ఇది ఒక ప్రతిపక్ష నేత చేసిన విమర్శ కాదు. ఇది అంతర్జాతీయ మీడియా రాసిన విశ్లేషణ కూడా కాదు. ఒక దేశ ప్రధాని స్వయంగా మాట్లాడిన మాట ఇది. మేం ప్రపంచం చుట్టూ తిరుగుతూ అప్పులు అడుగుతున్నప్పుడు మా తలలు సిగ్గుతో వంగిపోతున్నాయంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అణుశక్తి ఉందని గొప్పలు చెప్పుకునే దేశం, కోట్లాది జనాభా ఉన్న దేశం, ఒకప్పుడు ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నమని గొప్పలు పోయిన దేశం.. ఈరోజు తన ఆర్థిక అసహాయతను బహిరంగంగా అంగీకరించింది. విదేశీ నిల్వలు పెరిగాయన్న మాటలు వినిపిస్తున్నా, ఆ వెనుక ఉన్న నిజం మాత్రం వేరే. అవి సంపాదించిన డబ్బులు కాదు. తీసుకున్న అప్పులే.
ఇంతకీ పాకిస్థాన్ ఈ స్థితికి ఎలా వచ్చింది? ప్రతి కొన్ని నెలలకు IMF తలుపు తట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది?
పాకిస్థాన్ ఈ స్థితికి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. ఇది దశాబ్దాలుగా పేరుకుపోయిన ఆర్థిక వైఫల్యాల ఫలితం. పన్నుల వసూలు బలహీనంగా ఉండటం, ప్రభుత్వ ఖర్చులు నియంత్రణ లేకుండా పెరగడం, ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను క్రమంగా ఖాళీ చేసింది.
దేశ జీడీపీలో పన్నుల వాటా 10శాతం కూడా దాటని పరిస్థితి ఉండగా, ప్రభుత్వాన్ని నడిపించడానికి అప్పులే ప్రధాన ఆధారంగా మారాయి. దీనికి తోడు సైనిక ఖర్చులు పాకిస్థాన్ బడ్జెట్లో భారీ భాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి ఎంత క్షీణించినా, రక్షణ ఖర్చులపై కోత వేయడానికి రాజకీయ నాయకత్వానికి ధైర్యం లేదు. సైన్యం దేశ ఆర్థిక విధానాల్లోనూ ప్రత్యక్షంగా ప్రభావం చూపుతూ వచ్చింది. దీనికారణంగా విద్య, ఆరోగ్యం, పరిశ్రమల లాంటి రంగాలకు పెట్టుబడులు తగ్గిపోయాయి. ఉద్యోగాలు సృష్టించాల్సిన చోట అప్పుల భారమే పెరిగింది.
ఇక IMF కథ మరింత లోతైనది. 1958 నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్ దాదాపు 25 సార్లు IMF సహాయాన్ని ఆశ్రయించింది. ప్రతి సారి అదే కథ. అప్పులు తీసుకోవడం, కఠినమైన షరతులు అమలు చేయడం, కొద్ది కాలానికి మళ్లీ సంక్షోభంలో పడటం.
ప్రస్తుతం కూడా పాకిస్థాన్కు వచ్చిన తాజా నిధులు అభివృద్ధి కోసం కాదు. పాత అప్పులు తీర్చడానికి, విదేశీ నిల్వలు కాగితాల మీద మెరుగ్గా కనిపించడానికి మాత్రమే. షెహబాజ్ షరీఫ్ చెప్పినట్టు నిల్వలు దాదాపు రెట్టింపు అయినా, అవి IMF అప్పులు, స్నేహ దేశాల డిపాజిట్లే. ఈ అప్పులకు భారీ మూల్యాన్ని అక్కడి ప్రజలు చెల్లిస్తున్నారు. విద్యుత్ ధరలు పెరుగుతున్నాయి. ఇంధన సబ్సిడీలు తగ్గాయి. పన్నుల భారాన్ని సామాన్య ప్రజల మీదే మోస్తున్నారు. ద్రవ్యోల్బణం కొద్ది నెలలుగా తగ్గినట్టు కనిపించినా, జీవన వ్యయం మాత్రం ఇంకా సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిరుద్యోగం, పేదరికం తగ్గడంపై స్పష్టమైన ప్రణాళికలు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే షెహబాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారతీశాయి.
ఒక దేశ ప్రధాని తానే సిగ్గుతో తల వంచాల్సి వస్తోందని చెప్పడం, ఆ దేశ ఆర్థిక స్వాభిమానానికి అద్దం పట్టే మాట. ఇక ముందు పాకిస్థాన్ ముందున్న మార్గం అంత ఈజీ కాదు. అప్పుల మీద అప్పులు తీసుకుంటూ నిలబడటం ఒక స్థిరమైన పరిష్కారం కాదు. ఉత్పత్తి పెంచకుండా, ఎగుమతులు బలోపేతం చేయకుండా, సైనిక ప్రాధాన్యతలను తగ్గించకుండా, పౌర ఆర్థిక వ్యవస్థకు శక్తినివ్వకుండా ఈ సంక్షోభం నుంచి బయటపడటం కష్టం. షెహబాజ్ మాటల్లో కనిపించిన సిగ్గు నిజంగా మార్పుకు దారి తీస్తుందా? లేదా ఇది కూడా మరో IMF చక్రంలో కలిసిపోతుందా అన్నదే ఇప్పుడు పాకిస్థాన్ భవిష్యత్తును నిర్ణయించే అసలైన ప్రశ్న.
ALSO READ: ‘ఇండియా అసలు దేశమే కాదు..’ హైకోర్టులో మార్మోగిన బ్రిటీష్ పాలకుడి మాటలు!