పోలింగ్ జరిగిన ఆరుచోట్లా ఎమ్మెల్సీ సీట్లను టీఆర్ఎస్ కైవశం చేసుకున్నా.. ఆ జిల్లాలో మాత్రం పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఎన్నిక ఏదైనా అక్కడ వెన్నుపోట్లు తప్పదా..? భారీగా క్రాస్ ఓటింగ్కు దారితీసిన పరిస్థితులు ఏంటి?
ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ సూత్రధారి ఎవరు?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు చెందిన తాతా మధు గెలిచారు. పార్టీ శ్రేణలు సంబరాలు చేసుకున్నాయి. కానీ.. టీఆర్ఎస్ అభ్యర్థికి రావాల్సిన ఓట్లు రాలేదు. పైగా కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు ఆ పార్టీకి ఉన్న ఓట్ల కంటే ఎక్కువే పోలయ్యాయి. టీఆర్ఎస్ నుంచే క్రాస్ ఓటింగ్ జరిగింది. క్యాంపులకు తీసుకెళ్లి.. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకున్నా.. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న టీఆర్ఎస్ ఓటర్లలో కొందరు ప్రత్యర్థిపార్టీ అభ్యర్థికి ఓటేసేశారు. ఈ వెన్నుపోట్లపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని పార్టీ నేతలు చెప్పారు. అయితే ఈ క్రాస్ ఓటింగ్ వెనక సూత్రధారి ఎవరు? వెన్నుపోట్లను ప్రోత్సహించిది ఎవరు? అన్నదే ప్రశ్న.
క్రాస్ ఓటింగ్కు అధికారపార్టీ నాయకుడే కారణమా?
ఖమ్మం, కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ల పరిధిలోనే టీఆర్ఎస్ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్నది టాక్. ఈ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని గులాబీ నేతలు కూడా ఊహించలేదట. గోవా క్యాంపులు.. ఓటర్లకు తాయిలాలు ఇవ్వకపోతే ఈ మాత్రం ఓట్లు కూడా తమకు పడేవి కావని టీఆర్ఎస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. క్యాంపులు తాయిలాలే పరువు కాపాడాయని ఊపిరి పీల్చుకుంటున్నారట. అయితే క్రాస్ ఓటింగ్కు అధికారపార్టీలో ఉన్న ఓ నేత కారణమని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ నాయకుడు ఎవరన్నది పైకి చెప్పడం లేదు. ఆయన సంగతి అధిష్ఠానమే చూసుకుంటుందని మౌనం దాలుస్తున్నారట.
టీఆర్ఎస్ నుంచి భారీ క్రాస్ ఓటింగ్తో పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్..!
టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తాతా మధుకు 480 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 242 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్కు 119 ఓట్లు ఉన్నప్పటికీ వారిలో చాలా మంది టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ బలం 103కు పడిపోయింది. ఈ 103లో 30 మందికి టీఆర్ఎస్ వల వేసిందని టాక్. అందుకే కాంగ్రెస్కు 70కి మించి ఓట్లు రాబోవని అధికారపార్టీ వర్గాలు భావించాయి. కానీ.. ఫలితాలు చూశాక టీఆర్ఎస్ నేతలకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. టీఆర్ఎస్ నుంచి దాదాపు 140 మందికిపైగా క్రాస్ ఓటింగ్ చేసినట్టు గుర్తించారట. టీఆర్ఎస్ ఓటర్లపై పార్టీ నేతలే కాకుండా ఇంటెలిజెన్స్ వర్గాలు కన్నేసినా జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇదే టీఆర్ఎస్ నేతలను కలవర పెడుతోందట. దీనికంతటికీ కారణమైన నాయకుడిని పరోక్షంగా హెచ్చరిస్తున్నా..ఆ స్థాయిలో ఆయనపై చర్యలు తీసుకుంటారా అన్నది ప్రశ్న.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు ఆ నాయకుడే కారణమా?
2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కొన్నిచోట్ల ఓడిపోవడానికి క్రాస్ ఓటింగే కారణమని ఆరోపణలు ఉన్నాయి. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో పరిస్థితి చేజారిందని చర్చ జరిగింది. ఆ సమయంలోనూ ఆ నాయకుడి మీదే ఆరోపణలు వచ్చాయట. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ నేతపైనే గురిపెట్టారు. మరి.. వెన్నుపోట్లపై పార్టీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా లేక గెలిచామని సరిపెట్టుకుంటుందో చూడాలి.