ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ఉంటుంది. తమతోపాటు బంధుగణానికి ప్రత్యేక మర్యాదలను కోరుకుంటారు నాయకులు. గుళ్లూ.. గోపురాల్లో ఆ హంగామా మరీ ఎక్కువ. ఈ కోవలోనే ఓ మంత్రిగారి వియ్యంకుడు ఆలయానికి వెళ్లారు. అమాత్యుడికి దక్కే గౌరవమే తనకు లభిస్తుందని వియ్యంకుడు ఆశించారు. కానీ.. అలా జరగలేదు. దీంతో మినిస్టర్ పేషీనే కదిలింది. వియ్యంకుడికే అవమానమా.. అంటూ సిబ్బందిపై వేటు వేసింది. ఆ రగడేంటో లెట్స్
సిబ్బందిని అమరావతికి పిలిచి అక్షింతలు..!
సింహాచలం ఆలయంలో ఈ మధ్య భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆదివారాలు గుడి ప్రాంగణం కిటకిటలాడుతోంది. ప్రత్యేక రోజుల్లో కొండనిండా భక్తులే. సిబ్బందికి ఒత్తిడి పెరుగుతోంది. ఈ హడావిడిలో దర్శనానికి వచ్చే ప్రముఖులు సరేసరి. ప్రొటోకాల్ దర్శనాలకు డిమాండ్ ఎక్కువ. మాధవుడి సేవకంటే మానవ సేవలోనే ఉద్యోగులు తరించాల్సిన పరిస్థితి. తాజాగా సింహగిరిపై నెలకొన్న ప్రొటోకాల్ వివాదం ఇద్దరు ఉద్యోగుల పోస్టింగులకు ఎసరు పెట్టింది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అమరావతికి పిలిపించి అక్షింతలు వేయడానికి కారణమైంది. ఆ చర్యలే దేవాదాయ వర్గాల్లో చర్చగా మారాయి.
సింహాచలం దర్శనానికి వెళ్లిన మంత్రి వెల్లంపల్లి అన్నగారి వియ్యంకుడి ఫ్యామిలీ..!
మర్యాదల్లో లోటు రాకూదని మంత్రి పేషీ నుంచి మౌఖిక ఆదేశాలు..?
ఆలయ మర్యాదల్లో లోటు జరిగింది మంత్రికో.. ఎమ్మెల్యేకో.. ఉన్నతాధికారికో కాదు. మంత్రిగారి అన్నగారి వియ్యంకుడికి. అదీ ఆలయాల మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బంధువు కావడంతో అసలు రచ్చ మొదలైంది. మంత్రిగారి కుటుంబం వరకు సరే..! ఆయన అన్నలకు, వియ్యంకులకు, దూరపు బంధువులకు కూడా జీ హుజూర్ అనాలంటే ఎలా అనేది ప్రశ్న. గత శనివారం గుంటూరు జిల్లా నుంచి సుమారు 20 మంది సింహాచలం ఆలయానికి వచ్చారు. వీరంతా వస్తున్నట్టు మంత్రి వెల్లంపల్లి పేషీ నుంచి సింహాచలం ఈఓ కార్యాలయ సిబ్బందికి సమాచారం వెళ్లిందట. మర్యాదల్లో లోటు లేకుండా చూసుకోవాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారట.
భక్తుల రద్దీవల్ల క్యూలైన్ రోప్ దాటుకుని వెళ్తుండగా గందరగోళం..!
అడ్డుకున్న సింహాచలం ఆలయ ఏఈవో రాఘవకుమార్..!
క్యూలైన్ల దగ్గర ఆపడం అవమానంగా భావించిన వియ్యంకుడి ఫ్యామిలీ..!
దేవాదాయశాఖ మంత్రి బంధుగణం కావడంతో అంతే మర్యాద పాటించారట సిబ్బంది. ఐతే, శనివారం రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కొందరు క్యూలైన్ల కోసం ఏర్పాటు చేసిన రోప్లు దాటుకుని వెళ్లడం భక్తుల కంటపడింది. అదికాస్తా గందరగోళానికి దారితీయడంతో అక్కడ విధుల్లో ఉన్న ఆలయ AEO రాఘవకుమార్ దృష్టికి వెళ్లింది. క్యూ లైన్లు దాటుకుని వెళ్తున్న వారిని నియంత్రించారు AEO. అయితే వచ్చింది మంత్రిగారి బంధువులు అనే సమాచారం AEOకు చేరడం ఆలస్యమైంది. పీఆర్వో ద్వారా విషయం తెలుసుకున్న రాఘవకుమార్… వాళ్లందరినీ దగ్గరుండి చూసుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. దర్శనాలు.. తీర్థప్రసాదాలకు ఎటువంటి లోటు కలగకపోయినా తమను క్యూలైన్ల దగ్గర AEO ఆపడం అవమానంగా భావించిందట వియ్యంకుడి ఫ్యామిలీ. నేరుగా అమరావతిలో పంచాయితీ పెట్టింది. ఇక్కడే ఓవరాక్షన్ బయటపడింది.
అమరావతికి పరుగెత్తిన ఇద్దరు సిబ్బంది..!
రెండు రోజుల్లోనే ఏఈవో రాఘవకుమార్ బదిలీ..!
ఫిబ్రవరిలో రిటైర్ అవుతున్నానని ఏఈవో చెప్పినా వినలేదట..!
మంత్రిగారు వస్తే ఒకటి.. ఆయన వియ్యాలవారు వస్తే మరొకటా.. మర్యాదంటే మర్యాదే అంటూ శివాలెత్తిపోయారట వెల్లంపల్లి పేషీ సిబ్బంది. నిర్లక్ష్యానికి బాధ్యుల్ని చేస్తూ హుటాహుటిన ఇద్దరు సిబ్బందికి కబురు రావడంతో అమరావతికి పరిగెత్తారు. అక్కడికి వెళ్లాక మంత్రి బంధువులకు దగ్గరుండి దర్శనం చేయించడానికి కూడా తీరిక లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం మంత్రిగారి నోటీసుకు వెళ్లడంతో.. ఆయన చిన్న వ్యవహారం వదిలేయండని చెప్పినట్టు సమాచారం. అక్కడితో సమస్య పరిష్కారమైపోయిందని ఆ ఇద్దరు ఉద్యోగులు భావించారట. కానీ ఆ ఎపిసోడ్లో ట్విస్ట్. మంత్రిగారు వద్దన్నా ఆయన పేషీలో వ్యక్తిగత సిబ్బంది ఆ సంఘటనను సీరియస్గా తీసుకున్నారట. రెండు రోజుల్లో AEO రాఘవకుమార్ను ఆలయంలో విధుల నుంచి తప్పించారు. లీజుల విభాగంలో పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో భూ పరిరక్షణ విభాగంలో పనిచేస్తున్న ఎన్.ఆనంద్కుమార్ను నియమించారు. అమరావతి నుంచి ఆదేశాలు రావడం, వాటిని అమలు చేయడం చకచకా జరిగిపోయింది. ఫిబ్రవరిలో తాను రిటైర్ అవుతున్నానని.. జరిగిన ఘటనలో తన తప్పులేదని AEO వేడుకున్నా వినలేదట. చివరకు మంత్రిగారి వియ్యాలవారికి మర్యాదల్లో లోటు జరిగినా ఇంత రియాక్షన్ ఉంటుందా అని దేవాదాయశాఖ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయట.