టెంపుల్ సిటీలో కొత్త ట్రెండ్ మొదలైందా? తిరుపతిలో ఖాళీ స్థలాల యజమానులకు కొన్ని సినిమాల్లోని సీన్స్ గుర్తుకు వస్తున్నాయా? ఎవర్రా… మీరంతా, ఇలా తయారయ్యారేంట్రా అంటూ జనసేన ఎమ్మెల్యే అనుచరుల్ని చూసి కూటమి నాయకులు కూడా షాకవుతున్నారా? ఇంతకీ ఏం జరుగుతోంది తిరుపతిలో? కొత్త రకం కబ్జాల కహానీ ఏంటి? ఆరిణి శ్రీనివాసులు…తిరుపతి జనసేన ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో సీటు తెచ్చుకుని 60వేలకు పైగా మెజారిటీతో గెలిచారాయన. ఎన్నికలకు ముందు వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరిణిని తీసుకువచ్చి సీటు ఇవ్వడాన్ని తిరుపతి టిడిపి, జనసేన నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించినా వర్కౌట్ అవలేదు. ఇక గెలిచిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నా… ఆరిణి శ్రీనివాసులు రొటీన్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయారని, తిరుపతిలో ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం పెరిగిపోయిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు వైసిపి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్రీనివాసులు వెంటే ఉన్న ఆయన అన్న కుమారుడు శివకూమార్ షాడో అయినట్టు చెప్పుకున్నారు. నగరంలో కబ్జాలు, కమీషన్ పేరుతో పార్టీకి చెడ్డ పేరు తీసుకు వస్తున్నారన్న వాయిస్ అమరావతిదాకా గట్టిగా వినిపించడంతో… సీరియస్ వార్నింగ్ ఇచ్చింది జనసేన హైకమాండ్. ఆ తర్వాతి నుంచి శివతో పాటు ఆ బ్యాచ్ మొత్తం సైలెంట్ అయిపోయింది.
సీన్ కట్ చేస్తే…. ఇటీవల ఆ ప్లేస్లోకి ఇంకో బ్యాచ్ వచ్చి చేరిందట. కొత్త బ్యాచ్ చేస్తున్న రచ్చ కూటమిలో దుమారం రేపుతోందని అంటున్నారు. పాత వాళ్ళకు భిన్నంగా… ఈ కొత్తోళ్ళు స్టైల్ మార్చి సరికొత్తగా ఆగడాలకు తెగబడుతున్నారట. వాళ్ళంతా భూ మంత్రగాళ్ళలా తయారయ్యారన్నది లోకల్ టాక్. వీళ్ళ చేష్టలతో రేపు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ముందుకు ఎలా వెళ్ళాలో అర్ధంకాని పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కూటమి పార్టీల నాయకులు తలలు బాదుకుంటున్నట్టు తెలుస్తోంది. తిరుపతి భూ గ్యాంగ్ను కంట్రోల్ చేయాలని, లేకుండా జాయింట్గా నష్టపోతామని మూడు పార్టీల పెద్దలకు ఫిర్యాదులు వెళ్ళినట్టు తెలిసింది. వీళ్ల ఆగడాలకు కొన్ని ఉదాహరణల్ని కూడా చెబుతున్నారు తిరుపతి కూటమి నాయకులు. శివజ్యోతి నగర్లోని ఐదు ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో జనసేన ఛోటా నేత వర్సెస్ భూ యాజమాని గొడవ నగరంలో సంచలనమైంది. సదరు భూ యజమాని సాంబశివరావు….. నా భూమిలోకి హరీష్ శంకర్ అనే జనసేన నేత ఎలా వస్తారంటూ ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. పైగా బెదిరించి డబ్బులు అడిగారని కూడా ఆరోపించారాయన. కానీ… ఆ తర్వాత సడన్గా సైలెంట్ అయిపోయారు. ఏమైందని మీడియా ప్రశ్నిస్తే… అబ్బే అస్సలు అలాంటిదేం జరగనే లేదన్నట్టుగా వ్యవహరించారు సాంబశివరావు.
ఎందుకలా అంటున్నారని ఆరాతీస్తే… బ్యాక్గ్రౌండ్లో చాలానే జరిగినట్టు తెలిసింది. ప్రెస్మీట్ పెట్టాక ఎమ్మెల్యే మనుషులుగా చెబుతున్న కొత్త గ్యాంగ్ ఎంటరైపోయి….. పెంచుకుంటూ ఉంటే ఇది పెరుగుతూనే ఉంటుందని, ఎక్కడో ఒకచోట ఫుల్స్టాప్ పెడితే బాగుంటుంది. కూర్చుని సెటిల్ చేసుకుందామంటూ దారి చూపించారట. ఆ క్రమంలోనే ఓ కీలకమైన వ్యక్తి ఈ వ్యవహారాన్ని సెటిల్ చేశారన్న గుసగుసలు ఇప్పుడు టీడీపీ, బీజేపీ నేతల్లో వినిపిస్తున్నాయి. హరీష్శంకర్, అతని అనుచరులు ప్రస్తుతం ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులమని చెప్పుకుంటూ…. తిరుపతిలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడికి వెళ్ళి గొడవకు దిగడం, తర్వాత సెటిల్మెంట్స్ పేరుతో అసలు ఓనర్స్ని పిలవడం రొటీన్ అయిందట. కొన్ని సినిమాల్లో చూపించే కబ్జా సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోకుండా వీళ్ళు నడిపిస్తున్న వ్యవహారాలు చూసి… ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట తమ్ముళ్లు. ఇంకొందరు సీనియర్స్ అయితే… ఇన్నేళ్లలో ఎప్పుడూ మాకు ఇలాంటి ఆలోచన రాలేదే, మేం ధైర్యం చేయలేకపోయామే… వీళ్ళేంట్రా బుజ్జా ఇలా ఉన్నారు అంటూ ముక్కున వేసుకుంటున్నారట. కూటమిలో ఇలాంటి చర్చలు జరుగుతుంటే… అటు వైసీపీ మాత్రం దీని వెనక ఎమ్మెల్యేతో పాటు గతంలో అధిష్టానం వార్నింగ్తో ఆగిన ఆరిణి శివ కూడా ఉన్నాడని ఆరోపిస్తోంది. ఈ భూ దందాలు ఇలాగే కొనసాగితే రేపు మున్సిపల్ ఎన్నికల్లో చేతులెత్తేయడం తప్ప ఇక చేయగలిగిందేం ఉండబోదన్న వాయిస్ కూటమిలో గట్టిగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నా,లేకున్నా ఆయన మునుషులమని చెప్పుకుంటూ చేస్తున్న దందాలపై జనసేన పెద్దలు సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి ఇక వార్నింగ్స్ ఉండబోవని, డైరెక్ట్ యాక్షనేనని చెప్పుకుంటున్నారు. ఫైనల్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.