సాగర్ గులాబీ శిబిరంలో కోవర్టుల గుబులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబ్బాక సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కోల్పోయిన తర్వాత వచ్చిన ఉపఎన్నిక నాగార్జునసాగర్. ఇది కూడా ఆ పార్టీకి సిట్టింగ్ స్థానమే. ఎలాంటి ఛాన్స్ తీసుకోవడానికి సిద్ధం లేదు. కాకపోతే గులాబీ శిబిరాన్ని గుబులు రేపుతున్నారు కోవర్టులు. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ ఓ టీమ్ను సిద్ధం చేసిందట. ఆ టీమ్పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
టీఆర్ఎస్లో చేరిన జానారెడ్డి అనుచరులపై ఫోకస్!
Also Read
నాగార్జునసాగర్ ఉపఎన్నికల వ్యూహాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు గులాబీ బాస్. సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించి ఫీల్డ్లోకి పంపి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి జానారెడ్డి బరిలో ఉండటం.. ఇంకోవైపు బీజేపీ కాలు దువ్వుతుండటంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అధికార పార్టీ. జానారెడ్డికి ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గంలో పట్టు ఉంది. ప్రతిఊరిలోనూ ఆయన మనుషులు ఉన్నట్టు టీఆర్ఎస్ తెలుసుకుందట. 2018 ఎన్నికల తర్వాత.. ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చాక చాలా మంది జానారెడ్డి అనుచరగణం కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిపోయింది. ఇలా కారెక్కిన వారంతా చిత్తశుద్ధితో నోముల భగత్ గెలుపుకోసం పనిచేస్తున్నారా? లేక కోవర్టులుగా పనిచేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయట. అందువల్లే అలాంటి కోవర్టులను గురించే పనిలో టీఆర్ఎస్ వేగంగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.
కోవర్టుల జాబితా సిద్ధమైంది?
అనుమానంతో పార్టీలో ఉన్న వారిని కోవర్టులుగా ముద్ర వేయలేని పరిస్థితి. తొందరపాటుతో మొదటికే మోసం రావచ్చు. అందుకే పార్టీలో ఇటీవల చేరిన వారు ఎవరు? వారిలో జానారెడ్డి అనుయాయులు ఎవరు? అన్నది రహస్యంగా తెలుసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టీమ్ పనిచేస్తున్నట్టు సమాచారం. పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులతో కోవర్టులు జతకలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీ వారీగా అసంతృప్తులు, కోవర్టులు ఎవరన్నదానిపై ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ ఆదేశాలకు అనుగుణంగా టీమ్ ఎంపిక!
కోవర్టులుగా భావిస్తున్న వారు ఎవరిని కలుస్తున్నారు? ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు? వాది కదలికలేంటి అన్న అంశాలను టీఆర్ఎస్ ప్రత్యేక టీమ్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు చెబుతున్నారు. ఈ టీమ్లో హైదరాబాద్ నుంచి సూచించిన వారే సభ్యులుగా ఉన్నారట. జిల్లా, స్థానిక టీఆర్ఎస్ నాయకులను పరిగణనలోకి తీసుకోలేదని టాక్. కోవర్టులపై నిఘా గురించి తెలిసిన అధికారపార్టీ నేతలు ఎక్కడా టంగ్ స్లిప్ కావడం లేదు. అందరి జాతకాలు పార్టీ పెద్దల దగ్గర ఉన్నాయని.. ఎన్నికల ఫలితాల తర్వాత వాటిని బయటకు తీస్తారని అనుకుంటున్నారట.
ఈ అస్త్రం ఇంకోరకంగా పార్టీకి మేలు చేస్తోందా?
ఈ అస్త్రం ఒకందుకు ప్రయోగిస్తే.. అది ఇంకో రకంగా మేలు చేస్తున్నట్టు గులాబీ శిబిరంలో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ నిర్లక్ష్యంగా ఉన్న టీఆర్ఎస్ నేతలు సైతం ఫీల్డ్లోకి వస్తున్నారట. భగత్ గెలుపుకోసం ఎండలను కూడా లెక్క చేయకుండా చెమటోడుస్తున్నట్టు సమాచారం. మరి… పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ స్పెషల్ ఆపరేషన్కు ఎంత మంది కోవర్టులు చిక్కుతారో చూడాలి.
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!