సొంత.. సిట్టింగ్ సెగ్మెంటే అయినప్పటికీ వైసీపీకి ఇక్కడ వచ్చే మెజారిటీ పెద్ద సవాల్గా మారిపోయింది.
ఈ మూడేళ్లలో వచ్చిన ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. అందుకే ఆత్మకూరు బై ఎలక్షన్లో లక్షకు తక్కువ కాకుండా మెజారిటీ రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారపార్టీ నేతలు. ఒక్కో మండలానికీ ఒక్కో మంత్రిని, ఎమ్మెల్యేను ఇంఛార్జ్గా పెట్టి ఎన్నికల రణతంత్రం రచిస్తున్నారు. అనంతసాగరం మండలంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, AS పేట మండలంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే ద్వారకానాథ్రెడ్డి, ఆత్మకూరు అర్బన్లో మంత్రి అంజద్ బాషా, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, ఆత్మకూరు రూరల్లో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, చేజర్ల మండలంలో మంత్రి ఆర్కే రోజా.. ఎమ్మెల్యే కొడాలి నాని, మర్రిపాడు మండలంలో మంత్రి వేణుగోపాల్కృష్ణ, ఎమ్మెల్యే అనిల్, సంగం మండలంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్రెడ్డికి ఎన్నికల బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్ఠానం.
ప్రతిపక్షాలు బరిలో లేకపోవడంతో.. ఆ పార్టీలకు చెందిన ఓట్లు కూడా వైసీపీకి మళ్లేలా నేతలు వ్యూహరచన చేస్తున్నారట. బరిలో ఉన్న బీజేపీ మాత్రం.. టీడీపీ ఓట్లు తమకే పడతాయని ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వంపట్ల ప్రజల్లో సానుకూలత ఉందని ఎస్టాబ్లిష్ చేయడంమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. గౌతంరెడ్డిపట్ల ఉన్న సానుభూతి సైతం వైసీపీకి కలిసి వస్తుందని లెక్కలేస్తున్నారట. అయితే పల్లెల్లో పర్యటించిన తర్వాత వాస్తవ పరిస్థితులు తెలుసుకుని వైసీపీ నేతలు అప్పటికప్పుడు వ్యూహాలు మార్చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వారీగా తమకు వచ్చే ఓట్లను పరిగణనలోకి తీసుకుని కార్యాచరణ రూపొందిస్తున్నారట.
క్షేత్రస్థాయిలో వైసీపీ నేతల మధ్య ఉన్న మనస్పర్ధలను మంత్రులు గమనించారట. ఆ విభేదాలను ఎన్నికలయ్యే వరకు పక్కన పెట్టాలని.. అందరు కలిసి పనిచేయాలని హితవు పలుకుతున్నారట. పనిలో పనిగా గ్రామాల్లో టీడీపీ నాయకులే లక్ష్యంగా వారితో రహస్య మంత్రంగాలు నడుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉపఎన్నికల బరిలో టీడీపీ లేకపోవడంతో.. ఈ దఫా తమకు సహకరించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కొందరు సానుకూలంగా స్పందిస్తున్నట్టు టాక్. మెజారిటీ రాకపోతే వచ్చే ఇబ్బందులను స్థానిక వైసీపీ నేతలు ఏకరవు పెడుతున్నారట. తమకు ఓట్లు పడేలా చేస్తే అన్ని విధాలా సహకరిస్తామని టీడీపీ నేతలకు హామీ ఇస్తుండటంతో.. ఈ వ్యూహం వర్కవుట్ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి.. లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యానికి రానున్న రోజుల్లో ఇంకెన్ని రణతంత్రాలు రచిస్తారో చూడాలి.