Atchannaidu : సిక్కోలు టీడీపీలో ఆయన చెప్పిందే వేదమన్నది నిన్నటి మాట. ఏదో తేడా కొడుతోందన్నది తాజా టాక్. ముప్పు పొంచి ఉందని అనుకున్నారో ఏమో.. దిద్దుబాటు చర్యలకు దిగారట. ఎన్నికలకు రెండేళ్ల ముందే కేడర్కు క్లాస్ తీసుకుంటున్నారట ఆ నాయకుడు. ఇంతకీ ఎవరా నేత? ఏమా అలజడి? లెట్స్ వాచ్..!
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రాజకీయ వేడి రగులుతోంది. ఇక్కడ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే. టీడీపీకి బలమైన కేడర్ కూడా ఉంది. వైసీపీలో అంతర్గత విభేదాలు.. అధికారపార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ. నేతలకు అస్సలు పొసగదు. అలాంటిది ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలు ఐక్యతారాగం టీడీపీ శిబిరాన్ని కలవర పెడుతోందట. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఉప్పు నిప్పులా నాయకుల మధ్య మంత్రి బొత్స సత్యనారాయణ సయోధ్య కుదిర్చినట్టు టాక్. బొత్స ఇంఛార్జ్గా వచ్చాక.. చాలా మార్పు కనిపిస్తోందట. ఆ మార్పే అచ్చెన్న అండ్ టీమ్ను ఉలిక్కి పడేలా చేస్తోందట. రిపేర్ వర్క్ స్టార్ట్ చేసినట్టు సమాచారం.
కేడర్ నిస్తేజంగా ఉండటంతోపాటు.. తన కాళ్ల కిందకే నీళ్లు వస్తున్నాయని అచ్చెన్న కలవర పడుతున్నారట. ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత టెక్కలిలో పార్టీ వ్యవహారాలను ద్వితీయశ్రేణి లీడర్స్కు అప్పగించారట. ఆయన విజయవాడలోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో లీడర్ దూరమై.. కేడర్ కూడా కార్యక్రమాలను లైట్ తీసుకుంది. స్థానిక సమస్యలపై స్పందించేవారే కరువయ్యారు. పైగా అచ్చెన్నకు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం ఎక్కువైంది. దీంతో అందరినీ పిలిచి క్లాస్ తీసుకున్నారట అచ్చెన్న.
1983 నుంచి కింజరాపు ఫ్యామిలీదే టెక్కలిలో హవా. అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచీ ఎర్రన్నాయుడు మొదలుకొని.. ఇప్పుడు అచ్చెన్నాయుడు వరకు గెలుస్తూ వస్తున్నారు. ఒకటి రెండు సందర్భాలలో మినహా మిగతాసార్లు టీడీపీదే గెలుపు. అలాంటిచోట పార్టీ కార్యక్రమాల నిర్వహణకు తెలుగు తమ్ముళ్లు వెనకడుగు వేయడం.. అచ్చెన్న బృందానికి మింగుడు పడటం లేదట. టెక్కలి టౌన్ సహా మండలంలోనూ నాయకత్వం లోపం ఉందని గుర్తించారట. నియోజకవర్గంలో టీడీపీ నేతలు నాలుగు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం మొదలుపెట్టారు. అటు వైసీపీ ఐక్యత రాగం..ఇటు టీడీపీలో విభేదాలు ఏపీ టీడీపీ చీఫ్కు నిద్ర లేకుండా చేస్తున్నాయట.
సమస్యను ఆలస్యంగా గ్రహించిన అచ్చెన్నాయుడు.. దిద్దుబాటు చర్యలైతే ప్రారంభించారు. మండలాల వారీగా పార్టీ నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. చెప్పాల్సిన వారికి సుతిమెత్తంగా చెబుతున్నారు.. మందలించాల్సిన వాళ్లకు అదే టోన్లో హెచ్చరికలు పంపుతున్నారట. ఇన్నాళ్లుగా ఒక టీమ్లా పనిచేసిన టీడీపీ నేతలకు ఏమైంది అన్నది పెద్ద ప్రశ్న. అందుకే అచ్చెన్న ప్రయత్నాలు వర్కవుట్ అవుతాయా? లేక వైసీపీ నేతల ఐక్యత పైచెయ్యి సాధిస్తుందా అన్నది చర్చ. మరి.. రానున్న రోజుల్లో టెక్కలి రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.