సినామా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తెచ్చిపెడుతూ… జనాల పర్సనల్ డేటా చోరీ చేస్తూ.. దేశ భద్రతకే ముప్పుగా మారిన ఇమంది రవి ఆటకట్టించారు సీపీ సజ్జనార్. ఏళ్ల తరబడి రవి సృష్టించుకున్న పైరసీ రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించారు. ఇప్పటికే ఐ బొమ్మ. బప్పం టీవీ, ఇరాదా వంటి సైట్లను క్లోజ్ చేసిన పోలీసులు… పైరసీ కంటెంట్ ఉన్న మిగతా వెబ్సైట్లపై యాక్షన్కు సిద్దమవుతున్నారు. ఇమంది రవిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లపై నిఘా పెట్టిన పోలీసులకు… ఐ బొమ్మ, బప్పం టీవీ లీడ్ దొరికింది. ఈ దిశగా దర్యాప్తు చేస్తే.. ఇమంది రవి నెట్వర్క్ను గుర్తించగలిగారు. ఐ బొమ్మ పైరసీ దర్యాప్తులో రవి చెప్పిన మాటలకు పోలీసులు షాక్ అయ్యారు. రవి హార్డ్ డిస్కులో 21 వేల సినిమాలు ఉన్నాయి. రవి దగ్గర టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు.. ఇంకా ఇతర భాషా సినిమాలు కూడా వున్నాయి. ఇమంది రవికి ఆదాయం పైరసీ సినిమాల వల్లే కాదు…బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోందని పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా వన్ ఎక్స్ బెట్టింగ్ యాప్ కి ఐ బొమ్మ, బప్పం టీవీ ద్వారా ప్రమోషన్ చేసినట్లు గుర్తించారు. తన వెబ్సైట్ వీక్షకులు, సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటున్న వారి పర్సనల్ డేలా చోరీ చేసి డార్క్ వెబ్లకు అమ్ముతున్నట్లు కూడా గుర్తించారు. ఇదే మరింతగా ఆందోళన కలిగించే విషయం. జనాల డేటాను ఏం చేశాడు? ఎవరికి అమ్ముకున్నాడు? వారు ఆ డేటాతో ఏం చేశారన్నదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఫ్రీగా కొత్త సినిమాలు చూస్తున్నాం అని జనాలు అనుకుంటున్నారు కానీ.. మీ డేటా చోరీ చేసి..ప్రమాదంలోకి నెడుతున్నాడని, సినిమా ఇండస్ట్రీ కంటే ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారని గుర్తుంచుకోవాలంటున్నారు పోలీసులు.
Also Read :iBomma: పైరసీ నష్టం సరే.. మరి సినీ పెద్దల దోపిడీ సంగతేంటి?
నిజానికి పైరసీగాళ్లు అను నిత్యం పట్టుబడుతున్నారు. కొన్ని సైట్లు మూతపడుతున్నాయి. కానీ కొన్నాళ్ల తర్వాత మరో పేరుతో సైట్లు పెట్టేస్తున్నారు. జనాలు కూడా పైరసీ సినిమాలను ఎగబడి చూస్తున్నారు. అంటే పైరసీని అరికట్టడం ఐబొమ్మ రవిని పట్టుకున్నంత ఈజీ కాదు. అతను హైదరాబాద్ వచ్చాడు కాబట్టి..పోలీసులు పట్టుకోగలిగారు. కరీబియన్ దీవుల్లోనే వుండివుంటే…అతను పట్టుబడేవాడా అంటే ఖచ్చితంగా కాదు. ఇప్పుడతన్ని పట్టుకున్నా, అతను కాకపోతే మరొకడు, మరో దేశం నుంచి దర్జాగా కొత్త పైరేటెడ్ సినిమాలను అప్లోడ్ చేస్తుంటాడు. ఇక్కడ పరిష్కారం కంటికి కనపడని పైరసీ కేటుగాళ్లను పట్టుకోవడం కాదు….పైరసీ వైపు చూడకుండా స్వచ్చందంగా జనాలు థియేటర్కు వచ్చేలా చెయ్యడం. ఆకాశాన్నంటుతున్న సినిమా టికెట్లు, క్యాంటీన్ ఫీజులతో సామాన్య ప్రేక్షకులు టాకీస్కు వచ్చే పరిస్థితి వుందా?
