తెలంగాణ BJP అనుబంధ విభాగాలు ఉన్నాయి. ఈ అనుబంధ మోర్చా లన్నింటికి కమిటీలు కూడా ఉన్నాయి. యువజన మోర్చ, మహిళా, కిసాన్, దళిత, గిరిజన, OBC, మైనార్టీ మోర్చా లు BJPకి ప్రధాన అనుబంధ విభాగాలు. అయితే… ఇందులో కొన్ని మోర్చాలు తమ పరిధిలో జరుగుతున్న వ్యవహారాన్ని అస్సలు పట్టించుకోవడం లేదట. పార్టీ చెప్పేంత వరకు కనీసం స్పందించడం లేదట. తాము ఉన్నామని చెప్పుకునేందుకు ఏదో పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలు అప్పడప్పుడు చేస్తున్నారని లోకల్ టాక్.
ప్రధానంగా T-BJPలో గిరిజన, మహిళా, కిసాన్ మోర్చల పనితీరు బాలేదట. OBC మోర్చా కార్యక్రమాలు చేస్తున్నా… చేయాల్సిన స్థాయిలో లేవన్నది హైకమాండ్ ఫీలింగ్.
ఇక మహిళా మోర్చా కూడా కార్యక్రమాలు పెద్దగా చేయడం లేదట. ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచారం ఘటన వెలుగు చూశాక మహిళా మోర్చా నాయకులు తగిన రీతిలో స్పందించలేదట. ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని… ఎవరో చెప్పే వరకూ స్పందించరా? అని బండి సంజయ్ ఫైర్ అయ్యారట. దీంతో అప్పటికప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు వెళ్లారు బీజేపీ శ్రేణులు.
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్తో పాటు… తెలంగాణలో జరుగుతున్న ఘటనలపై పోరాటం చేయాలని మహిళా మోర్చాకు చెప్పినా… వాళ్లు స్పందించినట్టు కనిపించడం లేదు. డ్రగ్స్, పబ్ కల్చర్కి వ్యతిరేకంగా… ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయాలని… ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని, అబ్కారీ శాఖ కార్యాలయానికి తాళం వేయాలని కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేశారు. కానీ పోలీసులకు తెలియడంతో ఎక్సైజ్ కార్యాలయం ముందు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. అయితే… మహిళా మోర్చ సభ్యులు వచ్చిందీ లేదు… ఆందోళన చేసిందీ లేదు. కార్యక్రమం కోసం సిద్ధం చేసిన దిష్టిబొమ్మ కూడా పార్టీ కార్యాలయంలోనే ఓ మూల వెక్కిరిస్తూ ఉందట. ఇవన్నీ చూసి బండి సజయ్ కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్టు సమాచారం.
పార్టీలో పదవులు తీసుకోవడం ముఖ్యం కాదని… బాధ్యతగా వ్యవహరించాలన్నది కార్యకర్తల మాట. పని చేసేవారికి బాధ్యతలు ఇస్తే మంచిదన్నది వాళ్ల అభిప్రాయం.