Off The Record: టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కుటుంబం మధ్య మరోసారి రచ్చ రాజుకుంది. రాజమండ్రి సిటీ సీటు విషయంలో రెండు వర్గాల మధ్యవిభేదాలు ఎప్పటి నుంచో వివాదాలున్నాయి. 2014-19 మధ్య పీక్స్కు చేరిన గొడవలు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళతో పాటు గడిచిన ఏడాదిగా కాస్త తగ్గాయి. కిందిస్థాయిలోని నాయకుల మధ్య అడపాదడపా గొడవలు జరుగుతున్నా… అవి పెద్ద నేతలిద్దరూ జోక్యం చేసుకునేదాకా వెళ్ళలేదు. కానీ….. తాజాగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వ్యవహారం మళ్లీ నిప్పు రాజేసిందంటున్నాయి రాజమండ్రి రాయకీయ వర్గాలు. యూనివర్శిటీని పూర్తిగా రాజమండ్రి తరలించేందుకు లైన్ క్లియర్ అయింది. దీనికి క్యాబినెట్ ఆమోదముద్ర కూడా పడటంతో.. తానే సాధించినట్టు ప్రకటించుకున్నారు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కానీ… ఒకపక్క రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మరోవైపు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తదితరుల పాత్ర కూడా ఈ విశ్వవిద్యాలయం ఇక్కడికి రావడంలో కీలకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాన్ని పట్టించుకోకుండా మొత్తం తానే దీన్ని సాధించినట్లు ఆదిరెడ్డి వాసు ప్రకటించుకోవడాన్ని ఆయా వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయట. ఇన్నాళ్ళు కామ్ గా ఉన్న బుచ్చయ్య ఈ ఎపిసోడ్తో ఒక్కసారిగా భగ్గుమన్నారు.
Read Also: Brij bhushan singh: బ్రిజ్ భూషణ్కు ఊరట.. పోక్సో కేసు కొట్టివేత
ఆదిరెడ్డి కుటుంబంపై ఒక రేంజ్లో రెచ్చిపోయారు. యూనిపర్శిటీ కోసం తాము పాటుపడితే… తగుదునమ్మా ఇప్పుడొచ్చి… తనపేరు వేసుకునేందుకు తహతహలాడుతున్నారని, కొందరు నాయకుల గురించి తాను మాట్లాడదలచుకోలేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. యూనివర్శిటీ కోసం రూరల్ ఎమ్మెల్యేగా తాను తొలి నుంచి కృషి చేస్తూ.. పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించానన్నారు బుచ్చయ్య. ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు కూడా పంపించినట్టు వివరించారు. మంత్రి దుర్గేష్ కూడా దీనికోసం తనవంతు బాధ్యత నిర్వర్తించి ఉండవచ్చునన్నారు. అదంతా మర్చిపోయి… ఇదేదో తమ గొప్పఅని తండ్రి, కొడుకులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు బుచ్చయ్య చౌదరి. ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు ఏడాది కాలంలో ఏం పొడిచారంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు సీనియర్ ఎమ్మెల్యే. 1984 లోనే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం 196 ఎకరాల స్థల సేకరణ జరిపారని, ఇప్పుడు ఆ స్థలంలోనే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉందని గుర్తు చేశారాయన.
Read Also: Chiranjeevi : చిరంజీవికి పోటీగా నవీన్ పోలిశెట్టి.. రిస్క్ చేస్తున్నాడా.?
నిన్న గాక మొన్న వచ్చిన వారికి ఏం తెలుసు చరిత్ర అంటూ ఫైరయ్యారు గోరంట్ల. రాజమండ్రి అభివృద్ధి కోసం తానము ఏం చేశానో, ఎలాంటి పథకాలు అమవలు చేశానో ఇక్కడి ప్రజలకు తెలుసునని, దాన్ని మర్చిపోయి తనను తగ్గించాలని చూసినా, అవమానపరచాలనుకున్నా.. సాధ్యం కాదు… అందుకు మీ తాత దిగిరావాలంటూ గద్దించారు బుచ్చయ్య. ఎవరేం చేశారో బహిరంగ చర్చ సిద్ధమని ఒక టీడీపీ ఎమ్మెల్యే మరో టీడీపీ ఎమ్మెల్యేకి సవాల్ విసరడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇటీవల రాజమండ్రిలో జరిగిన మినీ మహానాడు అంతా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫ్లెక్సీలు, ప్రచారంతోనే సాగింది. స్వాగత ద్వారంపై కనీసం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆందోళన చేశారు. మొత్తం మీద అధికార పార్టీకే చెందిన పక్క పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే మధ్య వివాదం, సవాళ్ళ పర్వం రాజమండ్రిలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇది ఇక్కడితో ఆగుతుందా లేక నెక్స్ట్ లెవల్కు వెళ్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.