బిజినెస్ ముఖ్యమా? పార్టీ ముఖ్యమా? ప్రస్తుతం టీడీపీలో ఇదే చర్చ. కొంతమంది నేతలు బిజినెస్సే ముఖ్యమనే రీతిలో వ్యవహరిస్తూ… కుదిరిన సమయంలో మాత్రమే వస్తున్నారు. ఇంకొందరు వ్యాపారాల కోసమే రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా బిజినెస్ పొలిటీషియన్స్?
వ్యాపారాల కోసం సొంత పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్న టీడీపీ నేతలు?
ఏపీ టీడీపీలో బిజినెస్ పొలిటీషియన్స్పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ అధికారం కోల్పోయిన తొలినాళ్లలో టీడీపీ కార్యకలాపాల్లో యాక్టివ్గా లేకున్నా.. కొంచెం నిరాశ నిస్పృహల్లో కనిపించారు. ఇంకొంతమంది చురుకుగా ఉంటున్నా.. అందులో నుంచి బిజినెస్ ఏ విధంగా చేయొచ్చో బుర్రకు పదును పెడుతున్నారట. మొదటిరకం కంటే.. రెండోరకం చాలా డేంజర్ అన్నది ఏపీ టీడీపీ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ. కొద్దిరోజులుగా పార్టీలో రెండోరకం రాజకీయ నాయకులు పెరిగిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. తమ వ్యాపారాల కోసం.. ఆర్థిక పరపతిని పెంచుకోవడానికి.. అవసరమైతే టీడీపీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేలా వ్యూహాలు రచిస్తున్నట్టు చెబుతున్నారు.
కృష్ణా-గుంటూరు జిల్లాల్లో టీడీపీ బిజినెస్ పొలిటీషియన్స్ ఎక్కువే..?
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ తరహా నాయకులు పెరిగి.. గుట్టుచప్పుడు కాకుండా.. అధికారపార్టీకి చెందిన నేతలతో రహస్య మంతనాలు చేస్తున్నారని తమ్ముళ్ల అనుమానం. లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నట్టు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలను కలుసుకోవడం తప్పుకాకపోయినా.. ఆ కలయిక నియోజకవర్గాల్లో టీడీపీని ఇరుకున పెట్టేలా ప్రవర్తిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఈ విషయంలో మిగిలిన జిల్లాల కంటే కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఉందన్నది తమ్ముళ్లు చెప్పేమాట.
కృష్ణా జిల్లాలో కీలక వైసీపీ నేతతో లోపాయికారీ ఒప్పందం
కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలు.. సీనియర్లు ఒక కీలక వైసీపీ నాయకుడితో లోపాయికారీగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఆ కీలక వైసీపీ నేతతో గట్టిగా పోరాడి రంగంలోకి దిగే టీడీపీ నాయకులను సీన్లోకి ఎంట్రీ కాకుండా అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా పల్నాడుకు చెందిన టీడీపీ ముఖ్య నేత కుటుంబ సభ్యులు వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖుడిని కలిసినట్టు చెబుతున్నారు. 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో కొంత స్థలాన్ని పార్టనర్షిప్గా తీసుకోగా.. దానికి ఓ చిన్నపాటి రెవెన్యూ పంచాయితీ ఉన్నట్టు సమాచారం. ఆ సమస్యను క్లియర్ చేయాలని ప్రభుత్వ పెద్దకు చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ రాకపోతే స్వతంత్రంగా పని చేయడానికి సిద్ధమని ఆ ప్రభుత్వ పెద్దకు టీడీపీ నేత కుటుంబ సభ్యులు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ హామీ ఇచ్చాకే ఆ భూమికి ఉన్న రెవెన్యూ ఇబ్బంది తొలిగిపోయినట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఆ భూమిని అమ్మకానికి పెట్టడంతో.. పెట్టుబడి కాకుండా దాదాపు 30 కోట్లకు పైగా లాభం వచ్చినట్టు సమాచారం.
టీడీపీ పెద్దలు కన్నేసి ఉంచాలని తమ్ముళ్లు డిమాండ్
ఈ విధంగా కొందరు టీడీపీ నాయకులు.. తమ వ్యాపార అవసరాల కోసం రాజకీయాలను.. సొంతపార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారనేది పార్టీలో హాట్ టాపిక్. ఇలాంటి నాయకులపై పార్టీ అధినాయకత్వం ఓ కన్నేసి ఉంచాలని సూచించినట్టు తెలుస్తోంది. మరి.. బిజినెస్ పొలిటీషియన్స్ను టీడీపీ ఎలా దారిలోకి తెచ్చుకుంటుందో చూడాలి.