Off The Record: తెలుగుదేశం పార్టీని పొలిటికల్ యూనివర్శిటీగా చెప్పుకుంటారు చాలామంది. పార్టీ చరిత్ర, అందులో తయారైన నాయకులు, వాళ్ళు ఎదిగిన తీరును చూసి అలా మాట్లాడుతుంటారు పొలిటికల్ పండిట్స్. రెండు రాష్ట్రాల్లో… కులాలకు అతీతంగా ఇప్పుడున్న సూపర్ సీనియర్స్ చాలామందికి రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీగా టీడీపీకి ప్రత్యేకత ఉంది. పాతిక, 30 ఏళ్ళ వయసులో పార్టీ సభ్యత్వం తీసుకుని ఇప్పుడు 70 ఏళ్లు వచ్చాక కూడా పక్క చూపులు చూడని నాయకులు ఉన్నారు టీడీపీలో. ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకు చెబుతున్నారు? ఆ మాత్రం మాకు తెలీదా ఏటీ…అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్…. అక్కడికే వస్తున్నాం…. అలాంటి చరిత్ర, స్థాయి ఉన్న తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య కొత్త చర్చ మొదలైంది. ఇప్పుడది పీక్స్కు చేరింది కూడా. పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలి. నెక్స్ట్ జనరేషన్ని ఎంకరేజ్ చేయాలన్నది ఆ చర్చల సారాంశం. అందుకోసం చాలామంది పెద్దోళ్ళని పక్కన పెట్టాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. కాలక్రమంలో కొత్త నీరు వచ్చి పాత నీరు బయటికి వెళ్ళడం కామనే అయినా…. ఇది రాజకీయం కదా… ఇక్కడ అనుభవం కూడా చాలా అవసరం. కొత్త రక్తం కొత్త రక్తం అని ఓ…. తెగ ఊగిపోతూ… ఉన్న సీనియర్స్ మొత్తాన్ని మూలకు పడేస్తే… మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు కూడా వెళ్ళాయట టీడీపీ అధిష్టానానికి. ఆ హెచ్చరికలను మొదట్లో…. పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నా…. మారుతున్న తాజా పరిణామాలతో పునరాలోచనలో పడ్డట్టు సమాచారం.
Read Also: Off The Record: వరంగల్ లో మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యేల తిరుగుబాటు..?
జూనియర్స్ యాక్టివ్గా ఉన్నా… సీనియర్స్, జూనియర్స్ మధ్య బ్యాలెన్స్ లేకుంటే… ఆ వార్నింగ్స్ వచ్చినట్టుగానే దెబ్బతింటామని గ్రహించినట్టు చెప్పుకుంటున్నారు. అందుకే.. ఆ పెద్దోళ్ళని సైడ్ చేసే ప్రోగ్రామ్ని కొన్నాళ్ళ పాటు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అందుకు కారణాలు చాలా బలంగా ఉన్నాయట. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రస్తుతం దూకుడు పెంచారు. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాల పేరుతో జనంలోకి వెళ్ళే ప్లాన్లో ఉన్నారాయన. ఇప్పటికే మూడు పరామర్శ యాత్రలు చేసి పార్టీకి కొంత ఊపు తెచ్చారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఆ మూడు పరామర్శ యాత్రల్లో రకరకాల వివాదాలు రేగడం, వైసీపీ కేడర్ మీద పోలీస్ కేసులు లాంటి వ్యవహారాలు నడిచాయి. అయితే… ఏ సందర్భంలోనూ టీడీపీ యువ నాయకులు వైసీపీకి గట్టి కౌంటర్ ఇవ్వలేకపోయాన్న అభిప్రాయం ఉందట ఎన్టీఆర్ భవన్ వర్గాల్లో. అటు మంత్రులు కూడా తగిన స్థాయిలో అటాక్ చేయలేకపోయారన్న అభిప్రాయం ఉందట హైకమాండ్లో. ఈ పరిస్థితుల్లో…. దూకుడు పెంచుతున్న జగన్ను గట్టిగా ఢీకొట్టాలంటే…సీనియర్స్ కావాల్సిందేనని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు సీనియర్స్ అందర్నీ పక్కకు నెట్టేసి యూత్కు ఛాన్స్ పేరుతో ప్రయోగాలు చేస్తే… అవి వికటించే ప్రమాదం ఉందన్న అంచనాకు పార్టీ పెద్దలు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే… ఇంకొన్నాళ్ళు సీనియర్స్ సేవల్ని విచ్చలవిడిగా వాడుకోవాలనుకుంటున్నట్టు సమాచారం.
Read Also: Houthi Rebels: అమెరికాకు హౌతీ రెబల్స్ వార్నింగ్.. ఇజ్రాయెల్కు సహకరిస్తే మీ నౌకలపై దాడి చేస్తాం
తాజా రియాక్షన్స్ని చూశాకే ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. పరామర్శ యాత్రల్లో… జగన్ చేసిన కామెంట్స్పై టీడీపీ సీనియర్స్… గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ళ నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి లాంటి వాళ్ళు వరుసగా స్పందిస్తున్నారు. ఇన్నాళ్ళు వీళ్ళు అడపాదడపా మాట్లాడినా… మాటల్లో ఆ వాడి లేదని, ఇప్పుడు రియాక్షన్స్ని చూస్తుంటే….మాత్రం బౌన్స్ బ్యాక్ అయినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. యువ నాయకులు స్పందించినా… మాటల్లో ఆ పంచ్ మిస్ అవుతోందని, అది కావాలంటే మాత్రం… సీనియర్స్ అవసరమన్న అభిప్రాయానికి వచ్చిందట టీడీపీ హైకమాండ్. దీంతో త్వరలో వేయాలనుకుంటున్న రాష్ట్ర కమిటీలో… యువనేతలతో పాటు సీనియర్స్కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడైనట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. పొలిట్ బ్యూరోలో కూడా రెండు తరాల మధ్య బ్యాలెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారట. ముందైతే…. అసలు పార్టీ మొత్తాన్ని యువరక్తంతో నింపేసి పరవళ్ళు తొక్కించాలని అనుకున్నా… తాజా పరిస్థితుల దృష్ట్యా సమ ప్రాధాన్యం అంశం తెరమీదికి వచ్చిందన్నది టీడీపీ ఇంటర్నల్ వాయిస్. పెద్దోళ్ళలో కూడా వైసీపీ నేతల మాటలకు తగ్గట్టుగా దీటైన ఆన్సర్ ఇవ్వగలిగిన వాళ్ళకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిశాకే…. ఇన్నాళ్లు అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, పదవులు ఆశించి భంగపడి… ఆ… మనకెందుకులే అని కామ్గా ఉన్నవాళ్లంతా యాక్టివ్ అయిపోయి వైసీపీ మీద దూకుడుగా మాట్లాడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీలో. కారణం ఏదైనా….. ఇలా బ్యాలెన్స్ చేయడం మాత్రం పార్టీకి మంచిదేనన్న అభిప్రాయం ఉందట కేడర్లో.