నిజానికి ఐ బొమ్మ రవిని పట్టుకోగానే సినీ పెద్దలంతా పండగ చేసుకుంటున్నారు. తమ కష్టాన్ని దోచుకుంటున్నవాన్ని అరెస్టు చేసినందుకు పోలీసులకు శతకోటి ధన్యవాదాలంటున్నారు. కానీ కామన్ ఆడియన్స్ మాత్రం రవిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని అతను రాబిన్ హుడ్ అని సోషల్ మీడియాలో లేపుతున్నారు. రవి ఇండస్ట్రీని దోచుకున్నాడు సరే మరి బెనిటిఫిట్ షోల పేరుతో ప్రేక్షకులను దోచుకుంటున్నది ఎవరనే ప్రశ్న సగటు జనాల నుంచి దూసుకొస్తోంది. సినిమా థియేటర్ వైపు రాకుండా, రేట్లతో భయపెడుతున్నది ఎవరు? పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు….సినీ పెద్దల హడావుడి అంతా ఇంతకాదు. పాలకుల చుట్టూ ప్రదక్షిణలు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వాలని వేడుకోలు, చివరికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని….అమాంతం రేట్లు పెంచేసుకుంటారు. ఒక్కో టికెట్ రేట్ను ఓ రేంజ్లో పెంచేస్తారు. మరి బెనిఫిట్ షోల పేరుతో వసులూ చేస్తున్న డబ్బులు ఎవరి బెనిఫిట్ కోసం…? జనాల అభిమానాన్ని టికెట్ల రూపంలో ఇంతగా దోచుకోవాలా? పైరసీ దోపిడీ అయినప్పడు ఇది కూడా దోపిడీ కాదా అని జనం ప్రశ్నిస్తున్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు బీభత్సమైన హైప్ క్రియేట్ చేసి మొదటి రెండ్రోజులు అడ్డంగా దోచుకోవడం దోపిడీ కాదా అని క్వశ్చన్స్ చేస్తున్నారు.
Also Read :Tollywood : హ్యాట్రిక్ ప్లాపులు… అయినా సరే వరుస సినిమాలు చేస్తున్న ఇద్దరు యుంగ్ బ్యూటీస్
బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల పేరుతో సినీ నిర్మాతలు జనాల జేబులకు చిల్లు పెడుతుంటే మల్టీప్లెక్స్ యాజమాన్యాల క్యాంటీన్ దోపిడీ మరో ఎత్తు. వాటర్ బాటిల్ రెండొందలలు, కూల్డ్రింక్స్ మూడొందలు అంటారు. పాప్కార్న్ కాంబో నాలుగొందలు తక్కువ వుండదు. ఒక్కోసారి టికెట్ రేట్ల కన్నా…పాప్ కార్న్ ధరలే అధికంగా వుంటాయి. అటు టికెట్ రేట్ల పెంపు, ఇటు క్యాంటీన్ ధరలతో మధ్యలో దోపిడీకి గురవుతున్నది సగటు ప్రేక్షకుడే. ఫ్యామిలీతో కలిసి వీకెండ్లో థియేటర్కు వెళితే ఈజీగా 10 వేలు గంగార్పణం. పోనీ అంత ఖర్చు పెట్టినా మంచి ఎక్స్ పీరియన్స్ ఉంటుందా అంటే అది గాల్లో దీపమే. థియేటర్లలో విక్రయించే కొన్ని తినుబండారాలపై ప్రత్యేక ఎమ్మార్పీలుంటాయి. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఎమ్మార్పీకే విక్రయిస్తున్నాం అని క్యాంటీన్ల నిర్వాహకులు దబా యిస్తుంటారు. థియేటర్లలో ధరలు భరించలేని వారెవరైనా బయట నుంచి తినుబండారాలను తీసుకెళ్లడానికి అనుమతించరు. కనీసం మంచి నీళ్ల బాటిల్ను కూడా తీసుకెళ్లనీయరు. గేటు బయటే అలాంటి వాటిని తిరస్కరిస్తారు. విధి లేని పరిస్థితుల్లో ప్రేక్షకులు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. అటు నిర్మాతలు, ఇటు థియేటర్ల యాజమాన్యాలు జనాలను నిలువునా దోచేస్తున్నాయి.
