Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చట్టం ఒక ఆయుధం. కానీ అది ఆత్మరక్షణకు వాడాల్సిన కవచమా? లేక అహాన్ని తృప్తి పరుచుకోవడానికి ప్రయోగించే బ్రహ్మాస్త్రమా? ఈ రోజుల్లో వివాహ బంధాలు ఎంత వేగంగా మూడు ముళ్లతో ముడిపడుతున్నాయో.. అంతకంటే వేగంగా కోర్టు మెట్లపై ముక్కలవుతున్నాయి. అహాలు, పట్టింపులు, తప్పుడు కేసులు, లీగల్ నోటీసులు.. లాంటివన్నీ కలిసి పవిత్రమైన బంధం కాస్తా పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టు వాయిదాల చుట్టూ నలిగిపోతోంది. కానీ, చట్టాల కంటే, కోర్టుల కంటే, సమాజం నిర్దేశించిన నిబంధనల కంటే.. మనుషుల మధ్య ఉండే కరుణ ఎంత బలమైనదో నిరూపించింది ఢిల్లీలో జరిగిన ఒక సంచలన సంఘటన.
బ్లాక్మెయిలింగ్ అస్త్రంగా సెక్షన్లు:
భారతీయ సంస్కృతిలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు.. రెండు కుటుంబాల ప్రయాణం. కానీ, మారుతున్న సామాజిక పోకడలు, పెరిగిపోతున్న వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్థిక స్వాలంబనతో పాటు ‘నేను’ అనే అహంకారం ఈ బంధాల పునాదులను కదిలిస్తోంది. ఒకప్పుడు కుటుంబ పెద్దల సమక్షంలో సర్దుబాట్లతో ముగిసిపోయే చిన్నపాటి గొడవలు.. నేడు నేరుగా న్యాయస్థానాల గడప తొక్కుతున్నాయి. మహిళల రక్షణ కోసం, వరకట్న వేధింపుల నుంచి వారిని కాపాడటం కోసం సెక్షన్ 498A వంటి చట్టాలు వస్తే.. దురదృష్టవశాత్తూ వాటిని కొందరు భార్యలు భర్తలపై, వారి కుటుంబాలపై కక్ష సాధింపు చర్యలుగా, ఒక బ్లాక్మెయిలింగ్ అస్త్రంగా వాడుతున్నారనే విమర్శలు నేడు భారీగా వినిపిస్తున్నాయి.
Also Read
- Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్... డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త "మైండ్ గేమ్"!
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
- Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
- Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఢిల్లీలో ఏం జరిగింది?
ఢిల్లీకి చెందిన శిఖ, సౌరభ్ల కథ కూడా సరిగ్గా ఇలాంటి ఒక అహంకార పోరాటంతోనే మొదలైంది. 2020లో శిఖ, సౌరభ్ల వివాహం ఎన్నో ఆశల మధ్య వైభవంగా జరిగింది. కానీ, పెళ్లయిన కొద్దిరోజులకే వారి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే సహనం లోపించింది. ఈ క్రమంలో శిఖ.. భర్తపై, అతని కుటుంబంపై కోర్టులో వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. ఆ క్షణం నుంచి ఆ కుటుంబంలో ప్రశాంతత కరువైంది. ఏ తప్పు చేయని భర్త, అతని తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఏళ్ల తరబడి విచారణలు సాగాయి కానీ, అటు శిఖ అహం తగ్గలేదు.. ఇటు సౌరభ్ వైపు నుంచి సయోధ్య కుదరలేదు.
న్యాయపోరాటాలు ఎప్పుడూ ఇరువైపులా విధ్వంసాన్నే మిగులుస్తాయి. కూతురి పెళ్లి పేరిట కోర్టుల చుట్టూ తిరగడం, లాయర్ల ఫీజులు భరించడం, సమాజంలో తలెత్తుకోలేకపోవడం శిఖ తండ్రిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. కూతురి భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆందోళన, నిరంతర ఒత్తిడి ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపజేశాయి. ఒకరోజు ఆ భారం తట్టుకోలేక ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అత్యవసర స్థితిలో ఆయనను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల, సరైన వైద్య సదుపాయాలు అందక ఆయన అక్కడ మరణంతో పోరాడుతున్నారు. కూతురు పెట్టిన కేసు.. చివరికి కన్నతండ్రి ప్రాణాలకే ముప్పుగా పరిణమించిన దారుణ పరిస్థితి అది.
