OTR: కాలం కలిసిరాకపోతే.. తాడే పామవుతుందని, పూలమ్మినచోటే కట్టెలు అమ్మాల్సి ఉంటుందని రకరకాలుగా చెబుతుంటారు. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు ఇలాంటివన్నీ కలిపి ఎన్ని చెప్పినా కూడా… పర్ఫెక్ట్గా సూటవుతాయన్నది ప్రస్తుతం ఉమ్మడి అనంత పొలిటికల్ టాక్. ఆయన ఒకప్పుడు పోలీస్ అధికారిగా కింగ్లా కనిపించారాయన. ఆ తర్వాత కాలం కలిసొచ్చి పొలిటికల్ స్టెప్స్తో లోక్సభ స్టెప్స్ ఎక్కేశారు. కట్ చేస్తే… అదే కాలం కాటేసి…గత ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ కూడా ఇవ్వని స్థితికి వెళ్ళిపోయారాయన. ఇక్కడ కాలాన్ని నిందించేకంటే… ఒళ్లూపొల్లూ తెలియకుండా వ్యవహరించి తేడా వీడియోలతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా పరువు తీసుకున్న స్వయంకృతం గురించే మాట్లాడుకోవాలని అనేవాళ్ళకు కొదవలేదు. కారణం ఏదైనా సరే…. ఫైనల్గా పొలిటికల్ డార్క్లోకి వెళ్ళిన మాజీ ఎంపీ… ప్రస్తుతం ఉనికి కోసం ఆరాటపడుతున్నారట. ఇంకా చెప్పాలంటే పోరాటమే చేస్తున్నారు. ఆ పోరాటం కాస్తా ఎప్పటికప్పుడు వికటిస్తూ…. అధికార పక్షానికి ట్రోల్ మెటీరియల్ అవుతోంది. గోరంట్ల మాధవ్ ఎస్ఐగా కెరీర్ ప్రారంభించి.. సీఐగా అనంతపురం జిల్లాలో స్థిరపడిపోయారు. సొంత ప్రాంతం కర్నూలు జిల్లా ఆయినా.. అనంతపురంలోనే ఆయన పాపులర్. సీఐగా ఉన్నప్పుడు పోలీస్ సైరన్లు మోగిస్తూ గబ్బర్ సింగ్ తరహా యాటిట్యూడ్తో కనిపించే వారు. అయితే… ఖాకీ కంటే ఖద్దరు బెటర్ అంటూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారాయన. వచ్చీ రాగానే 2019 ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ఓవైపు పోలీస్గా పాపులారిటీ, ఇంకో వైపు కులం, మరోవైపు జగన్ వేవ్…. ఇలా అన్నీ కలిసొచ్చి హిందూపురం ఎంపీగా గెలిచారు గోరంట్ల.
కానీ… ఎంపీ అయ్యాక కూడా పోలీస్ అధికారి తరహాలోనే నిత్యం అటెన్షన్ తన వైపు ఉండేలా చూసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, పనులతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారాయన. అవి శృతి మించి చివరకు గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇక పార్టీ ఓడిపోయాక.. కీలక నేతలంతా సైలెంట్ అయ్యారు. అందరితోపాటు కొన్ని రోజులు కామ్గా ఉన్న మాధవ్…. తిరిగి యాక్టివ్ అయి ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్నారు. ఆ క్రమంలో ఎక్కడ పబ్లిసిటీ వస్తుందని అనుకుంటే అక్కడికి వెళ్ళి అవసరం ఉన్నా, లేకున్నా రచ్చ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య జరిగిన వ్యవహారం, సవాళ్ల పర్వంలోకి నేనున్నానంటూ ఎంట్రీ ఇచ్చేశారు మాధవ్. ఇంటి సమీపంలోని ట్యాంక్ వద్ద రోడ్డు పై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న మాజీ ఎంపీని పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి.. స్టేషన్లో పెట్టారు. తాజాగా ఉరవకొండలో బీసీలపై దాడులు జరుగుతున్నాయంటూ… మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిరసనలకు పిలుపునిచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులతో పాటు గోరంట్ల మాధవ్ను కూడా ఆహ్వానించారాయన. పోలీసులు మాత్రం ఈ నిరసనకు అనుమతి లేదని చెప్పేశారు. కానీ…. మాధవ్ మాత్రం పోలీసుల కళ్లుగప్పి ముందే ఉరవకొండకు చేరుకున్నారు. ఓ ఇంట్లో ఉన్న మాజీ ఎంపీని పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి వాహనంలో ఎక్కించి అనంతపురం తరలించారు. ఆ తర్వాత ఆయన తాడేపల్లి వెళ్ళి మరీ… ప్రభుత్వాన్ని విమర్శించారు. గతంలో గుంటూరులో సొంత ప్రభుత్వమే ఒక టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేసినప్పుడు పోలీసుల సమక్షంలోనే అతని మీద దాడి చేయబోయి మాధవ్ కూడా అరెస్ట్ అయ్యారు.
సరిగ్గా ఇలాంటి వైఖరి గురించే ఇప్పుడు వైసీపీ వర్గాల్లో సైతం చర్చ జరుగుతోంది. పార్టీలోని మిగిలిన నాయకులంతా కాస్త నెమ్మదిగా ఉంటే.. మాధవ్ ఎందుకిలా చేస్తున్నారంటూ మాట్లాడుకుంటున్నారు. అందుకు అందరిదీ ఒకటే సమాధానం అట. ఉనికి కోసమే… అవసరం ఉన్నా లేకున్నా హంగామా చేస్తున్నారని, మంచో, చెడో మన గురించి ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటే అంత పాపులర్ అవుతామన్న సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నట్టున్నారంటూ సొంత పార్టీ నేతల నుంచే సెటైర్స్ పడుతున్నాయి. గోరంట్ల మాధవ్కు ప్రస్తుతం ఒక నియోజకవర్గం అంటూ లేదు. అందుకే ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుర్తింపు కోసం పాకులాడుతున్నారని, ఈ విన్యాసాలన్నీ అందులో భాగమేనని చెప్పుకుంటున్నారు. మంచి అనుకోండి, చెడు అనుకోండి. నేనున్నానని మాత్రం గుర్తించండి అన్నట్టుగా మాధవ్ తీరు కనిపిస్తోందన్నది పొలిటికల్ పండిట్స్ మాట. ఈ హడావిడి చూసి అయినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం తనకు ఎక్కడో ఒక చోట టిక్కెట్ ఇస్తుందన్న పాకులాట అయిఉండవచ్చని కూడా అంటున్నారు. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నా…. ప్రస్తుతానికి మాత్రం టీడీపీ సోషల్ మీడియా వింగ్కు గోరంట్ల మాధవ్ మంచి ట్రోల్ మెటీరియల్ అయ్యారన్న గుసగుసలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వినిపిస్తున్నాయి.

