Tejashwi Yadav: బీహార్లో జేడీయూ బీజేపీ మద్దతుతో సర్కారును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నితీష్ సర్కారు నేడు బలపరీక్షను ప్రవేశపెట్టింది. బలపరీక్షకు ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నితీష్ కుమార్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆపబోయేది మీ “మేనల్లుడే” అని నితీష్ను ఉద్దేశించి పేర్కొన్నారు. బీహార్లో బీజేపీని తాము ఎదుర్కొంటామన్నారు. ముఖ్యమంత్రి మళ్లీ పార్టీ మారరని ప్రధాని హామీ ఇవ్వగలరా అని మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఒక టర్మ్లో మూడుసార్లు సీఎంగా ప్రమాణం చేసిన సీఎంగా నితీష్కుమార్ మిగిలిపోతారని తేజస్వీయాదవ్ పేర్కొన్నారు.
Read Also: Bihar: బలపరీక్షలో నితీష్ కుమార్ సర్కార్ విజయం
ముఖ్యమంత్రి నితీష్ విషయంలో జేడీయూ ఎమ్మెల్యేలు బాధపడతారని.. ఎందుకంటే వారు ప్రజల్లోకి వెళ్తే.. ప్రజల నుంచి వచ్చే పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. మీ నాయకుడు మూడు సార్లు సీఎంగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారని ఏం చెబుతారని ప్రశ్నించారు. గతంలో బీజేపీని తిట్టి.. ఇప్పుడు అదే పార్టీపై పొగడ్తలు కురిపిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇస్తారని జేడీ(యూ) ఎమ్మెల్యేలను తేజస్వీ ప్రశ్నించారు. సీఎం నితీష్కుమార్ను తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామన్నారు. తాను బీహార్లో కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డానని, తొమ్మిది సార్లు ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించినందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ అన్నారు. నితీష్ను తేజస్వి యాదవ్ మామా అని పిలుస్తారనే విషయం తెలిసిందే.