కథ ఇక్కడే ఒక ఊహించని, ఉద్వేగభరితమైన మలుపు తిరిగింది. తనను, తన కుటుంబాన్ని కోర్టుల చుట్టూ తిప్పి నరకం చూపించిన భార్య తండ్రి చావుబతుకుల్లో ఉన్నాడనే వార్త భర్త సౌరభ్కు తెలిసింది. సాధారణంగా అయితే కక్ష సాధింపులు, కేసు వ్యవహారాలు.. వాళ్ల మధ్య దూరాన్ని పెంచుతాయి. కానీ, సౌరభ్ తనలోని మానవత్వాన్ని చంపుకోలేదు. అహాన్ని పక్కన పెట్టాడు. తక్షణమే స్పందించి, ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రి నుండి దేశంలోనే అత్యుత్తమమైన కార్పొరేట్ హాస్పిటల్ ‘మెదాంత’కు తరలించాడు. తన సొంత డబ్బు ఖర్చు పెట్టి, దగ్గరుండి పర్యవేక్షించి, ఒక కన్నకొడుకులా నిలబడి ఆ ముసలి ప్రాణాన్ని కాపాడాడు.
ఆ తర్వాత కొద్దిరోజులకే కోర్టులో తదుపరి విచారణ వాయిదా వచ్చింది. జడ్జి బెంచ్ మీదకు వచ్చారు. లాయర్లు తమ వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు. విడాకుల పత్రాలు టేబుల్ మీద ఉన్నాయి. కానీ, అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తూ శిఖ ముందడుగు వేసింది. లాయర్ చేతిలోని విడాకుల పత్రాలను లాక్కుని, జడ్జి ముందే వాటిని ముక్కలు ముక్కలుగా చింపేసింది! కన్నీళ్లతో భర్త సౌరభ్ కాళ్లపై పడింది. ఏ చట్టాలు, ఏ లాయర్లు, ఏళ్ల తరబడి సాగిన కోర్టు వాదనలు మార్చలేని ఆమె కఠిన హృదయాన్ని.. భర్త చూపిన ఆ ఒక్క మానవత్వం, నిష్కల్మషమైన కరుణ పూర్తిగా మార్చేసింది. తప్పుడు కేసుల కంటే, ఈగోల కంటే బంధం గొప్పదని గ్రహించిన ఆమె.. భర్తతో కలిసి జీవించడానికి సిద్ధమైంది.
ఈ విడాకుల ఉదంతం నేటి ఆధునిక సమాజానికి, ముఖ్యంగా వైవాహిక బంధాల్లో ఉన్నవారికి ఒక పవర్ఫుల్ అద్దం పడుతోంది. కోర్టులు, కాగితాలు బంధాలను విడదీయగలవేమో కానీ, మనసులను కలపలేవు. ఒక రిలేషన్షిప్ నిలబడాల్సింది ఈగోతో కాదు.. క్షమించే గుణంతో, మానవత్వంతో, పరస్పర అవగాహనతో మాత్రమే. సమస్యలు వచ్చినప్పుడు కోర్టు మెట్లు ఎక్కడం కంటే.. ఒకరినొకరు అర్థం చేసుకుని మాట్లాడితే, కరుణతో ఆలోచిస్తే.. సమాజంలో విడాకులు అనే పదానికి తావే ఉండదు.
: CLN RAJU (EDITOR- NTV DIGITAL)
తాజావార్తలు
-
IMD Alert: ఎర్రకోట వేడుకలకు వరుణుడు అడ్డంకి.. ఐఎండీ హెచ్చరిక
-
Ajit Doval: “మా సహనాన్ని బలహీనతగా భావించొద్దు”.. అజిత్ దోవల్ మాస్ వార్నింగ్..
-
Indian Bowler: బుమ్రా లేని లోటు.. సిరాజ్తో కలిసి కొత్త బంతిని పంచుకునే ఆ ‘సీక్రెట్’ పేసర్ ఎవరు..?
-
Wamiqa Gabbi: ఇంతకాలం ఎక్కడున్నావమ్మా.. ఒక్క సినిమాతో వామిక గబ్బికి ఫుల్ డిమాండ్!
-
Attacks on Indians abroad: అమెరికా, యూకే, కెనడాల్లో భారతీయులపై పెరిగిన దాడులు..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!