Off The Record: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు ఎపిసోడ్లో ఎప్పటికప్పుడు ట్విస్ట్లు పెరుగుతూనే ఉన్నాయి. టీడీపీ తరపున మూడు సార్లు పోటీ చేసి రెండు విడతలు గెలిచిన వంశీ… ఒకసారి వైసీపీ బీ ఫామ్ మీద బరిలో దిగారు. 2019లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీలోకి జంప్ చేయడం… చంద్రబాబు, లోకేష్ మీద హద్దు మీరి మాట్లాడ్డంతో… హిట్ లిస్ట్లోకి చేరిపోయారు. తాము అధికారంలోకి వచ్చాక వంశీని కచ్చితంగా టార్గెట్ చేస్తామని అప్పట్లోనే హెచ్చరించాయి టీడీపీ శ్రేణులు. రాష్ట్రంలో అధికారం మారాక ఇక వంశీకి గడ్డుకాలమేనని అనుకుంటున్న టైంలోనే….ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఓ కిడ్నాప్ కేసులో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక అప్పటి నుంచి వరుస కేసులు పీటీ వారెంట్స్తో… ఆ జైలుకు, ఈ జైలుకు మారుతూనే ఉన్నారాయన. ఒక కేసులో బెయిల్ వచ్చినా…. మరో కేసులో అరెస్ట్ అవుతూ ఆయన సుమారు 105 రోజుల నుంచి జైల్లోనే ఉన్నారు వంశీ. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల బెయిల్ వచ్చింది ఆయనకు. దీంతో ఇక రిలీజ్ అవుతారని భావించారు చాలామంది.
Read Also: Off The Record: వాలంటీర్ వ్యవస్థను వైసీపీ లైట్ తీసుకోబోతోందా..?
అయితే… అదే సమయంలో బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారంటూ… గతంలో నమోదైన కేసుకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలు చేశారు పోలీసులు. అదే రోజున… గతంలో అక్రమ మైనింగ్ చేశారంటూ…. మరో కేసు కూడా నమోదైంది మాజీ ఎమ్మెల్యే మీద. దీంతో వంశీ బయటకు వస్తారని ఎదురు చూస్తున్న ఆయన వర్గానికి గట్టి షాక్ తగిలినట్టయింది. ఒక కేసులో బెయిల్ వచ్చే సమయానికి మరో కొత్త కేసు నమోదు చేస్తున్న పరిస్థితులు ఉండటంతో… అసలాయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియక టెన్షన్గా ఉందని మాట్లాడుకుంటున్నారు వంశీ అనుచరులు. అలా ఇప్పటి వరకు వంశీ పై మొత్తం ఎనిమిది కేసులు నమోదవగా… ఏడు కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చాయి. ఇక నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాత్రమే వంశీకి బెయిల్ రావాల్సి ఉంది. ఇది కూడా వచ్చే వారం క్లియర్ అవుతుందని ఆశగా ఉందట ఆయన అనుచరగణం. సరిగ్గా ఇక్కడే వాళ్ళని ఇంకో టెన్షన్ వెంటాడుతున్నట్టు తెలుస్తోంది.
Read Also: Off The Record: వాలంటీర్ వ్యవస్థను వైసీపీ లైట్ తీసుకోబోతోందా..?
సరిగ్గా ఆ బెయిల్ వచ్చే సమయానికి మరో కేసు ఏదన్నా బుక్ అవుతుందా? లేక జైలు నుంచి రిలీజ్ అవుతారా అన్నది అర్ధంగాక టెన్షన్ పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మళ్ళీ కొత్త కేసులేవీ బుక్ అవకుంటే మాత్రమే… విడుదలకు అవకాశం ఉంటుంది. అయితే… ఇప్పటికే వంశీ అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలంటూ… ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇటీవల అక్రమ మైనింగ్కు సంబంధించి కూడా సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే కేసు నమోదు చేశారు. దీంతో ఆయనపై కొత్తగా ఇంకో కేసు పెట్టడానికి రంగం సిద్ధం అవుతోందా లేక ఇంతటితో సరిపెడతారా అనే చర్చ జోరుగా జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో. ఇప్పటికే 105 రోజులకు పైగా జైలు జీవితం గడిపారు వంశీ. ఈ క్రమంలో… ఆయన రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన సమస్యలు తెలుసుకుని మెరుగైన వైద్యం చేయించమని హైకోర్ట్ కూడా ఆదేశించింది. అటు వంశీకి సానుభూతి రాకుండా ఆయన వ్యతిరేకవర్గం కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పోస్టింగ్స్తో అడ్డుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలాంటి వాతావరణంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే మీద మరో కేసు బుక్ అవుతుందా? లేక నకిలీ ఇళ్ళ పట్టాల కేసులో బెయిల్ వస్తే వదిలేస్తారా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు.