కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక.. కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాల్లో ఆంటీముట్టనట్టు ఉంటున్నారట. కర్నూలు ఎంపీగా ఉన్నపుడు నిత్యం ప్రజల్లో ఉన్న బుట్టా రేణుక.. కరోనా పూర్తిగా తగ్గిపోయాక కూడా యాక్టివ్గా లేకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోందట. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. తన రాజకీయ భవిష్యత్పై ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారట బుట్టా రేణుక. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ఉన్న రేణుక.. సీటు ఖరారు చేయాలని వైసీపీ అధిష్టానాన్ని కోరారట. అయితే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వైసీపీ ఆవిర్భావం తరువాత.. సిట్టింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారని, ఆ స్థానాన్ని బుట్టా రేణుకకు ప్రకటించేందుకు వైసీపీ అధిష్టానం అంగీకరించలేదట. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ వంటి పదవిపై ఆలోచిస్తామని చెప్పారట. దీంతో రాజకీయ భవితవ్యంపై ఆలోచనలో పడ్డారని సమాచారం.
వాస్తవంగా బుట్టా రేణుక అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఏకంగా లోక్సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైసీపీలో చేరి.. కర్నూలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా.. ఎంపీగా నియోజకవర్గంలో కలియ తిరుగుతూ వైసీపీ ఎమ్మెల్యేలకు దన్నుగా నిలిచారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు నిధులు రాకపోవడంతో ఎంపీ నిధులతోనే అంతో ఇంతో పనులు చేశారనే ప్రచారం ఉంది. మూడేళ్ళ తరువాత వైసీపీ నుంచి టీడీపీకి జింప్ అయ్యారు. అయితే టీడీపీ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో.. 2019 ఎన్నికల ముందు తిరిగి వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ నుంచి బయటికి వెళ్లి రావడం ఆమెకు మైనస్ అయింది. తిరిగి వైసీపీ గూటికి చేరినా.. బుట్టా రేణుకకు ప్రాధాన్యత లభించలేదు.
గతంలో ఎన్నికల సమయంలో టికెట్ రాకపోవడంతో.. సొంతగూటికి చేరుకున్న బుట్టా రేణుక.. ఈసారి అలాంటి తప్పు చేయకూడదని అనుకున్నట్లు ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్పై..ముందుగా మేలుకోవాలనుకున్నారట. అందుకనే ఎమ్మిగనూరు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వైసీపీ పెద్దలు.. ఆ టికెట్ ఇచ్చే ఉద్దేశం లేదనే సంకేతాలు ఇవ్వడంతో.. ప్రత్యామ్నాయం చూసుకునే ఆలోచనలో ఉన్నారట. వైసీపీలో కార్యక్రమాలకు ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి ఆహ్వానం కూడా ఉండటం లేదనే అసంతృప్తి కూడా బుట్టా రెణుకలో ఉందట. ఎమ్మిగనూరులో చేనేత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. బుట్టా రేణుక ఆ సామాజికవర్గానికి చెందిన నాయకురాలు. దీంతో అక్కడి నుంచి పోటీకి పావులు కదుపుతున్నారనే ప్రచారం ఉంది. మహానాడులోనే టీడీపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై వైసీపీ అధిష్టానానికి సమాచారం ఉన్నా.. పెద్దగా దృష్టి పెట్టలేదంట. అయితే బుట్టా రేణుక మాత్రం ఆ ప్రచారంలో నిజం లేదంటున్నారట. రాజకీయాల గురించి ఆలోచించడం లేదని చెబుతున్నారట. అయితే ఇపుడు కాకపోయినా కొన్నాళ్ల తరువాత అయినా.. పచ్చ కండువా కప్పుకుంటారని కొందరు విశ్లేషిస్తున్నారు. బుట్టా రేణుక టీడీపీ జెండా పట్టుకుంటారో.. ఫ్యాన్ గాలితో సరోపెట్టుకుంటుందో వేచి చూడాలి.