ఇసుక.. బుసక, మట్టి..మశానం, కుదిరితే స్మశానం సైతం… దొరికింది దోచెయ్… కన్ను పడితే కబ్జా చేసెయ్ అన్నట్టుగా ఉందట అక్కడ వ్యవహారం. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, అందునా దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే ఇలాంటి ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మరి ఈ సంగతి మంత్రిగారికి తెలీదా..? లేక తెలిసినా ఆ…. మనోళ్ళే కదా, అధికారం ఉన్నప్పుడు ఆ మాత్రం చేయకుంటే కిక్కేముంటుందని చోద్యం చూస్తున్నారా? ఎవరా మినిస్టర్? నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఆయనకు తెలుస్తోందో లేదోగానీ…. అనుచరులు చేస్తున్న అడ్డగాలు దందాల గురించి లోకల్లో విపరీతంగా గుసగుసలాడేసుకుంటున్నారు. చివరికి చికెన్ షాపుల్లోని వేస్ట్ని కూడా వదలకుండా టీడీపీ నాయకులు వేళ్ళు పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
పనికిరావని పడేసే కోడి వ్యర్ధాలతోనే వీళ్ళు దందా చేస్తున్నారంటే ఇక ఇసుక, మట్టి, మైనింగ్ లాంటి వాటి గురించి వేరే చెప్పాలా అంటున్నారు స్థానికులు. మంత్రి ఆనం అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గంలో తిరుగుతున్నారని, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నియోజకవర్గ టీడీపీ నాయకులు ప్రకృతి సంపదను చెరబడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని ఓవైపు మంత్రి చెబుతుంటే…. మరోవైపు ఆయన అనుచరులు మాత్రం ఎడాపెడా అక్రమాలకు పాల్పడుతున్నారన్నది లోకల్ టాక్. నియోజకవర్గంలోని ఆత్మకూరు, సంగం, చేజర్ల, అనంతసాగరం మండలాల మీదుగా పెన్నా నది ప్రవహిస్తోంది. ఈ మండలాలన్నిటిలో అధికార, అనధికార ఇసుక రీచ్లు ఉన్నాయి. కొన్నిచోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రింబవళ్లు ఇసుక తోడేస్తూ… కోట్లకు పడగెత్తుతున్నారు అక్రమార్కులు. అంతా అధికార పార్టీ నేతలే కావడంతో పోలీసులు కూడా మాకేం కనిపించడం లేదన్నట్టుగా ఉంటున్నారట. అక్రమంగా తిరుగుతున్న భారీ టిప్పర్ల కారణంగా గతంలో పెరమన సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి ఏడుగురు బలయ్యారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు తప్పించారన్న ఆరోపణలు ఉన్నాయి.
చేజర్ల మండలం పడమటి కంభంపాడు నుంచి అనుమతులకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా… మైనింగ్ అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని చెప్పుకుంటున్నారు. మంత్రి ఇలాకా కావడంతో అధికారులు కూడా ధైర్యం చేయలేకపోతున్నారన్నది ఇంకో వెర్షన్. ఇక సంగం మండలం దువ్వూరు సమీపంలో చికెన్ వెస్టేజ్ అక్రమ రవాణా జరుగుతోంది. ఈ విషయాన్ని ఇటీవల మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ప్రస్తావించారు. షాపుల నుంచి కలెక్ట్ చేసిన చికెన్ వేస్ట్ను తీసుకెళ్ళి చెరువుల్లోని చేపలకు వేస్తున్నారని, ఆ చేపలను మంత్రికి పంపిస్తా…… ఆయన తింటారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు విక్రమ్రెడ్డి. మరోవైపు ఏఎస్ పేట మండలానికి చెందిన కీలక నేతతో పాటు.. చేజర్ల మండలానికి చెందిన ఓ హాస్పిటల్ నిర్వాహకుడు కూడా.. మంత్రి ఆనం పేరు చెప్పుకొని అవినీతి వ్యవహారాలు నడిపిస్తున్నారన్న గుసగుసలు పెరిగిపోతున్నాయి. వీటన్నిటిని ఆనం రామనారాయణరెడ్డి చుట్టూ ఉండే కోటరీ పర్యవేక్షిస్తోందన్నది ఇంటర్నల్ టాక్.
మేటర్ ఆయన దృష్టికి వెళ్తోందో లేదోగానీ… అనుచరులు మాత్రం అవినీతి అనకొండలుగా మారారని నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో మేం ఇంతకు ముందు చూసిన ఆనం వేరు, ఇప్పుడు చూస్తున్న ఆనం వేరు అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. అటు నెల్లూరుపాలెం సమీపంలోని ఓ లేఔట్ వ్యవహారాన్ని కూడా స్థానిక టీడీపీ నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారట. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి గురించి పెద్దాయనకు చెప్పే పరిస్థితి లేదని, అందుకే నేరుగా అధికారుల దృష్టికే తీసుకువెళ్తున్నామన్నది టీడీపీ నేతల మాట. నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ దోపిడీ గురించి అయితే మాట్లాడే పనే లేదని అంటున్నారు పాత తరం తెలుగుదేశం నాయకులు. అవినీతి, అక్రమాలపై ఓ వైపు వైసీపీ, మరో వైపు ఆనం వ్యతిరేక శిబిరం సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే భవిష్యత్లో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందన్న మాట టీడీపీలోనే వినిపిస్తోంది.