మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అంచనాలు ఎక్కడ తప్పాయి? పార్టీ వేసుకున్న లెక్కలేంటి? వాస్తవంలో జరిగిందేంటి? ఎన్ని ఛైర్మన్ పోస్ట్లు కొడతామని ముందు అనుకున్నారు? ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంది? ఇప్పటికీ తగ్గకుండా… ఇంకా ఏయే మున్సిపాలిటమీద కారు పార్టీ అధిష్టానం ఆశలున్నాయి? లెట్స్ వాచ్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఎంత ఉత్కంఠ పెంచాయో… క్లైమాక్స్లో ఛైర్మన్స్ ఎంపిక కూడా అంతకు మించిన ట్విస్ట్లతో ఆసక్తి రేపింది. అయితే… ఈఎపిసోడ్లో బీఆర్ఎస్ గురించి ఇంట్రస్టింగ్గా మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. మున్సిపల్ ఛైర్మన్స్ విషయంలో ఆ పార్టీ పెద్దల అంచనాలకు, వాస్తవాలకు చాలా తేడా కనిపిస్తోందన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం కూడా పోస్ట్మార్టం మొదలుపెట్టిందట. మేజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చి మిస్ అయినవి, అసలు మనవే అనుకున్నాక కూడా తేడా కొట్టిన మున్సిపాలిటీల్లో అసలేం జరిగింది? ఎక్కడ తేడా కొట్టిందంటూ ఆరా తీస్తున్నారట పార్టీ పెద్దలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఉన్న అంచనాల ప్రకారం తమకు 40 నుంచి 45 సీట్లు వస్తాయని బహిరంగంగా ప్రకటించింది గులాబీ అధిష్టానం. ఇక పోలింగ్ తర్వాత, ఫలితాలు వచ్చే ముందు కూడా 30 నుంచి 35 మున్సిపాలిటీలు గ్యారంటీ అంటూ కుండ బద్దలు కొట్టేసింది. తీరా… ఫలితాలు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఉన్న లెక్కల ప్రకారం మాకు 17 మున్సిపల్ ఛైర్మన్ సీట్లు వస్తాయని చెప్పారు పార్టీ పెద్దలు. వాటితో పాటు హంగ్ వచ్చిన 38 మున్సిపాలిటీలలో కనీసం 10 అయినా గెల్చుకుంటామన్నారు.
కానీ… ఫైనల్గా వాస్తవంలోకి వచ్చేసరికి ఆ పార్టీ అంచనాలు తప్పాయి. క్లియర్ కట్ మెజార్టీ వచ్చిన స్థానాల్లో మాత్రమే చైర్మన్, వైస్ చైర్మన్స్ను సొంతం చేసుకోగలిగింది బీఆర్ఎస్. ప్రస్తుతం అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బీఆర్ఎస్ కు 17 మున్సిపాలిటీలు దక్కాయి. ఇక హంగ్ వచ్చిన చోట లెక్కలు తప్పాయి. అసలు ఆమనగల్ , అమరచింత లాంటి మునిసిపాలిటీలు కచ్చితంగా తమకు వస్తాయనుకున్నా… అవి కాంగ్రెస్ అకౌంట్లో పడిపోయాయి. ఇక తమకు రాదు అనుకున్న రాయికల్ మున్సిపాలిటీలో కారు గేర్ మార్చగలిగింది. ఇంతవరకు బాగానే ఉందిగానీ…. హంగ్ వచ్చిన వాటిలో ఒక్కటి కూడా బీఆర్ఎస్కు దక్కలేదు. కనీసం 10 హంగ్ మున్సిపాలిటీలు మా అకౌంట్లో పడతాయని ముందు గొప్పగా చెప్పినా… చివరికి ఆ అంచనాలు తప్పిపోయాయి. అలాంటి కొన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కే ఎక్కువ మంది కౌన్సిలర్స్ ఉన్నా… ఛైర్మన్ సీట్లు మాత్రం దక్కించుకోలేకపోయింది. అయితే… ఇప్పటికీ బీఆర్ఎస్ ఆశలు వదులుకోవడం లేదు.
రకరకాల కారణాలతో 11 మున్సిపాలిటీల ఛైర్మన్స్ ఎన్నికను ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. అందులో కనీసం మూడు నాలుగు తమకు దక్కుతాయని చెబుతున్నారు కారు లీడర్స్. జనగాం, కేతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల మీద ఆశగా ఉన్నారు. సరేనని వాటిని కూడా కలుపుకున్నా…. పార్టీకి నికరంగా 20 స్థానాలను కూడా దాటే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయంపై ఇప్పుడు పార్టీలో చర్చ మొదలైంది.
తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, అది తమకు కలిసి వస్తుందని మొదట్లో ప్రతిపక్షం లెక్కలేసుకున్నా…. అవేవీ వర్కౌట్ అవలేదు. చివరి వరకు జిల్లాల పర్యటనలు చేయని కేటీఆర్ హరీష్ రావులు చివరి మూడు రోజులు దృష్టి పెట్టడం వల్లే ఈ మాత్రమైనా స్థానాలు దక్కాయని అంటున్నారు పార్టీ నేతలు. ఇదే సమయంలో ముఖ్య నేతలు మొదట్నుంచి జిల్లాల పర్యటనలు చేస్తే ఫలితాలు మరోలా ఉండేవేమోనన్న చర్చ జరుగుతోంది పార్టీలో. అలాగే… మున్సిపాలిటీల్లో స్థానిక రాజకీయాలు, అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూడడం లాంటి ప్రభావిత అంశాలు చాలా ఉంటాయని మరో వాదన వినిపిస్తున్నారు కొందరు బీఆర్ఎస్ నాయకులు.ఇప్పటివరకు వచ్చిన స్థానాలతో ఫర్వాలేదనుకుంటున్నా….మొత్తం 30 మున్సిపల్ ఛైర్మన్స్ అయినా చేతికి వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది గులాబీ వర్గాల్లో.