OTR : రావులపాలెంలో పేకాట శిబిరాలను గుట్టురట్టు చేసిన టీడీపీ అంతర్గత విబేధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రండి బాబూ….. రండి. ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి. ఆట మీది, చోటు మాది. కట్టలతో రండి…. కావాల్సినన్ని రోజులు ఉండి…. ఆటగాళ్ళుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండంటూ… అక్కడ తెగ ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నారట. లీగలా…? ఇల్లీగలా…? నో మేటర్. అంతా మేం చూసుకుంటామంటూ భరోసా ఇస్తున్నారట. ఇంతకీ… ఏ ఆటలాడమని పిలుస్తున్నారు? ఎక్కడికి రమ్మంటున్నారు? ఆ విషయమై టీడీపీ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇల్లీగల్ దందా ఊపందుకుంటోందని చెప్పుకుంటున్నారు. కొందరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు బాగా కావాల్సిన వాళ్ళే దగ్గరుండి మరీ వాటిని నడిపిస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. రాజకీయ అండతో కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగానే పేకాట శిబిరాలు నాన్ స్టాప్గా నడుస్తున్నాయన్నది లోకల్ టాక్. జూదానికి బానిసలైన వాళ్ళు ఇందులో పడి ఇల్లు ఒళ్లు గుల్ల చేసుకుంటుంటే… ఈ అక్రమాలకు అండగా ఉన్నవాళ్ళు మాత్రం కోట్లు గడిస్తున్నారన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి జిల్లాలో. కొన్ని నియోజకవర్గాల్లో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయని, అధికార పార్టీకి చెందిన కొద్దిమంది కీలక నేతలు, ప్రజాప్రతినిధుల ముఖ్య అనుచరులే వాటిని నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి నియోజకవర్గాలు ప్రస్తుతం పేకాట రాయుళ్లకు సేఫ్ జోన్గా మారిపోయాయని అంటున్నారు. స్థానికంగా ఉండే రాజకీయ అండ కారణంగా… పోలీసులు కూడా చూసీచూడనట్టు వదిలేస్తున్నారని, ఒకవేళ రైడ్ అయినా…. ముందస్తు సమాచారం లీకై తప్పించుకోవచ్చన్న నమ్మకంతో ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పేకాట ఆడేవారు ఇక్కడికి తరలివస్తున్నారట. కొన్ని శిబిరాల్లో రోజూ లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. శిబిరం స్థాయిని బట్టి నిర్వాహకులకు కూడా రోజుకు పది వేల రూపాయల దాకా ఆదాయం వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. శిబిరం పెద్దదైతే…. ఈ మొత్తం మరింత పెరుగుతోందట. ఇక్కడే పోలీసుల పాత్ర మీద కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. అసలేమీ పట్టించుకోవడం లేదని ఎవరైనా వేలెత్తి చూపకుండా పోలీసులు కర్ర విరక్కుండా, పాము చావకుండా అన్నట్టు వ్యవహరిస్తున్నారట. అప్పుడప్పుడు పేకాట శిబిరాలపై దాడులు నిర్వహిస్తూ… నామ మాత్రపు కేసులు బుక్ చేస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి.
ముందస్తు లీక్లతో పోలీసులు వెళ్ళే టైంకి ముఖ్యమైన వాళ్ళు ఎవ్వరూ ఉండరట. పని జరిగినట్టు కనిపిస్తుంది, అలాగని ఎవ్వరూ ఇరుక్కోరు. ఆ తూతూ మంత్రపు దాడులు కూడా చిన్న చిన్న శిబిరాల మీదేగానీ… పెద్దవాళ్ళ జోలికి అస్సలు పోరన్న విమర్శలున్నాయి. శిబిరాల వెనుక ఉన్న కీలక వ్యక్తులపై చర్యల గురించి మాత్రం లోకల్ పోలీసులు అస్సలు ఆలోచించబోరని కూడా అంటున్నారు కొందరు. పైగా…. కొన్ని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లకు నెలవారీ మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇలాంటి రకరకాల కారణాలతో పెద్ద నాయకుల అనుచరులు నిర్వహించే శిబిరాల జోలికి పోలీసులు వెళ్లరన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే… వీటికి సంబంధించి అధికారికంగా ఎక్కడా ఏ చిన్న ఆధారం దొరక్కుండా జాగ్రత్త పడుతుంటారు. ఇటీవల రావులపాలెం ఘటనతో మళ్లీ పేకాట క్లబ్బుల వ్యవహారంపై చర్చలు మొదలయ్యాయి. రావులపాలెం మండలం దేవరపల్లి శివారులో పోలీసులు నిర్వహించిన దాడి స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో కొందరు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసులు పెట్టారు. అయితే ఆ స్థలం అధికార పార్టీకి చెందిన కీలక నేత అనుచరుడిదేనన్న ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో అధికార పార్టీలోనే వర్గపోరు బయటపడిందన్న చర్చ మొదలైంది. కేవలం పేకాట ఆడేవారిపై మాత్రమే కాదు… స్థలం ఇచ్చిన వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ కొందరు సోషల్మీడియాలో పోస్టులు పెట్టడం ఆసక్తికరంగా మారింది. కానీ… టీడీపీలోని అంతర్గత రాజకీయాల కారణంగానే ఆ శిబిరంపై దాడి జరిగిందన్న గుసగుసలు సైతం ఉన్నాయి. పట్టుబడింది ఒక శిబిరమే… కానీ ఇంకా అలాంటివి చాలానే ఉన్నాయంటున్నారు స్థానికులు.
Also Read
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో పేకాట శిబిరాలు పెరిగిపోయాయన్న ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. కొత్తపేట నియోజకవర్గంలో మండలానికో శిబిరం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, గోపాలపురం ప్రాంతాల్లో కూడా పేకాట కేంద్రాలు జోరుగా నడుస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే… ఏ పార్టీ అధికారంలో ఉన్నా…… ఇక్కడ పేకాట శిబిరాలు స్థానిక నేతలకు ఆదాయ వనరులుగా మారుతున్నాయని చెప్పుకుంటున్నారు. కరోనా సమయంలో కూడా ఇక్కడ బ్రేక్ ఇవ్వలేదు. అప్పుడు కోనసీమలోని ఒక కీలక నేత ఇంటిలో పేకాట ఆడిన అందరికీ కరోనా సోకిన సంగతి గురించి ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. పీఠం మీద పార్టీలు మారుతున్నా.. . ఇక్కడ సంస్కృతి మాత్రం మారడం లేదన్న ఆవేదన సామాన్య ప్రజల్లో కనిపిస్తోంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తారా..? పెద్ద స్థాయిలో నడుస్తున్న పేకాట శిబిరాలపై కఠిన చర్యలు తీసుకుంటారా…? అని ఎదురు చూస్తున్నారు స్థానికులు.
- Tags
- NTV Telugu
- OTR
- tdp
తాజావార్తలు
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..