తెలంగాణలో ఒక్కో ఎన్నిక వస్తోంది, ముగుస్తోంది. కానీ…. వాళ్ళు మాత్రం చకోర పక్షుల్లా ఎదురు చూస్తూనే ఉన్నారు. హమారా నంబర్ కబ్ ఆయేగా అంటూ కనిపించిన వాళ్ళనల్లా వాకబు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా ఆ.. ఆశలపల్లకి ఊరేంగింపులకు ముగింపు దొరుకుతుందా? మేటర్ కొలిక్కి వస్తుందా? అంత తీవ్రమైన ఎదురుచూపుల్లో ఉన్న ఆ నాయకులు ఎవరు? దేని కోసం చూస్తున్నారు?
పదవి కోసమైనా… ఇతర ఏ ఛాన్స్ కావాలన్నా…. నిరీక్షణ అన్నది కాంగ్రెస్ పార్టీలో కామన్. అది పార్టీ పోస్ట్ అయినా, నామినేటెడ్ పదవి అయినా వస్తే వచ్చిందని అనుకోవడం తప్ప….. అంతకు మించిన ఆశలు పెట్టుకోలేని పరిస్థితి. ఇక నామినేటెడ్ పదవుల సంగతి అయితే సరేసరి. వాటిని ఆశించడం నాయకులు ఎప్పుడో వదిలేశారన్న చర్చలు పార్టీ వర్గాల్లోనే జరుగుతుంటాయి. ఈ విషయమై పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాయిదాలపర్వం కొనసాగుతూనే ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత 37 మందిని వివిధ కార్పొరేషన్స్ ఛైర్మన్స్గా నియమించింది ప్రభుత్వం. కానీ… కార్పొరేషన్లలో డైరెక్టర్ల పదవులు మాత్రం ఖాళీగానే ఉన్నాయి. కార్పొరేషన్ ఛైర్మన్స్ పోస్టుల్ని భర్తీ చేసినప్పుడే డైరెక్టర్లను కూడా నియమిస్తే…ఈపాటికే చాలామందికి పదవీ కాలం దగ్గరపడేది. కొందరికి ముగిసిపోయి ఉండేది కూడా. కానీ ఆ పని చేయకుండా ఎప్పటికప్పుడు పెండింగ్లో పెడుతూ వచ్చారు పెద్దలు. పదవులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా…. జాబితా పంపండని ఒకటి రెండు మీటింగ్స్లో సీఎం రేవంత్రెడ్డి చెప్పారు కూడా.
కానీ… ఆ జాబితా ఎక్కడ అవుతుంది, ఎవరు సిద్ధం చేస్తారన్న విషయంలో క్లారిటీ లేదు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీ పదవులు వస్తాయని భావించారు…కానీ అవి ముగిసిన వెంటనే మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చాయి. మున్సిపల్ ఎలక్షన్స్ కంటే ముందే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని జోరుగా చర్చలు జరిగాయి. కానీ తర్వాత అంటూ వాయిదా వేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాయి. దీంతో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇక ఇప్పటికైనా నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుందా..? లేక మళ్లీ ఏవైనా ఎన్నికలు అడ్డుపడతాయా అని పార్టీ నాయకులే సెటైరికల్గా మాట్లాడుకుంటున్నారు. ఒకేసారి అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు… డైరెక్టర్ల పదవుల్ని భర్తీ చేస్తే పూర్తిస్థాయిలో నాయకులు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. మొదటి విడతలో ఇచ్చిన చైర్మన్స్ పదవీకాలం కూడా ముగుస్తోంది. దీంతో అవి కూడా అయ్యాక మొత్తం కలిపి ఒకేసారి భర్తీ చేస్తారా..? లేక ఉన్నవాటిని ఉన్నట్టుగా చేసేస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది పార్టీలో. ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్స్గా ఉన్న వాళ్లలో ముగ్గురు లేదంటే నలుగురిని మాత్రమే కంటిన్యూ చేయవచ్చని తెలుస్తోంది.
మిగిలిన 32 మందితో పాటు కొత్తగా మరొక 40 మందికిపైగా ఛాన్స్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ లెక్కన కొత్తగా సుమారు 70 మందికి పైగా పదవులు వరించే అవకాశం ఉంది. ఇక కార్పొరేషన్లలో డైరెక్టర్లు, జిల్లా, మండల స్థాయిలో పదవులు వీటికి అదనం. ఇలా అనేకమంది నాయకుల్ని పదవులతో సంతృప్తి పరచడంతోపాటు అందరికీ కలిపి ఒకేసారి ప్రకటిస్తే… అదో జాతరగా ఉండి పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే… అది ఎంతవరకు నిజమవుతుందన్న అనుమానాలు మాత్రం కాంగ్రెస్ నాయకుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పుడూ ఎన్నికల మీద ఎన్నికలు ముగుస్తున్నాయి తప్పితే… మాకు మాత్రం పదవులు రావడం లేదని అంటున్నారు లీడర్స్. ఇప్పటికైనా పదవులు వస్తాయా… ఇంకా ఏవైనా ఎన్నికలు అడ్డంకిగా మారుతాయి అని మాట్లాడుకుంటున్నారు గాంధీభవన్లో.