ఏపీలో కోవిడ్ పరిస్ధితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ సమీక్షించారు. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులను అధికారులు వివరించారు. థర్డ్వేవ్ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు.
రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు
రాష్ట్రంలో 2.11 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటుగా వుంది. మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్నిజిల్లాల్లో 3 శాతానికి లోపలే పాజిటివిటీ రేటు వున్నది. గడచిన మే నెలలో గరిష్ట కేసుల సంఖ్య 2,11,554 నుంచి ప్రస్తుతం 14,473కి పాజిటివ్ కేసులు తగ్గాయి. దాదాపు 10వేల గ్రామ సచివాలయాల పరిధిలో కేసుల్లేవు. రికవరీ రేటు 98.58 శాతంగా వుంది.
థర్డ్వేవ్ను దృష్టిలో ఉంచుకుని అన్నిరకాలుగా సిద్ధమయ్యామని అధికారులు తెలిపారు. ఇప్పటికే 20,964 ఆక్సిజన్ కాన్ సన్ట్రేటర్లు సిద్ధం చేశామన్నారు. నవంబర్ చివరి నాటికి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కనీసం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ ఇస్తామన్నారు అధికారులు. వచ్చే ఫిబ్రవరి చివరినాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశాలున్నాయన్నారు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అ«ధ్యయనం చేయాలన్నారు సీఎం జగన్. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకిన వ్యక్తుల్లో ప్రభావాలను అధ్యయనం చేయాలి. బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలంటూ వస్తున్న సమాచారం నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలన్నదానిపై ఒక ఆలోచన కూడా చేయాలని జగన్ ఆదేశించారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూరైన తర్వాత ఏరకంగా అడుగులు ముందుకేయాలన్న దానిపై సరైన ఆలోచనలు చేయాలన్నారు.
కర్ఫ్యూ కొనసాగింపు
రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటలవరూ కర్ఫ్యూ కొనసాగింపు జరగనుంది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా పండుగల సీజన్లో జాగ్రత్తలు పాటించాలన్న సమావేశంలో పాల్గొన్నారు వైద్యులు.. వినాయకచవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్న వైద్యాధికారుల సిఫార్సు చేశారు. ఇళ్లల్లో విగ్రహాలు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని, పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు వద్దని వైద్యాధికారుల సిఫార్సు.. నిమజ్జన ఊరేగింపులు వద్దని వైద్యాధికారుల సిఫార్సు చేశారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం ఇచ్చారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవన్న సీఎం.. ఈమేరకు మార్గదర్శకాలు వైద్య ఆరోగ్యశాఖ జారీచేయనున్నది.
సిబ్బంది లేరనే మాట వినిపించకూడదు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకంపై సీఎం సమీక్షించారు. ఖాళీలు గుర్తించి 90 రోజుల్లోగా వారిని నియమించేందుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష జరిపారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత వైద్యులు లేరు, సిబ్బంది లేరనే మాటలు ఎక్కడా వినిపించకూడదన్నారు. నియామకాలు పూర్తైన తర్వాత డిప్యుటేషన్ అనే మాట వినిపించకూడదు. బయోమెట్రిక్తో పక్కాగా హాజరు, పనితీరుపై పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందుల రాకూడదు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ద్వారా సమర్థవంతమైన సేవలు అందాలని సీఎం ఆదేశించారు. ఈమేరకు అధికారులు నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ చేయాలన్నారు.