Off The Record : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలే వచ్చాయి.11 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ హస్తం ఖాతాలో పడ్డాయి. అదంతా ఒక ఎత్తయితే….అత్యంత కీలకమైన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం అధికార పార్టీ బోల్తా కొట్టంది. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ పార్టీ తగ్గుతూ వచ్చిన పరంపర ఈసారి కూడా కొనసాగింది. ఈసారి ఎలాగైనా కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నం చేసింది హస్తం పార్టీ. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్ పదవిని లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన వెలిచాల రాజేందర్ రావుకు అప్పగించారు. మీరేం చేస్తారో తెలియదు… కరీంనగర్ మేయర్ పీఠం మాత్రం కాంగ్రెస్కు దక్కాలని అప్పట్లో చెప్పారట సీఎం. ఇక చొప్పదండి బహిరంగ సభకు వచ్చినప్పుడు అభ్యర్థులకు దిశా నిర్దేశించారు. ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మలతో పాటు, జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్కు కార్పొరేషన్ బాధ్యత అప్పగించారు. ముగ్గురు మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జ్కు తోడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా వచ్చి ఎన్నికల టైంలో వ్యవహారాలను దగ్గరుండి చూశారు. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు. 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కేవలం 14 సీట్లకే పరిమితమై మ్యాజిక్ ఫిగర్ కి 20 సీట్ల దూరంలో ఆగిపోయింది కాంగ్రెస్. ఇక్కడ ఏ పార్టీకీ సరిపడా మెజార్టీ రాకపోవడంతో కూటమి కట్టి మేయర్ పదవి దక్కించుకునే ప్రయత్నాలు కూడా చేసింది.
బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్ల సాయంతో కరీంనగర్ కార్పొరేషన్ ని కైవసం చేసుకోవాలని వేసిన ప్లాన్ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ వల్ల బెడిసికొట్టిందని అంటున్నారు. మంత్రులు రంగంలోకి అన్ని రకాల ప్రయత్నాలు చేసి… రాజకీయ సమీకరణాలను రాత్రికి రాత్రే మార్చేసినా…. రిజల్ట్ మాత్రం రాకపోయేసరికి హస్తం శిబిరం ఆలోచనలో పడిందట. అసలు లోపం ఎక్కడ జరిగిందని ఆరా తీస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో అసలు ఈ ఫెయిల్యూర్కు పూర్తి బాధ్యులు ఎవరు? వాస్తవ కారణాలేంటో కూడా తేల్చమని డిమాండ్ చేస్తోంది కేడర్. మంత్రులు జోక్యం చేసుకున్నా…. వారి మంత్రాంగం ఎందుకు పని చేయలేదో విశ్లేషణ జరగాలని అంటున్నారట సీనియర్లు… అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానం దక్కిన కరీంనగర్ కాంగ్రెస్లో ముగ్గురు నేతలు, నాలుగు గ్రూపులు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ గ్రూప్ వార్ మధ్యనే సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ముందు ఇన్ఛార్జ్ని ప్రకటించారు. ఎన్నికల్లో తక్కువ సీట్లకు పరిమితం కావడానికి ఇది ప్రధాన కారణమట… ఇన్ఛార్జ్గా రాజేందర్రావు నియామకాన్ని జిల్లాకి చెందిన పెద్ద నేతలు పైకి వ్యతిరేకించకపోయినా లోలోపల వాళ్ళు చేయాల్సింది చేశారట…
అలాగే వెలిచాల వ్యవహార శైలి కూడా అందర్నీ కలుపుకుపోయే విధంగా లేదని పలుమార్లు సీనియర్లు గొడవ పడ్డారు… పార్టీలో చేరికల్ని ఆయన ఏకపక్షంగా ప్రోచ్సహించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఆ విధంగా అందరూ కలిసి పని చేయాల్సిన తరుణంలో గ్రూపు వార్ పార్టీకి తీరని నష్టం చేసిందట. ఈ వ్యవహారం అంతా తేడా కొడుతూఉందని తెలిసీ పెద్ద నాయకులు మిన్నకుండి పోయినట్టు తెలిసింది. దీంతో భారీ నష్టం జరిగిందని అంటున్నారు. ఎన్నికల్లో సీట్లు, టికెట్ల కోసం పట్టుబట్టిన నాయకులు ఒకరి విజయాన్ని మరొకరు అడ్డుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చెరువులో నీళ్లు వెళ్ళిపోయాక తూముల మరమ్మతులు చేసిన చందంగా… అంతా అయిపోయాక మంత్రులు రంగంలోకి దిగి అన్ని పార్టీలను కలిపి మేయర్ స్థానం దక్కించుకునేందుకు నడిపిన సినిమా పార్టీని మరింత ఇమేజ్ డ్యామేజ్ చేసిందనే టాక్ వినిపిస్తోంది… అసలు సీట్లు తక్కువ రావడానికి కారణాలు ఏంటి..? కారకులు ఎవరు..? నడిపించాల్సిన నాయకులు బాధ్యత వహిస్తారా? ఫీల్డ్ లో తిరిగిన నాయకులు రెస్పాన్సబులిటీ తీసుకుంటారా..? అనేది క్లారిటీ వస్తేనే పార్టీ ఒక్కతాటిపైకి వస్తుందని అంటున్నారు లోకల్ లీడర్స్.