తెలంగాణ బీజేపీ సరిగా వర్కౌట్ చేయలేకపోయిందా? వచ్చిన ఫలితాలే అంతంత మాత్రం అయితే… ఉన్న అవకాశాలను కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోయిందా? ఇంకాస్త దృష్టి పెడితే మరిన్ని పదవులు దక్కించుకోగలిగేదన్న మాటల్లో నిజమెంత? అనైతిక పొత్తులకు మేం వ్యతిరేకమంటూ చెప్పిన భారీ డైలాగ్స్ అన్ని చోట్ల ఎందుకు అప్లయ్ అవలేదు? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నచోట కూడా ఎందుకు మున్సిపాలిటీలను కైవసం చేసుకోసేకపోయింది కమలం? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొలిక్కి వచ్చేసింది. ఇంకో 11 మున్సిపాల్టీలు తప్ప అన్నిచోట్ల మున్సిపల్ ఛైర్మన్స్, కార్పొరేషన్ మేయర్స్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎట్టకేలకు కమలం పార్టీ ఒక కార్పొరేషన్, ఒక మున్సిపాల్టీని కైవసం చేసుకోగలిగింది. నారాయణపేట మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవుల్ని దక్కించుకుంది కమలం. అలాగే…. కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ పోస్ట్లు ఆ పార్టీ కైవసం అయ్యాయి. ఈ రెండు చోట్ల తప్ప ఇంకెక్కడా ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. కొంచెం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే…. ఇంకొన్ని మున్సిపాలిటీల్ని చేజిక్కించుకునే ఛాన్స్ ఉన్నా… ఆ దిశగా దృష్టి పెట్టలేదు కాషాయ పెద్దలు.
ఆదిలాబాద్లో ఇద్దరు ఇండిపెండెంట్స్ని మేనేజ్ చేసుకుంటే పీఠం ఆ పార్టీకే దక్కేదని, కానీ… ఆ పని చేయడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారన్న చర్చలు జరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. అక్కడ మిగతా పార్టీలన్నీ ఏకం అయ్యాయి. ఇక నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రాయికల్, మెట్పల్లిలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ… చైర్ పర్సన్ ఎన్నికను వదిలేసింది. అలా ఎందుకంటే….అనైతిక పొత్తులకు మేం వ్యతిరేకం అని చెప్పిన బీజేపీ…. అన్ని చోట్ల అదే మాట మీద నిలబడలేకపోయింది. ఆ పార్టీ స్థానిక నాయకత్వం గట్టిగా ఆలోచన చేసి ఉంటే… మరికొన్ని చోట్ల వైస్ ఛైర్మన్ పదవులైనా దక్కించుకునేదన్న మాటలు వినిపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం సొంతంగా నిర్ణయం తీసుకున్న చోట్ల ఎవ్వరూ ఊహించని విధంగా…. బీజేపీ వైస్ చైర్మన్ పదవులను దక్కించు కోగలిగింది.
దీంతో… అన్నిచోట్ల అలా చేస్తే కచ్చితంగా ఇంకా మంచి ఫలితాలు వచ్చేవని, కొన్నిచోట్ల లోకల్ లీడర్స్ సీరియస్గా తీసుకోకుండా వదిలేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే విషయమై కార్యకర్తల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోందట.బీజేపీ కౌన్సిలర్స్ కొన్ని చోట్ల కాంగ్రెస్కు మద్దతివ్వగా…. మరి కొన్ని చోట్ల బీఆర్ఎస్కు జై కొట్టారు. అలా చేసిన చోట్లలో ఉపాధ్యక్ష పోస్ట్లు కొట్టేశారు. పార్టీ ఎక్స్ అఫిషియో సభ్యులు కొందరు మరో పార్టీకి ఓటేసినట్టు తెలిసింది. ఓవరాల్గా చూస్తే… ఫలితాల వెల్లడి తర్వాత పూర్తిగా చేతులెత్తేయకుండా… బీజేపీ నాయకులు ఇంకాస్త వర్కౌట్ చేసి ఉంటే… మరికొన్ని పదవులు పార్టీ ఖాతాలో పడి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయవర్గాల్లో.