తండ్రి పెద్ద పదవిలో ఉంటే.. మామ కూడా రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే టైమ్ అనుకున్నారో ఏమో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట ఆ యువ మహిళా నేత. నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నట్టు కాషాయ శిబిరంలో టాక్. ఇంతకీ ఎవరా మహిళా నేత?
రాజకీయంగా బండారు విజయలక్ష్మి యాక్టివ్ రోల్..!
తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతల వారసులు క్రమంగా తెరపైకి వస్తున్నారా? హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆ జాబితాలో ఉన్నారా? దత్తాత్రేయ ఇంటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ వారసులు ఎవరూ లేరు. ఇప్పుడు విజయలక్ష్మి కొన్ని అంశాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో ఆమెను వారసురాలిగా ప్రమోట్ చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది. ఏటా దసరాకు దత్తాత్రేయ నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమం పెద్ద ఫేమస్. గత ఏడాది కరోనా వల్ల నిర్వహించలేకపోయినా.. ఈ ఏడాది జలవిహార్లో అలాయ్ బలాయ్కి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ అంతా దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మే చూస్తున్నారు. ఆహ్వానాలు మొదలుకొని.. ఏర్పాట్లు మొత్తం విజయలక్ష్మి చెప్పినట్టే జరుగుతున్నాయట.
బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు..!
ఒక్క అలాయ్ బలాయే కాకుండా.. బీజేపీ కార్యక్రమాల్లోనూ విజయలక్ష్మి పాత్ర పెరుగుతోంది. పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్రలోనూ సందడి చేశారు. ఏదో ఇలా వచ్చి అలా వెళ్లిపోకుండా.. పాదయాత్రలో ఎక్కువ రోజులు పార్టిసిపేట్ చేశారు విజయలక్ష్మి. ఇవన్నీ చూసిన కమలనాథులు.. దత్తాత్రేయ కుమార్తె రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని అనుకుంటున్నట్టు భావిస్తున్నారు.
చేవెళ్ల ఎంపీ టికెట్ అడుగుతారని ప్రచారం..!
అసెంబ్లీకి అయితే జూబ్లీహిల్స్ టికెట్ అడుగుతారా?
ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టికెట్ కోరితే మాత్రం.. విజయలక్ష్మి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది ప్రశ్న. గతంలో దత్తాత్రేయ ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ ఖాళీ లేదు. అక్కడ గెలిచిన కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక విజయలక్ష్మి మామ జనార్దన్రెడ్డి కూడా బీజేపీలో ఉన్నారు. ఆయన గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఒకవేళ లోక్సభకు పోటీ చేయాలని విజయలక్ష్మి భావిస్తే.. చేవెళ్లను ఎంపిక చేసుకోవచ్చునని.. దీనికి మామ జనార్దన్రెడ్డి నుంచి పెద్దగా అభ్యంతరం వ్యక్తం కాదని పార్టీ నేతలు అనుకుంటున్నారట. కోడలికి బీజేపీ టికెట్ ఇస్తే జనార్దన్రెడ్డి కాదనలేరని ఒక వాదన. కాదూ.. అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకుంటే మాత్రం.. జూబ్లీహిల్స్ టికెట్ అడగొచ్చని టాక్. మరి.. దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆలోచన ఏంటో చూడాలి.