Off The Record : ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికార భాగస్వామి జనసేన కీలక నాయకుడు నాగబాబు భవిష్యత్ ఏంటన్నదే ఆ డిస్కషన్. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో కూడా ఉన్న నాగబాబు ఎమ్మెల్సీ అయినా… అసలు లక్ష్యం మాత్రం నెరవేరలేదట. ఎమ్మెల్సీగా నామినేట్ అయి దాదాపు ఏడాదవుతోంది. అయితే… మండలి పోస్ట్ ఇచ్చినప్పుడే ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశముందన్న ప్రచారం జోరుగా జరిగింది. అప్పట్లో రకరకాల లెక్కలు, ఎక్కాలు చెప్పేసి కూటమి పెద్దలు కూడా సానుకూలంగా ఉన్నారన్న వార్తలు వినిపించాయి. అంతే కాదు… నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకుంటామని నేరుగా సీఎం చంద్రబాబు నాయుడే ప్రకటించారు కూడా. కానీ… ఇంతవరకు వర్కౌట్ అవలేదు. అలా ఎందుకంటే రకరకాల వాదనలు వినిపించాయి. అన్నకు కేబినెట్ బెర్త్ విషయంలో పవనే ఒకటికి రెండు సార్లు ఆలోచించినట్టు చెప్పుకున్నారు. ఒకే మంత్రివర్గంలో అన్నదమ్ములు ఉండటం, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ కీలక పదవులు ఇవ్వడం లాంటివి బయటికి తప్పుడు సంకేతాలు పంపుతాయన్న ఆలోచనతో… పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్న మాటలు కూడా వినిపించాయి.
ఇలా రకరకాల చర్చోపచర్చలతోనే ఏడాది గడిచిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త డిస్కషన్స్ ఆసక్తికరంగా నడుస్తున్నాయి. వచ్చే జూన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీలు అవుతున్నాయి. అందులో ఒకటి తమ కోటాకు వస్తుందన్నది జనసేన పెద్దల లెక్క. ఆ కోటాలోనే… నాగబాబును రాజ్యసభకు పంపాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా చేస్తే… చాలా రాజకీయ సమీకరణలు సర్దుబాటు అవుతాయని కూడా జనసేనలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర కేబినెట్లో అన్నదమ్ములు ఉండే సమస్య అనుకుంటున్నారు కాబట్టి… రాజ్యసభ్యుడి హోదాలో ఢిల్లీ పంపితే… అక్కడ జనసేన తరపున కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ఆలోచన మొదలైందట. ప్రస్తుతం పవన్కళ్యాణ్కు అత్యంత సన్నిహిత వర్గాల్లో దీనికి సంబంధించిన చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. గతంలో చిరంజీవి కూడా ఇలాగే రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రి అయిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనసేన నేతలు. నాగబాబు ఢిల్లీలో ఉంటే… పార్టీ తరపున వ్యవహారాల చక్కబెట్టడానికి కూడా… తేలిక అవుతుందని అనుకుంటున్నట్టు సమాచారం. అన్నను అటు పంపిస్తే… ఇటు రాష్ట్ర మంత్రివర్గంలో జనసేన కోటాలో ఒక బీసీ నాయకుడికి అవకాశం ఇవ్వొచ్చని, దాని ద్వారా సామాజిక లెక్కలు సెట్ అవుతాయని సమ న్యాయం చేసిన భావన కలుగుతుందన్న ఆలోచన సైతం ఉందట.
ఇక నాగబాబు విషయానికి వస్తే ఆయన మొదటి నుంచి ఎంపీగా వెళ్లాలనే ఆసక్తి చూపించినట్టు చెబుతున్నారు సన్నిహితులు. 2019లో నరసాపురం ఎంపీ సీటుకు పోటీ చేసి ఓడిపోరాయన. 2024లో అనకాపల్లి బరిలో దిగాలకున్నా… కూటమి సర్దుబాటులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లింది. ఆ సమయంలోనే నాగబాబుకు రాజ్యసభ హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగింది. 2024లో రాజ్యసభ ఖాళీలు వచ్చినప్పటికీ ఛాన్స్ దక్కలేదు. తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినా.. నాగబాబు మనసు మాత్రం రాజ్యసభ మీదే ఉన్నట్టు తెలుస్తోంది. పైగా జనసేన కోటాలో కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని, అందుకే ఎమ్మెల్సీ కూడా ఈ విషయంలో గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో తనకు ఉన్న పవర్ మొత్తం ఉపయోగించి..చిన్నన్నయ్యను వన్ షాట్ అల్ ఫినిష్ అన్నట్టుగా రాజకీయంగా సెట్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే… నాగబాబు త్వరలోనే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశముందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది రాజకీయ వర్గాల్లో.