సినిమాకు వెళితే రేట్ల సినిమా తప్పదని ఓటీటీ వరకు వేచిచూద్దామని చాలామంది అనుకుంటారు. కానీ ఓటీటీ ఫ్లాట్ఫామ్ల దోపిడీ నెక్ట్స్ లెవల్. సబ్స్క్రిప్షన్ ప్లాన్లు భారీగా పెంచేశాయి. కొన్ని చిత్రాలైతే ఓన్లీ ఏదో ఒక ఓటీటీలోనే ఎక్స్క్లూజివ్గా రిలీజ్ అవుతుంది. అంటే సినిమా బాగుందన్న టాక్ వస్తే….సచ్చినట్టుగా డబ్బులు కట్టాల్సిందే. ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ కూడా భారీగా దండుకుంటున్నాయి. ఇదీ పైరసీ కేటుగాళ్లు మధ్యతరగతి జనాల ఇలాంటి ఇబ్బందులను క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా ఎడాపెడా అందరూ సినీ ప్రేక్షకులను దోచుకుంటున్నారు. పైరసీతో తమ కష్టాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్న సినీ పెద్దలు…తమ దోపిడీ గురించి మాత్రం మాట్లాడరు.
జనాలను పైరసీకి ఆశ్రయించేలా చేసిందే కొందరు బడా దర్శకులు, నిర్మాతలు, హీరోలు. తమ సూపర్ డూపర్ గా వుంటుందని ఏవేవో ప్రచారాలు సృష్టించి, థియేటర్కు పిలిచి జేబులు కొల్లగొడుతున్నారు. సినిమా టికెట్ ఎందుకు పెంచుతున్నారంటే…భారీగా ఖర్చయ్యింది..ఎందుకు ఖర్చయిందంటే హీరోల రెమ్యూనరేషన్ ఎక్కువ…హీరోయిన్లు వారి వెంట వచ్చే వారి ఫైవ్ స్టార్ హోటళ్ల ఖర్చెక్కువ….దర్శకుల పారితోషికమూ ఎక్కువేనంటారు. అందుకే ఇంత రేట్ పెంచేశామంటారు. ఇంతరేటు పెట్టి కొనలేనివారు పైరసి చూస్తే….అయ్యో తమ కష్టం నీరుగారిపోయిందని లబోదిబోమంటారు. ప్రేక్షకున్ని థియేటర్కు రప్పించడానికి టికెట్ రేట్లు మాత్రం తగ్గించరు.
పైరసీ ముమ్మాటికి తప్పే. ఐ-బొమ్మ రవిలాంటివారు చేసింది నేరమే. మరి సినీ పెద్దలు చేస్తున్నదేంటి? బెనిఫిట్ షోలు, క్యాంటీన్ రేట్లు ఎందుకంతగా పెంచేస్తున్నారని సగటు ప్రేక్షకుడు ప్రశ్నిస్తున్నాడు. ఐబొమ్మ రవితోనే పైరసీ ఆగిపోదు. కొత్తకొత్త కేటుగాళ్లు వస్తూనే వుంటారు. దీనికి పరిష్కారం టికెట్ రేట్లు, క్యాంటీన్ ధరలు సామాన్యులకూ అందుబాటులోకి తేవడమేంటున్నారు ప్రేక్షకులు.