జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ మీద వత్తిడి పెంచుతోందా? సిట్టింగ్ సీటు కాబట్టి ఎంతో కొంత సహజమే అయినా… ప్రస్తుతం అంతకు మించి అన్నట్టుగా వాతావరణం ఉందా? ఎందుకు కారు పార్టీ అంత ప్రెజర్లో ఉంది? తిరిగి పాగా వేసేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది? ఈ ఒక్క సీటును మళ్లీ గెల్చుకుంటే బీఆర్ఎస్కు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? లేదంటే జరిగే నష్టమేంటటి? తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలకు జూబ్లీహిల్స్ ఫీవర్ పట్టుకుంది. ఇక్కడ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలగా అధికార ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా బీఆర్ఎస్ టెన్షన్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇది ఆ పార్టీ సిట్టింగ్ సీటు కావడం, ఇక్కడ గెలిస్తే… కేడర్లో స్థైర్యాన్ని పెంచడం లాంటి రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయట గులాబీ పార్టీకి. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్… ప్రచారంలో కూడా దూకుడు ప్రదర్శించాలనుకుంటోందట. అందుకే… ఈసారి అభ్యర్థిని చూసి కాకుండా పార్టీని చూడాలంటున్నారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థుల మధ్య పోటీ కాదని, ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న యుద్ధమని భావిస్తున్నారట గులాబీ పెద్దలు. ఇక్కడ ప్రధానంగా ఓ అస్త్రాన్ని వాడుతోంది బీఆర్ఎస్. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదంటూ ఆ పాయింట్నే హైలైట్ చేయాలనుకుంటోందట.
ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు, హామీల పేరుతో తెలంగాణ ప్రజలకు బకాయి పడింది అంటూ బాకీ కార్డులను రిలీజ్ చేసి… వాటిని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి పంపిణీ చేస్తోంది. ఇలా ప్రచారం చేస్తున్న సమయంలో ఓటర్లకు మరో కీలకమైన అంశాన్ని చెబుతోంది కారు పార్టీ. ఈ బైపోల్లో గనుక కాంగ్రెస్ గెలిస్తే గతంలో ఆ పార్టీ ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చదని, అందుకే అధికార పక్షాన్ని ఓడించి బాధ్యతను గుర్తు చేయాలంటూ ఓటర్లకు పిలుపునిస్తోంది. ఇక్కడ ఓడించి కాంగ్రెస్ను డిఫెన్స్లో పెడితేనే… ప్రభుత్వ పెద్దలు కూడా బాధ్యతగా, భయంతో ఉండి పనులు చేస్తారన్నది బీఆర్ఎస్ వాదన అట. ఒక రకంగా ఈ వాదనతో గులాబీ పార్టీ ఓటర్స్ని భయపెడుతోందన్నది కొందరి మాట. ఓవైపు పైకి ఎంత చెబుతున్నా….లోలోపల బీఆర్ఎస్ కూడా తీవ్రమైన వత్తిడిలో ఉందట.
అధికార పార్టీకి సహజంగా ఉండే అడ్వాంటేజెస్తో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తమ సిట్టింగ్ సీటును గెల్చుకుంటే పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోందట గులాబీ వర్గాల్లో. తాము అనుకుంటున్న రేంజ్లో ప్రభుత్వ వ్యతిరేకత లేదన్న సంగతి స్పష్టం అవుతుందన్న భయం కూడా ఉందట గులాబీ వర్గాల్లో. అందుకే తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకుని, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందని నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం అనుకుంటున్నారట గులాబీ పెద్దలు. అందుకే… ఇది అభ్యర్థుల మధ్య కాదు, రెండు ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న పోరు అని చెబుతూ అందుకు తగ్గట్టుగా స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న కాంగ్రెస్ విమర్శలు తమకు నష్టం చేశాయని భావిస్తోంది గులాబీ పార్టీ. అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ దెబ్బ గట్టిగానే పడిందని, అందుకే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయామన్నది బీఆర్ఎస్ అధిష్టానం భావన అట. అందుకే ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత మీదనే ఎన్నికలు జరుగుతున్నాయని భావిస్తున్న గులాబీ పెద్దలు….. తమని, బీజేపీని ఒక గాటన కట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు అంటున్నారు. వోవరాల్గా రెండేళ్ళలో కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదన్న విషయాన్ని గట్టిగా పబ్లిక్లోకి తీసుకుపోవడం ద్వారా పైచేయి సాధించవచ్చన్నది బీఆర్ఎస్ ప్లాన్. కాంగ్రెస్ ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత, మాగంటి గోపీనాథ్ కుటుంబం మీద సానుభూతి తమకు కలిసి వచ్చే అంశాలుగా చెబుతోంది గులాబీ దళం.