NTV Telugu Site icon

Off The Record: బుట్టా రేణుకకు కలిసి రాని కాలం

Butta

Butta

Off The Record: ఆ మాజీ ఎంపీని వైసీపీ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించేస్తారా? ఆమె కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చి తీవ్రంగా నష్టపోయానని ఆమె తీరిగ్గా తెగ ఫీలైపోతున్నారా? 2029లో పార్టీ టిక్కెట్‌ ఇచ్చినా… నెగ్గుకువచ్చే పరిస్థితి లేదని అధిష్టానం కూడా డిసైడైందా? ఎవరా మాజీ ఎంపీ? ఏంటా కష్టాలు?

Read Also: GT vs RR: గిల్ మళ్లీ మిస్.. బాదేసిన బట్లర్! ఆర్ఆర్ ముందు భారీ టార్గెట్..

కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకకు కాలం కలిసిరావడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. అప్పట్లో అదృష్టం ఒక్కసారిగా ఎగిసితన్ని…. వైసీపీ తరపున ఎంపీ పీఠం ఎక్కేశారామె. కానీ… ఆ తర్వాత మాత్రం రాజకీయం ఏ మాత్రం కలిసిరావడం లేదని చెప్పుకుంటున్నారు. రాజకీయమే వృత్తిగా ఉన్న నేతల కంటే ఎక్కువగా కర్నూలు జిల్లాలో తిరిగినా తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టుగా రివర్స్ అవుతోందట. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మిగనూరు సెగ్మెంట్‌లో బుట్టా పడిన కష్టం అంతా ఇంతా కాదని చెప్పుకుంటారు. ఆర్థికంగా కూడా బాగా భరించినా కలసి రాలేదట. పైగా.. నియోజకవర్గంలో ప్రత్యర్థులకంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలతోనే పోరాటం చేయాల్సి వచ్చిందన్నది ఆమె సన్నిహితులు చెప్పేమాట. లోకల్‌గా తన సామాజికవర్గం బలంగా ఉన్నా… గెలుపు అవకాశాలు మెండుగా కనిపించినా… ఓడిపోవడానికి కారణం మాత్రం స్వపక్షంలో సహాయ నిరాకరణే అన్నది బుట్టా వర్గం అభిప్రాయం. అంత రిస్క్ తీసుకున్నా… ఓటమి తప్పలేదు. సర్లే… రాజకీయాలన్నాక ఇవన్నీ సహజం. ఓడిపోతే ఓడిపోయాంగానీ.. పార్టీ తరపున గట్టిగా నిలబడదామనుకున్నా పరిస్థితులు సహకరించడం లేదట ఆమెకు. దీనికి తోడు ఇటీవల బుట్టా రేణుక వ్యాపారాల్లో ఇటీవల సంక్షోభం వచ్చిందని, ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయన్న ప్రచారం జరుగుతోంది.

Read Also: Off The Record: ఆ బీజేపీ నేతలకు నో ఎంట్రీ బోర్డు పెట్టిన ఆర్ఎస్ఎస్..

అయితే, అసలు రాజకీయాల్లోకి వచ్చిన కారణంగానే ఈ ఆర్థిక సమస్యలు వచ్చానన్నది మాజీ ఎంపీ మనసులోని మాటగా ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో ఆర్థికంగా బాగా భరించాల్సి రావడం, ఆ తరువాత కూడా 2024 ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక భారం పడడంతోనే ఇబ్బందులు మొదలయ్యాయట. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్‌ ఆమెను కొనసాగించకపోవచ్చన్న టాక్‌ నడుస్తోంది నియోజకవర్గంలో. ఎమ్మిగనూరు పరిణామాలతో మనస్తాపం చెందిన మాజీ ఎంపీ… ప్రస్తుతం పార్టీ కార్యాలయానికి, కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారట. పైకి అనారోగ్యం అని చెబుతున్నా అసలు కారణం మాత్రం రాజకీయ పరిణామాలే అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు ముందు నుంచి బుట్టా రేణుకను వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారట. ఇన్ఛార్జ్‌తో కలిసి కాకుండా సొంత కార్యక్రమాలు చేసుకుపోతున్నారట జగన్మోహన్‌రెడ్డి. దీంతో ఎవరిని సపోర్ట్ చేయాలో అర్ధంకాక కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారట. ఈ పరిణామాలను పార్టీ పెద్దలకు చెప్పి క్లారిటీ ఇస్తే తప్ప కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని చెప్పారట బుట్టా.

Read Also: Sri Vishnu : నా సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు.. శ్రీవిష్ణు క్లారిటీ

కాగా, ఇటీవల పార్టీ కమిటీల నియామకం తర్వాత అంబేద్కర్‌ జయంతి కార్యక్రమాన్ని రెండు వర్గాలు వేరువేరుగా నిర్వహించాయి. అంబేడ్కర్ విగ్రహం దగ్గర రెండు వర్గాలు కలిసినప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారట జగన్‌. మా ఉప్పు తిని వేరే వారి పక్షాన చేరారు.. ఒక్క నెల ఆగండి నేనేంటో చూపిస్తానని వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా…. ముందు ఇన్ఛార్జ్‌ ఎవరో మీరే తేల్చుకోకుండా… కార్యకర్తలను టార్గెట్ చేయడమేమిటన్న ఆవేదన వ్యక్తమైందట. ఈ పరిణామ క్రమంలో…పార్టీ ఇన్ఛార్జ్‌ మార్పు ప్రచారం ఊపందుకుంది. తమకే పదవి అంటూ ప్రచారం చేసుకుంటోందట జగన్‌ వర్గం. మరికొందరు మాత్రం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డికి ఇస్తారని ప్రచారం చేస్తున్నారు.

Read Also: Home Guards: హోమ్ గార్డుల పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ సీఐడీ!

ఇక, ధరణీధర్‌ని ఎమ్మిగనూరులో యాక్టివ్‌ చేయాలన్న చర్చ గతంలోనే జరిగినట్టు తెలిసింది. ఆయన కూడా నియోజకవర్గానికి వచ్చినపుడు కలుపుగోలుగా తిరుగుతున్నారట. ఈ క్రమంలో మే1న నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరగబోతోంది. ఆ సమావేశంలో ఏవన్నా కీలక నిర్ణయాలు ఉంటాయా అన్న ఆసక్తి పెరుగుతోందట. కొత్త ఇన్ఛార్జ్‌గా ఎవరన్న సంగతి పక్కనపెడితే… బుట్టా రేణుకను మార్చడం మాత్రం ఖాయమన్న అభిప్రాయం మాత్రం బలంగా ఉంది ఎమ్మిగమూరులో. ఆమె ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోవడం, పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టకపోవడం, 2029లో టిక్కెట్‌ ఇచ్చినా కష్టమన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో బలపడటం లాంటి కారణాలన్నీ కలగలిసి ఆమెను ఇన్ఛార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించవచ్చని అంటున్నారు. మొత్తం మీద ఎమ్మిగనూరు వైసీపీ పాలిటిక్స్‌ సలసల మరుగుతున్నాయి.