OTR : అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన నివాస సముదాయం పూర్తిగా సిద్ధమైంది. ఇక కేటాయించడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గృహప్రవేశాలు చేయడమే మిగిలి ఉంది. సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్స్, క్లబ్హౌస్, గ్రీన్ కవర్ లాంటి మౌలిక వసతులు, అధునాతన భద్రతా ప్రమాణాలతో క్వార్టర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 24న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తాళాల అప్పగింత కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది.. అర్హత ఉన్న ప్రజాప్రతినిధులకు నిబంధనల ప్రకారం కేటాయింపులు జరపడానికి సాధారణ పరిపాలనా శాఖ కసరత్తు చేస్తోందట. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కూటమి ప్రజాప్రతినిధులకు ఇప్పటికే సమాచారం అందినట్టు తెలుస్తోంది. కానీ… మాకు మాత్రం ఇప్పటిదాకా… ఎలాంటి ఇన్ఫర్మేషనూ, కన్ఫర్మేషనూ లేవని చెబుతున్నారు ప్రతిపక్షం వైసీపీ ప్రజాప్రతినిధులు. ఇదే ఇప్పుడు పొలిటికల్ హాట్ అవుతోంది. ఇప్పటికే అమరావతి మీద, నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ మీద కూడా వైసీపీ సీనియర్ లీడర్స్ కొందరు నెగెటివ్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి ఒకరైతే… నేరుగా అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అవుతాయంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్వార్టర్స్ తీసుకుంటారా అన్న చర్చలు మొదలయ్యాయి. కొందరు చనువున్న వాళ్ళు అదే మాట వాళ్ళని అడిగితే…. ముందు ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తే కదా…. అసలు తీసుకోవాలా.. వద్దా.. అని ఆలోచించేదని అంటున్నారట. పార్టీ అధినేత జగన్తో చర్చించిన తర్వాతే మేం తుది నిర్ణయం తీసుకుంటామని కొందరు అంటున్నట్టు తెలిసింది. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో మరో ఆసక్తికరమైన కోణం ఉంది. మేం ఎక్కడా అమరావతిని నేరుగా వ్యతిరేకించలేదు, ఆ పేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకమని వైసీపీ లీడర్స్ చెబుతున్నట్టు తెలిసింది. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు జరగడంపై అభ్యంతరాలు లేవని, అందులో జరిగే అవినీతి, అక్రమాలపైనే తమ పోరాటమని చెబుతోంది విపక్షం. దీని ఆధారంగానే సరికొత్త డిస్కషన్స్ మొదలయ్యాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వైసీపీ ప్రజాప్రతినిధులకు ఇళ్లు కేటాయిస్తే.. అది ప్రభుత్వ ప్రాజెక్టు కాబట్టి వద్దనే పరిస్థితి ఉంటుందా.. లేక.. ఇది ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం కల్పిస్తున్న అధికారిక వసతి సదుపాయం కాబట్టి తీసుకుంటారా అంటూ రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి ఏపీ రాజకీయ వర్గాల్లో. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. క్వార్టర్స్ తీసుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటి వరకు వస్తున్న దాదాపు 50 వేల రూపాయల హెచ్ఆర్ఏకు కోత పడుతుంది. ఆ విషయంలో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేల హాజరు అంశం ఇక్కడున్న ఇంకో యాంగిల్. ఆ పార్టీ ఎమ్మెల్సీలు మండలి సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ… ఎమ్మెల్యేలు మాత్రం సభకు దూరంగా ఉంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా విషమై ప్రభుత్వం, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సభకు హాజరవకుండా జీతాలు, ఇతర ప్రయోజనాలు ఎలా పొందుతారంటూ అధికార పక్షం ప్రశ్నిస్తోంది.. స్పీకర్ వైపు నుంచి ప్రతీ సెషన్ ప్రారంభానికి ముందు అనర్హత వేటు హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఈ పంచాయితీకి ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ అనే కొత్త అంశం చేరింది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రతిపాదన వస్తే… వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ క్వార్టర్స్కు ఓకే చెబితే…..వాళ్ళు నివాసం ఉన్నా లేకున్నా… అమరావతిలో ప్రభుత్వం కల్పించిన అధికారిక వసతులను వైసీపీ సభ్యులు అంగీకరించినట్టే అవుతుంది. వద్దని రిజెక్ట్ చేస్తే… అందుకు ఆ పార్టీ బలమైన కారణమే చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు ఫ్లాట్ల కేటాయింపు ప్రతిపాదన ఏదీ తమ వరకూ రాలేదని.. ఒకవేళ అలాంటి ప్రతిపాదన చేస్తే తమ పార్టీ అధినేత జగన్ తో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు వైసీపీ లీడర్స్. దీంతో ఆగస్టు 24న ఏం జరగబోతోందంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అవినీతి పేరుతో తాము వ్యతిరేకించిన అదే అమరావతిలో ప్రజాప్రతినిధుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలోకి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడుగు పెడతారా.. లేక.. ప్రభుత్వం ఇల్లు ఇచ్చినా వద్దంటారా.. అన్నది హాట్ టాపిక్ అయింది.

