వైసీపీ కాపు నేతలు కొందరు కుతకుతలాడిపోతున్నారా? అధిష్టానానికి ఇప్పటికైనా జ్ఞానోదయం అవలేదా అంటూ నిర్మొహమాటపు కామెంట్స్ చేస్తున్నారా? జరిగిన డ్యామేజ్ చాలదా…? మళ్ళీ ఆయన్నే ముందుకు తీసుకొచ్చి ఏం సందేశం ఇద్దామనుకుటున్నారని తెగ ఫీలైపోతున్నారా? ఎవరి గురించి అంతలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఆయన విషయంలో ఉన్న అభ్యంతరాలేంటి? ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి. వైసీపీ లీడర్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ని ఓడిస్తానని శపథం చేసి నెరవేరక పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారీ కాపు లీడర్. ఎన్నికల తర్వాత పెద్ద యాక్టివ్గా లేరు. ఆయన కొడుకు గిరి ప్రస్తుతం ప్రత్తిపాడు వైసీపీ కో ఆర్డినేటర్గా ఉన్నారు. అదంతా ఒక ఎత్తయితే… ఇప్పుడు అంబటి ఎపిసోడ్లో మరోసారి లేఖాస్త్రంతో ఆయన బయటికి రావడం ఇటు రాజకీయవర్గాల్లోను, అటు కాపు కులంలో కూడా చర్చనీయాంశం అయింది. రాష్ట్ర ప్రభుత్వం కాపులను కావాలనే టార్గెట్ చేస్తోందంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ముద్రగడ. గతంలో వంగవీటి రంగా ,తర్వాత తాను, ప్రస్తుతం అంబటి అంటూ సుదీర్ఘంగా తన లెటర్లో ప్రస్తావించారు. మా కాపు జాతిని పక్క రాష్ట్రంలో అయినా కలిపేయాలంటూ…. ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చేశారు పద్మనాభ రెడ్డి. సరిగ్గా ఇక్కడే అసలు చర్చంతా మొదలైంది. పేరు మార్చుకున్నాక బాగా సైలెంట్ అయిపోయిన నాయకుడు… పార్టీ నుంచి బ్రీఫింగ్ లేకుండా ఆ స్థాయిలో స్పందించే అవకాశం ఉండదన్నది ఎక్కువ మంది వాదన.
అంతా ఒక లెక్క ప్రకారం జరుగుతోందని అంటున్నారు. కాకినాడ జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ సీటు ఉన్నాయి. ఇక్కడి గెలుపు ఓటములను కాపు ఓటర్లే డిసైడ్ చేస్తారు. గత ఎన్నికల్లో వైసీపీ ఆరు చోట్ల కాపులకు ఛాన్స్ ఇచ్చింది. ఎంపీ టిక్కెట్ కూడా అదే సామాజిక వర్గానికి దక్కింది. కానీ… ఫలితాలు మాత్రం పూర్తి తేడాగా వచ్చాయి. ఆ సామాజిక వర్గం ఓటర్లు వైసీపీని పూర్తిగా పక్కన పెట్టినట్లు కనిపిస్తోందన్న వాదన బలంగా ఉంది. ఫ్యాన్ పార్టీ కాపు నేతలు ఇప్పుడు ఈ విషయం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం వైఖరే తమ కొంప ముంచిందన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన పద్మనాభం పరిధి దాటి మాట్లాడారని, అదే పెద్ద మైనస్ అయిందన్నది కాకినాడ జిల్లా వైసీపీ కాపు నేతల అభిప్రాయం. ఆయన తీరు సొంత కులంలోనే తమకు నెగిటివ్ అయిందని అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని గమనించకుండా… తిరిగి ఇప్పుడు కూడా… తగుదునమ్మా అంటూ… పార్టీ మరోసారి ఆయన్ని తెర మీదికి తీసుకురావడం, హైప్ క్రియేట్ చేయడం అవసరమా అని గుసగుసలు ఆడుకుంటున్నారట. అయినా… ఆయన ఔట్ డేటెడ్ పొలిటీషియన్, ప్రస్తుత రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదంటూ కొందరు వైసీపీ కాపు నాయకులే సెటైర్స్ వేస్తున్నట్టు సమాచారం.
2009లో కాంగ్రెస్ తరపున పిఠాపురంలో పోటీ చేసిన ముద్రగడ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారని, 2014లో ప్రత్తిపాడు నుంచి ఇండిపెండెంట్గా బరిలో దిగి కనీసం పదివేల ఓట్లు కూడా తెచ్చుకోలేదని, ఇక 2024లో ఆయన పర్ఫామెన్స్ ఏ మాత్రం ఉందో అంతా చూశారుకదా అంటూ… కాకినాడ జిల్లా వైసీపీ నేతలు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారట.జిల్లాలో ఆయన పరిస్థితి ఏంటో మాకు తెలుసు. అందుకే దూరంగా ఉంటున్నామంటూ లోకల్ లీడర్స్ క్లారిటీగా చెప్పేస్తున్నారు. మిగతా వారికి విషయం తెలియక భ్రమల్లో ఉన్నారంటూ డైరెక్ట్ కామెంట్స్ టేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు, ఆయన ఎప్పుడో కులం మార్చేసుకుని పద్మనాభరెడ్డి అయ్యారు. మళ్ళీ ఇప్పుడు కాపు పెద్దగా ప్రొజెక్ట్ చేయడం, ఆయనే రక్షకుడిలాగా లెటర్స్ రాయడం, మా ప్రతినిధిగా మాట్లాడ్డం ఏంటని అంటున్నారట జిల్లా కాపు నాయకులు. ఇంకొందరైతే… పార్టీ పెద్దలు కూడా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులను గమనించాలి, ఎవరి పలుకుబడి ఎంతో చూసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారు. గట్టిగా, నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే… ప్రస్తుత జనరేషన్కు ఆయన మార్క్ పాలిటిక్స్ సరిపోవని, పద్మనాభం వల్ల కులంలో కొత్తగా వచ్చే బలం ఏమీ ఉండబోదన్నది వాళ్ళ మాట. పరిస్థితులకు అనుగుణంగా పార్టీ కూడా అప్డేట్ అయితే బాగుంటుందని కూడా అంటున్నారు కొందరు కాకినాడ వైసీపీ కాపు నాయకులు. ఇలాంటి వ్యవహారాల వల్ల లోకల్గా తమకు డ్యామేజ్ అవుతుందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ముద్రగడను కాపు నాయకుడి హోదాలో వైసీపీ అధిష్టానం ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం కొత్త కిరికిరిలకు దారితీస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది జిల్లాలో. అసలు కులంలోనే లేనని ఆయన ప్రకటించుకున్న తర్వాత ఆయనతో మళ్లీ ఈ పంచాయతీలు అవసరమా అన్నది ఎక్కువ మంది కాపు నేతల క్వశ్చన్. ఇకనైనా కుల పరమైన సున్నితమైన అంశాల జోలికి పద్మనాభ రెడ్డిని తీసుకురావద్దని సీరియస్గానే అంటున్నారు కొందరు. ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.