ఆ కలెక్టర్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్సా? ఆ మధ్య కేంద్రమంత్రి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక చర్చల్లోకి వచ్చారు. తాజాగా రైతుల ధర్నాపై స్పందించ లేదనే విమర్శలు ముసురుకుంటున్నాయి. ఆ కలెక్టర్ తీరు పదే పదే ఎందుకు ప్రశ్నలకు తావిస్తోంది? ఎవరా కలెక్టర్? లెట్స్ వాచ్..!
ఏడాదిన్నర క్రితం కామారెడ్డి కలెక్టర్గా రాక
జితేష్ పాటిల్. కామారెడ్డి జిల్లా కలెక్టర్. 2016 బ్యాచ్కు చెందిన ఈ IAS అధికారి ఏడాదిన్నర క్రితం కామారెడ్డి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కామరెడ్డికి వచ్చే ముందు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించారు. కలెక్టర్గా ఆయనకు తొలిపోస్ట్ ఇదే. ప్రస్తుతం కామారెడ్డి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాస్టర్ప్లాన్ సమస్యను సరిగ్గా హ్యాండిల్ చేయలేదని విమర్శలు హోరెత్తుతున్నాయి. రైతులు ఏడు గంటలపాటు ధర్నా చేస్తే.. వాళ్లను కూల్ చేయాల్సింది పోయి.. కూర్చున్న కుర్చీలోంచి కదల లేదని.. ఆయన వైఖరే అగ్నికి ఆజ్యంపోసినట్టు అయ్యిందని కొందరి వాదన.
డ్రాఫ్ట్ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం..!
జిల్లా కేంద్రంగా ఉన్న కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మాస్టర్ప్లాన్ తెరపైకి వచ్చింది. అయితే ఆ మాస్టర్ ప్లాన్ ముసాయిదా డ్రాఫ్ట్ను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కలెక్టర్ ఫెయిల్ అయ్యారనే అభిప్రాయం అధికారపార్టీ వర్గాల్లో ఉంది. ఆ ఉదాసీనతే గోటితో పోయే సమస్యను గొడ్డలి వరకు తీసుకొచ్చారని బీఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారట. రైతులు కామారెడ్డి బంద్కు పిలుపు ఇవ్వడంతో కలెక్టర్ తీరు ప్రస్తుతం చర్చగా మారింది. అనుభవ రాహిత్యమే సమస్యకు కారణం అనేవాళ్లూ ఉన్నారు. కీలక నిర్ణయాల్లో రాజకీయ వర్గాలను కలుపుకొని వెళ్లాలి. ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేయడం కూడా కీలకమే. ఈ రెండు అంశాల్లో కలెక్టర్ వ్యవహరించిన తీరే ప్రస్తుతం ప్రశ్నగా మారింది.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నలకు తడబాటు
గతంలో జిల్లాలో కేంద్ర ఆర్థికమంతి నిర్మలా సీతారామన్ పర్యటనలోనూ కలెక్టర్ జితేష్ పాటిల్ చర్చల్లోకి వచ్చారు. పీడీఎస్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత అని కేంద్రమంత్రి ప్రశ్నించడం.. ఆయన చెప్పలేకపోవడంతో అదో ఇష్యూ అయ్యింది. ఆ సందర్భంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఇప్పుడు రైతుల ఆందోళనలతో కలెక్టర్ మళ్లీ చర్చల్లోకి వచ్చారు. ఇప్పటికే ఈ సమస్యపై ప్రభుత్వ పెద్దలు.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మస్టర్ ప్లాన్ ముసాయిదా కేవలం డ్రాఫ్ట్ దశలోనే ఉందని ప్రజలకు, రైతులకు ఎందుకు నచ్చచెప్పలేదని ప్రశ్నించారు. మరి ఈ రెండు ఘటనల తర్వాత కలెక్టర్ తన తీరును మార్చుకుంటారో లేక ఎస్ నేనింతే అని అలాగే ఉండిపోతారో చూడాలి.