కల చెదిరింది. అనుకున్నది చెయ్యి దాటింది. వాటి గాయాలు మాత్రం మానలేదు. ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఎవరిదారి వారిదే అనుకుంటున్నారో ఏమో కీలక సమావేశానికి డుమ్మా కొట్టేశారు. తెలంగాణ కాంగ్రెస్లో కొత్త చర్చకు తెరతీశారు. ఇంతకీ ఎవరా నాయకులు?
హుజురాబాద్ ఉపఎన్నిక సన్నాహక భేటీకి డుమ్మా!
ఒకరు మొదట్లో పీసీసీ పదవి వస్తే తీసుకోవాలని అనుకున్నారు. ఇంకొకరు వద్దనుకున్నా.. నువ్వే పీసీసీ చీఫ్.. మేడం ఒకే అనేశారు అని సైలెంట్గా ఉన్న నాయకుడిని లేపి కూర్చోబెట్టారు. చివరకు ఇద్దరికీ దక్కలేదు. ఇప్పుడు కొత్త టీమ్తో కలిసి పని చేయలేకపోతున్నారు. ఆ ఇద్దరు ఎవరో కాదు… మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు.. జీవన్రెడ్డి. గడిచిన కొంతకాలంగా ఇద్దరు కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా హుజూరాబాద్ ఉపఎన్నికపై జరిగిన సన్నాహక సమావేశానికి డుమ్మా కొట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టు కలిగిన ఇద్దరు నేతలూ.. తమ పరిధిలో ఉపఎన్నిక జరుగుతున్నా.. పార్టీ సమావేశానికి రాకపోవడం కాంగ్రెస్లో పెద్ద చర్చే జరుగుతోంది.
పీసీసీ చీఫ్ పదవి రాకపోవడంతో అలక వీడని జీవన్రెడ్డి?
హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపోటములను పక్కన పెడితే.. పోరాటం చేయకుండా కాడి పడేయటం కరెక్ట్ కాదన్నది హస్తం శిబిరంలో వినిపిస్తున్న మాట. గెలిచే పరిస్థితి లేకున్నా.. గౌరవ ప్రదమైన ఓట్లు సాధించాలని నిర్ణయం తీసుకుందట కాంగ్రెస్. అభ్యర్థి కోసం వెతుకులాట కూడా మొదలు పెట్టింది. రామగుండంలో జరిగిన సమావేశానికి వెళ్లిన జీవన్రెడ్డి.. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశానికి రాకపోవడం వెనక మతలబేంటి? జీవన్రెడ్డిని నాగార్జునసాగర్ ఉపఎన్నిక కంటే ముందు.. పీసీసీ చీఫ్ అయ్యారని చర్చ జరిగింది. సాగర్ ఉపఎన్నిక ముగిశాకా తనతో కనీసం చర్చించకపోవడంతో అసంతృప్తితో ఉన్నారట. కరోనా సమయం కావడంతో సైలెంట్గా ఉన్నారని అనుకున్నా.. ఇంకా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టు ఉండటం చూస్తే ఆయన కుదుట పడలేదని అనుమానిస్తున్నారు.
పదవి రాక శ్రీధర్బాబు అసంతృప్తిలో ఉన్నారా?
హుజూరాబాద్ నియోజకవర్గానికి చేరువలో ఉండే మంథనికి మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా సమావేశానికి రాలేదు. పీసీసీ చీఫ్ పోస్ట్ ఆశించిన వారిలో శ్రీధర్బాబు కూడా ఉన్నారు. ఎంపిక ప్రక్రియ చివరికి వచ్చిన సమయంలో రేస్లో లేనని చెప్పి ఆశ్చర్యపరిచారు. హుజురాబాద్ ఉపఎన్నిక మీటింగ్కు రాకపోవడానికి కారణం.. ఆయన కూడా అలకమీదే ఉన్నారని సందేహిస్తున్నారట. తన పరిధిలో ఏ సమావేశం జరిగినా కచ్చితంగా హాజరయ్యే శ్రీధర్బాబు.. హైదరాబాద్ మీటింగ్కు గైర్హాజర్ అంతుచిక్కడం లేదట.
మాజీ మంత్రుల మౌనంపై కాంగ్రెస్లో ప్రశ్నలు!
హుజురాబాద్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదర రాజనర్సింహ ఓవరాల్ ఇంఛార్జ్గా ఉన్నా.. సొంత జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రుల మౌనం అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. మరి.. బైఎలక్షన్ ముగిసేసరికి అలకలు.. అసంతృప్తులు.. ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. ఇప్పటికైతే చెదిరిన మనసులు కలత చెందే ఉన్నాయట.