Off The Record: నడిగడ్డ ప్రాంతంగా చెప్పుకునే గద్వాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించి అసెంబ్లీకి పంపిన ఇక్కడి ఓటర్లు.. 2018, 2023 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కు బాసటగా నిలిచారు. మారిన రాజకీయ పరిణామాలతో గద్వాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి… మంత్రి జూపల్లి ప్రోద్బలంతో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గపోరుకు బీజం పడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య వర్గం, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి వర్గంగా చీలిపోయింది లోకల్ కాంగ్రెస్. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా అదే పోరు ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ మల్లు రవిగా టర్న్ అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి మంత్రి జూపల్లి కృష్ణారావు మద్దతిస్తున్నారట. అటు గత ఎన్నికల్లో ఆయన చేతిలోనే ఓడిపోయిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితకు ఎంపీ మల్లు రవి బ్లెస్సింగ్స్ మెండుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
దీంతో ఎంపీ వైఖరి మీద ఎమ్మెల్యే టీమ్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు గద్వాల కాంగ్రెస్లో వర్గపోరు కు బీజం వేసిందే మంత్రి జూపల్లి అని ఆరోపిస్తోంది సరిత టీమ్. అదే సమయంలో ప్రస్తుత వివాదాలకు ఎంపీ మల్లు రవి వైఖరే కారణమని మండిపడుతోంది ఎమ్మెల్యే వర్గం. అదే సమయంలో ఇక్కడ మరో సమస్య కూడా వస్తోందట. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన కృష్ణమోహన్రెడ్డి.. ప్రస్తుత పొలిటికల్ పరిణామాలతో.. తూచ్ నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్లోనే గెలిచా, బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ స్వరం మార్చడంతో… ఇప్పుడసలు ఆయన ఏ పార్టీలో ఉన్నారో అర్ధం కావడం లేదంటున్నారు పరిశీలకులు. ఇదే పాయింట్ను హైలైట్ చేస్తూ… సిసలైన కాంగ్రెస్ నాయకులం మేమేనని ప్రచారం చేసుకుంటోందట ఎంపీ అండదండలున్న సరితా వర్గం. ఈ వివాద క్రమంలోనే….వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కోసం వచ్చే మంత్రుల ఎదుటే… రెండు వర్గాలు బాహాబాహీకి దిగి… రచ్చ చేస్తుండటంతో గద్వాల టూర్ అంటేనే హడలి పోతున్నారట అమాత్యులు. ఇక ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ప్రకారం దక్కుతున్న గౌరవాన్ని సహించలేక సరిత వర్గం ప్రభుత్వ కార్యక్రమాల వేదికల దగ్గరే గొడవపడుతూ… అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారని మండిపడుతోంది కృష్ణమోహన్రెడ్డి వర్గం.
తాజాగా భూ భారతి అవగాహన సదస్సు కోసం నియోజక వర్గానికి వచ్చిన మంత్రి పొంగులేటి కార్యక్రమంలో కూడా రచ్చ జరిగింది. దీంతో పరిస్థితి చేయిదాటిపోకుండా… సరితా వర్గాన్ని బుజ్జగించి కూర్చోబెట్టారు ఎంపి మల్లు రవి. ఇక కార్యక్రమం ముగిశాక మంత్రి హెలిప్యాడ్ వద్దకు బయలు దేరిన క్రమంలో ఒకే వాహనంలో ఉన్న ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే క్రిష్ణమోహన్ రెడ్డి…. లోపలే బాబాబాహీకి దిగినట్టు సమాచారం. ఆ కారులోనే మంత్రి పొంగులేటి , ఏఐసిసి సెక్రటరీ సంపత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో సరిత వర్గానికి అండగా ఉంటూ, వర్గపోరును పెంచి పోషిస్తున్నావని, నా నియోజక వర్గంలో నీ పెత్తనం ఏంటంటూ ఎంపి మల్లు రవితో ఎమ్మెల్యే వాగ్వివాదానికి దిగారట. మేటర్ నువ్వెంత అంటే నువ్వెంత అనేదాకా వెళ్ళడంతో…సహనం కోల్పోయిన ఇద్దరూ దాదాపుగా బాహాబాహీకి దిగినంత పని చేశారని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి జూపల్లి ఆశీస్సులతో బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి , మల్లు రవి అండదండలతో సరితా తిరుపతయ్య లు …. ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ నియోజక వర్గం పై పట్టు కోసం రాజకీయాన్ని హీటెక్కిస్తుండగా …. వీరి మధ్య కేడర్ నలిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద గద్వాల సెగ్మెంట్లో వర్గపోరుకు పడ్డ బీజం… పెరిగి పెద్దదై ఇప్పుడు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా పరిణామం చెందిందని మాట్లాడుకుంటున్నారు. పార్టీ పెద్దలు తక్షణం గద్వాల మీద దృష్టి పెట్టకుంటే డ్యామేజ్ గట్టిగానే ఉంటుందని అంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు.