Off The Record: ప్రాంతీయ పార్టీల రాజకీయమంతా… కుటుంబాల చుట్టూ తిరగడం, అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏవైనా పొరపొచ్చాలొస్తే… ఆయా పార్టీలు నిలువెల్లా షేకైపోవడం సర్వ సాధారణమైంది. దేశమంతటా ఇదే తరహా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ పరంపరలోనే… తాజాగా తెలంగాణ వంతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెలు జగన్, షర్మిల మధ్య నడుస్తున్న వివాదాలు, జరిగిన, జరుగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే… తెలంగాణలో కూడా అన్నా చెల్లెలు కేటీఆర్, కవిత మధ్య అంటుకున్న అగ్గి తాలూకు సెగలు బీఆర్ఎస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా మీడియా చిట్చాట్లో కవిత చేసిన వ్యాఖ్యల్ని చూస్తుంటే… అన్నా చెల్లెలి మధ్య పెద్ద అగాధమే ఉన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆ సందర్భంలో కవిత…. అన్న పేరు చెప్పకున్నా… అన్నీ ఆయన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ దేవుడని అంటూనే… ఆయన చుట్టూ దయ్యాలు చేరాయనడం, పార్టీని తిరిగి నిలబెట్టే తీరు ఇదేనా అని ప్రశ్నించడం, నడపాల్సిన వాళ్ళు ట్వీట్స్కే పరిమితం అయితే ఎలాగంటూ…. పరోక్షంగా కవిత అన్ననే టార్గెట్ చేశారన్నది విస్తృతాభిప్రాయం.
Read Also: Nigeria Floods: నైజీరియాను ముంచెత్తిన వరదలు.. 111 మంది మృతి
ఆ ఎపిసోడ్ తర్వాత…. ఇటు కేటీఆర్, అటు కవిత అనుచరులు, అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధమే జరుగుతోంది. ఏ దశలోనూ ఇది ఆగకపోగా…. అంతకంతకూ సీరియస్ అవుతోంది. బీఆర్ఎస్ మీద అభిమానం ఉన్న వాళ్ళలో మెజార్టీ కేటీఆర్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే… జాగృతి నాయకులు మాత్రం… మా కవితక్క హండ్రెడ్ పర్సంట్ కరెక్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇలా… సోషల్ స్ట్రీట్స్లో విచ్చలవిడి యుద్ధం ఒకవైపు జరుగుతుంటే… మరోవైపు ఇంకో ఆసక్తికరమైన అంశం తెర మీదికి వచ్చింది. సోషల్ మీడియాలో రెండు పక్షాలు చెలరేగడాన్ని చూస్తున్న న్యూట్రల్ పర్సన్స్ కొందరు.. వాళ్ళను ఉద్దేశించి కాస్త డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నారట. హే… ఊకోండి మీరంతా….. అన్నా చెల్లెళ్ళ మధ్య అభిప్రాయాలు రావా? తర్వాత అన్నీ సర్దుకుని వాళ్ళు తిరిగి కలిసిపోరా? మాట్లాడుకోరా? ఆ మాత్రం దానికి మీరంతా రెచ్చిపోయి తర్వాత వెర్రి గొర్రెలవడం ఎందుకు? కావాలంటే…. ఆగస్ట్లో కలిసిపోతారు చూడండని అంటున్నారట. ఏ… అప్పటిదాకా ఎందుకు? అప్పుడేమన్నా అద్భుతాలు జరిగిపోతాయా అంటే… అవును ఆ తొమ్మిదో తేదీన అదే జరుగుతుంది చూడండని అంటున్నారట. ఆగస్ట్ 9న రక్షాబంధన్ ఉంది. ఏటా రాఖీ పండగ రోజున కవిత కేటీఆర్ దగ్గరికి వెళ్ళి రాఖీ కడతారు.అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా… తెలంగాణ ఉద్యమంలో ఇద్దరూ యాక్టివ్ అయినప్పటి నుంచి, నిరుటిదాకా.. ఈ విషయం బయటికి కనిపిస్తూనే ఉంది. కవిత కేటీఆర్ ఇంటికి వెళ్ళడం, ప్రేమగా అన్నకు రాఖీ కట్టడానికి సంబంధించిన విజువల్స్ ఏటా బయటికి వస్తూనే ఉన్నాయి. ఏటా మిస్ అవకుండా అన్నకు రాఖీ కడుతున్న కవిత నిరుడు మాత్రం ఆ పని చేయలేకపోయింది.
Read Also: Nigeria Floods: నైజీరియాను ముంచెత్తిన వరదలు.. 111 మంది మృతి
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉండటం కారణంగా… నిరుడు రాఖీ కట్టలేకపోయింది కవిత. దానిమీదే స్పందిస్తూ….కేటీఆర్ బాధపడ్డారు కూడా. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న తన చెల్లితో రాఖీ కట్టించుకోలేకపోతున్నానని ఫీలయ్యారాయన. దీంతో ఈసారి ఈ సెలబ్రేషన్స్ గ్రాండ్గా ఉంటాయని ఊహించారట వాళ్ళ అనుచరులు, అభిమానులు. కానీ…అనూహ్యంగా మారిపోయిన పరిణామాలతో… ఇప్పుడు కొత్త డౌట్స్ వస్తున్నాయట. నిరుటిలాగే… ఈసారి కూడా కవిత రాఖీ కట్టడం మిస్ అవుతారా? లేక రాజకీయం రాజకీయమే, అనుబంధం అనుబంధమేనంటూ వెళ్లి కడతారా అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ సమయానికి అసలామె బీఆర్ఎస్లోనే ఉంటారా? లేక వేరే ఆలోచన చేస్తారా అన్న చర్చోపచర్చలు జరుగుతుండటంతో రాఖీ వ్యవహారం ఇంట్రస్టింగ్గా మారింది. బయటి కుటుంబాల్లో చిన్న చిన్న గొడవలు ఉన్నట్టే… పొలిటికల్ ఫ్యామిలీస్లో కూడా గొడవలు సాధారణమని, అంత మాత్రాన రక్త సంబంధాలను ఎవరూ వదులుకోబోరని, ఆగస్ట్లో అన్నీ సర్దుకుంటాయని చెబుతున్నారు కేసీఆర్ కుటుంబ అభిమానులు. పరిస్థితులు ఎలా మారతాయోనని ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.