Guntur YCP Politics : అది జిల్లా కేంద్రం…అక్కడ ఆ పార్టీ నేతలు కూడా ఎక్కువే…నేతల్లాగే గ్రూపు పాలిటిక్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయ్…మొదట్లో అంతా కలిసి మెలిసి ఉన్నట్లుగానే కనిపించినా అధికారం వారి మధ్య చిచ్చు పెట్టింది. ఇంకేముంది ఒకరితో ఇంకొకరికి విభేదాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఎవడిగోల వాడిదే అన్నట్లుగా మారింది గుంటూరులో వైసీపీ పరిస్థితి. ఒకరితో మాట్లాడితే మరొకరు దూరం పెడుతుండటం కార్యకర్తలకు ఇబ్బందిగా మారిందట.
గుంటూరులో వైసీపీ నేతలు ఎక్కువగా ఉండటంతో పార్టీలో గ్రూపు రాజకీయాలు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి. గుంటూరులో దాదాపు పదిమంది నేతలు కీలకంగా ఉన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచి జగన్కు జై కొట్టిన మద్దాళి గిరిధర్, మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు మేయర్ కావటి మనోహర్లు వైసీపీలో నేతలుగా చలామణి అవుతున్నారు. వీరితోపాటు ప్రత్తిపాడు ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరులోనే నివాసం. ప్రస్తుతం ఆమె గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. మరో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా గుంటూరు వైసీపీ పాలిటిక్స్ లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఐతే…వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో అంతా బాగానే ఉంది. అంతా కలిసిమెలిసినట్లు కనిపించేవారు. తర్వాత నెమ్మదిగా ఒకరి మీద మరొకరికి ఆధిపత్యపోరు మొదలైంది. గుంటూరు వైసీపీలో మొదటినుంచి అప్పిరెడ్డి కీలక నేతగా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి రావడంతో కీలకంగా మారారు. తర్వాత గుంటూరు పశ్చిమ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన మద్దాళి గిరిధర్ను వైసీపీలోకి తీసుకురావడంలో అప్పిరెడ్డి పాత్ర ఉంది. దీంతో గిరిధర్..మేయర్ మనోహర్…అప్పిరెడ్డి గ్రూపుగా చలామణి అవుతున్నారు. మద్దాళి గిరిధర్ వైసీపీలో చేరడం ఆయన మీద పోటీ చేసి ఓడిన చంద్రగిరి ఏసురత్నంకు ఇష్టంలేదని…దీంతో చంద్రగిరి ఏసురత్నం పైకి కలిసి ఉన్నా అప్పిరెడ్డి, మద్దాళి గిరిధర్తో విబేధాలు కొనసాగిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన మోదుగుల వేణుగోపాలరెడ్డికి కూడా అప్పిరెడ్డితో విబేధాలున్నాయట.
గుంటూరులో అధికారుల పోస్టింగ్ విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు కొనసాగాయట. మోదుగుల ఓ అధికారికి రికమండేషన్ చేస్తే..అప్పిరెడ్డి ఇంకో అధికారికి సిఫారసు చేశారట. ఇటీవల వైసీపీ ప్లీనరీలో మోదుగుల, అప్పిరెడ్డి చేసిన కామెంట్లు ఇద్దరి మధ్యా విబేధాలున్నాయన్న విషయాన్ని బట్టబయలు చేసింది.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాకు కూడా నియోజకవర్గంలో అసమ్మతి మొదలయ్యిందట. ముస్తఫా సామాజికవర్గానికి చెందిన షౌకత్ కూతురు సజీల కార్పొరేటర్గా గెలిచి… డిప్యూటీ మేయర్గా ఎంపికయ్యారు. దీంతో అప్పటి నుంచి ముస్తఫా షౌకత్ల మధ్య ఆధిపత్యపోరు సాగుతున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. కొద్దిరోజుల క్రితం గుంటూరు నెహ్రుగర్లో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ముస్తఫా.. సజీలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతీ కార్యక్రమంలో తనకు పోటీగా వస్తున్నావంటూ ఆమెపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను కాదని నియోజకవర్గంలో ఏమీ చెయ్యలేవని కూడా మాట్లాడినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తీరుపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మొదట్లో గుంటూరు కార్పొరేషన్లో వైసీపీ నేతలు అంతా ఒకటిగా కనిపించినా తర్వాత విభేదాలు మొదలయ్యాయట. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుకు మొదటి నుంచి మంత్రి అంబటి రాంబాబు అనుచరుడిగా ముద్ర ఉంది. దీనికితోడు మేయర్ కావటితో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుకు పొసగడం లేదని మరో ప్రచారం ఉంది. అందుకే డైమండ్బాబు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష నేతలా మాట్లాడతారని వైసీపీలో టాక్. ఇక మరో డిప్యూటీ మేయర్ షేక్ సజీల కూడా ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోదుగుల వర్గీయురాలిగా ముద్రపడ్డారు. దీంతో కార్పొరేషన్లో ఏం చెయ్యాలన్నా అధికారులు ముగ్గురు నేతల మధ్య విబేధాలతో నలిగిపోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
వాయిస్-మొత్తానికి…పైకి అంతా బాగున్నట్లే కనిపిస్తున్నా లోపల మాత్రం ఆధిపత్యంకోసం గుంటూరు వైసీపీ నేతలు గ్రూపు పాలిటిక్స్ నడిపిస్తున్నారట. మరి ఈ విబేధాలు ఎక్కడికి దారితీస్తాయో చూడాల్సిందే.